Editorial

Sunday, April 28, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం - రస్కిన్ బాండ్ కథలు తెలుపు

ఈ వారం మంచి పుస్తకం – రస్కిన్ బాండ్ కథలు తెలుపు


‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో రస్కిన్ బాండ్ రాసిన రెండు పెద్ద కథల పుస్తకాలు – శివమెత్తిన నది, నీలం రంగు గొడుగు – పన్నెండో పరిచయం.

రస్కిన్ బాండ్. యాక్షన్ సినిమాలకు జేమ్స్ బాండ్ ఎంత ప్రసిద్ధో పిల్లల కథలకు ఈ బాండ్ అంత ప్రసిద్ధి.

87 ఏళ్ల రస్కిన్ బాండ్ భారత దేశంలో పుట్టిన బ్రిటిషర్. మొదటి కథ ప్రచురితం కావటానికి, రచయితగా ఆదరణ పొందటానికి మొదట ఎంతో కష్టకాలం ఎదుర్కొన్న వ్యక్తి. బ్రహ్మచారిగా మిగిలిపోయి, ఒక కుటుంబాన్నే దత్తత తీసుకుని డెహ్రాడూన్‌లో ఉంటున్న బాండ్ ఇప్పుడు ఇంగ్లీషులో పిల్లల కథలకు అత్యంత ఆదరణ పొందిన రచయిత. పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా కథలు, నవలలు రాశాడు రస్కిన్ బాండ్. 1857 నాటి పరిస్థితులు నేపధ్యంగా అతను రాసిన ‘The Flight of the Pigeons’ అన్న నవలికని ‘జునూన్’ అన్న అందమైన సినిమాగా మలిచారు. పిల్లల కోసం అతను రాసిన కథలు మళ్లీ మళ్లీ సంపుటాలుగా ప్రచురితం అవుతూనే ఉన్నాయి.

మా పిల్లలు అమ్రిత్, భరత్ 7-8 సంవత్సరాల వయస్సులో రస్కిన్ బాండ్ కథలు (ఇంగ్లీషులో) చదివి వినిపిస్తూ ఉండేవాడిని. రస్కిన్ వాళ్లకి ఎంత ఇష్టమైన రచయిత అయ్యాడో తెలియదు కాని లేటు వయస్సులో నేను అతని అభిమానిని అయిపోయాను. పిల్లల కోసం అతను రాసిన కథలన్నీ చదివాను.

వారిని భాగ్యలక్ష్మి, నేను కలిశాం. తన కథలను నేను అనువాదం చేస్తున్నట్టు చెప్పినప్పుడు ‘కంటిన్యూ’ అని అర్థం వచ్చే మాటలు అన్నాడు. ఆ స్ఫూర్తితో ‘The Angry River’, ‘The Blue Umbrella’ అన్న రెండు పెద్ద కథలను అనువదించాను. 2009లో ‘శివమెత్తిన నది’ అన్న పేరుతో ఈ రెండు కథలను మంచి పుస్తకం ప్రచురించింది.

రస్కిన్ కథల తెలుగు అనువాదాలను (రస్టీ సాహసాలు, మంటలు ప్రకంపనాలు) నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. విపుల కోసం నేను రెండు కథలను అనువాదం చేశాను. అతని కథల అనువాదానికి అనుమతి అడుగుతూ అతనికి రెండు, మూడు ఉత్తరాలు రాశాను కానీ ఎటువంటి స్పందన లేదు.

2006-07లో అనుకుంటాను, రస్కిన్ బాండ్ అతని పుస్తకాల ప్రమోషన్ మీద హైదరాబాదులోని ఒక బుక్ షాప్‌కి వచ్చాడు. అక్కడ అతన్ని భాగ్యలక్ష్మి, నేను కలిశాం. ఆయన కథలను నేను అనువాదం చేస్తున్నట్టు చెప్పాను. ‘కంటిన్యూ’ అని అర్థం వచ్చే మాటలు అన్నాడు. ఆ స్ఫూర్తితో ‘The Angry River’, ‘The Blue Umbrella’ అన్న రెండు పెద్ద కథలను అనువదించాను. 2009లో ‘శివమెత్తిన నది’ అన్న పేరుతో ఈ రెండు కథలను మంచి పుస్తకం ప్రచురించింది.

కథలలోకి వెళ్లే ముందు బొమ్మల గురించి కొంచెం చెప్పాలి. సోవియట్ పుస్తకాలు, ప్రత్యేకించి యుక్రేనియన్ జానపద కథలు చూసి ఈ పుస్తకాన్ని రంగుల బొమ్మలతో ప్రచురించాలని అనుకున్నాం. శివమెత్తిన నదికి మా శ్రీకాంత్ బొమ్మలు వేశాడు. రెండవ కథ అయిన నీలం రంగు గొడుగుకి పావని బొమ్మలు వేసింది. అప్పటికి కథా కదంబం 50 కార్డులకు, అంటే ¼ డెమ్మీ సైజులో 200 పేజీలకు పావని రంగుల బొమ్మలు వేసింది. ఫైన్ ఆర్ట్స్‌లో కొత్తగా చదువు పూర్తి చేసిన పావని ఒక సంవత్సర కాలంలో ఈ బొమ్మలను ఎంతో ఓపికగా వేసింది. నీలం రంగు గొడుగు కథకి నలుపు-తెలుపు బొమ్మలో కేవలం గొడుగుకి నీలం రంగు వెయ్యాలని అనుకున్నాం. ఇలా వేయటం తెలుగులో తతలిసారి చేసిన ప్రయోగమనే అనుకుంటున్నాను. పావని ఈ బొమ్మలు ఎంతో ప్రేమతో, ఎంతో చక్కగా వేసింది.

జల్లుగా మొదలైన వాన పెరిగి, పైనుంచి వచ్చే వరదకి క్రమేపీ సీత వాళ్ల గుడిసె మునిగిపోతుంది. అక్కడే ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కుతుంది సీత.

శివమెత్తిన నదిలో సీత అనే అమ్మాయి ఆమె అమ్మమ్మ, తాతయ్యలతో కలిసి నది మధ్య ఒక దీవిలో ఉంటోంది. కోళ్లు, మేకలతో, తన గుడ్డ బొమ్మ మమతతో సీత చాలా ఆనందంగా ఉంటుంది. నదికి వరద వస్తున్న సంకేతాల మధ్య అమ్మమ్మకి బాగా లేకపోవటంతో సీతని ఆ దీవి మీద ఒంటరిగా వదిలి తాతయ్య పట్టణం వెళతాడు. జల్లుగా మొదలైన వాన పెరిగి, పైనుంచి వచ్చే వరదకి క్రమేపీ సీత వాళ్ల గుడిసె మునిగిపోతుంది. అక్కడే ఉన్న ఒక చెట్టు మీదకి ఎక్కుతుంది సీత. వరద ఉధృతికి ఆ చెట్టు పెకిలింపబడి ప్రవాహంలో కొట్టుకుపోతుంటుంది, ఆ చెట్టు మీదే సీత ప్రాణాలు అరచేత పట్టుకుని ఉంటుంది. ఆ సమయంలో కిషన్ అనే అబ్బాయి ఆమెను తన పడవలోకి ఎక్కించుకుని కాపాడతాడు. తాత వెళ్లిన ఊరిలో ఆమెను దింపుతాడు. బజారులో తాతయ్య కనపడగానే ఏ మాటలూ లేకుండానే అమ్మమ్మ చనిపోయిందని సీతకి అర్థమవుతుంది.

సీత తలపుల్లో కిషన్ మెదులుతూ ఉంటాడు. ఒక రోజు ఆ అబ్బాయి వస్తాడు, నదిలో కాళ్లను జారవిడిచి ఆ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యంతో కథ ముగుస్తుంది.

తమ దీవికి తిరిగివచ్చిన తాత, మనవరాలు చెదిరిన జీవితాన్ని మొదటినుంచి నిర్మించుకోవటం మొదలుపెడతారు. సీత తలపుల్లో కిషన్ మెదులుతూ ఉంటాడు. ఒక రోజు ఆ అబ్బాయి వస్తాడు, నదిలో కాళ్లను జారవిడిచి ఆ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యంతో కథ ముగుస్తుంది.

నీలం రంగు గొడుగులో పదేళ్ల బిన్యా అన్నయ్య బిజ్జూ (విజయ్), అమ్మలతో హిమాలయాల్లోని గఢ్‌వాల్‌లో ఉంటోంది. వాళ్లకి కొంత పొలం, కొన్ని ఆవులు ఉన్నాయి. ఆవులను మేపే బాధ్యత బిన్యాది. ఒకసారి పిక్‌నిక్‌కి ఆ ఊరు వచ్చిన వాళ్లల్లో ఒకామెకి బిన్యా మెడలోని పులిగోరు నచ్చుతుంది. పట్నం మహిళ దగ్గర ఉన్న నీలం రంగు గొడుగు తీసుకుని తన పులిగోరు ఇస్తుంది బిన్యా. ఆ కొండ పల్లెలలో ఎవరి దగ్గరా అంత అందమైన గొడుగు లేదు. బిన్యా ఎంతో గర్వంగా, సంతోషంగా దానిని క్షణం కూడా విడవకుండా తిరుగుతూ ఉంటుంది. అందరి కళ్లూ దానిమీదే ఉంటాయి, దానిని తమ సొంతం చేసుకోవాలని అనుకుంటుంటారు. తెరిచి ఉన్న గొడుగు ఒకసారి గాలికి కొట్టుకుపోయి లోయలో పడితే ఏమాత్రం భయపడకుండా వెళ్లి దానిని తెచ్చుకుంటుంది బిన్యా.

టీ దుకాణం నడిపే ముసలి రాం భరోసా కూడా ఆ గొడుగు మీద మనసు పారేసుకుంటాడు.

టీ దుకాణం నడిపే ముసలి రాం భరోసా కూడా ఆ గొడుగు మీద మనసు పారేసుకుంటాడు. తన దగ్గర పనిచేసే రాజారాం అనే పిల్లవాడితో ఆ గొడుగును దొంగలించటానికి ప్రయత్నిస్తాడు. బిన్యా, ఆ తరవాత బిజ్జూ కలిసి అతడిని పట్టుకుని గొడుగును తీసుకుంటారు. ఆ విషయం గ్రామస్తులకు తెలియటంతో రాం భరోసాని నమ్మటం మానేస్తారు, అతని వ్యాపారం పడిపోతుంది. ఆ గొడుగు చిరుగులు పడి, రంగు వెలిసిపోయినప్పటికీ బిన్యా దానిని ఎంతో ఇష్టంగా చూసుకుంటూ ఉంటుంది. ఒక రోజు రాం భరోసా దుకాణం దగ్గర ఆ గొడుగును బిన్యా వదిలి పెట్టి వెళుతుంది. మొదట ఎవరికీ చెప్పకుండా ఆ గొడుగును సొంతం చేసుకోవాలని రాం భరోసా అనుకుంటాడు. కానీ మరుక్షణమే బిన్యాకి దానిని ఇవ్వటానికి ఆమె వెనక పరిగెత్తుతాడు. దానిని బిన్యా తిరిగి తీసుకోదు. ఆ క్షణం ఆ గొడుగు వాళ్లిద్దరిదీ అయింది. ఆ తరవాత అది ఊరందరిదీ అయ్యింది. రాం భరోసా వ్యాపారం తిరిగి పుంజుకుంది. ఒక రాత్రి రాం భరోసా ఇంటికి ఎలుగుబంటి వచ్చింది. జారిపోయిన దాని గోరుతో లాకెట్టు చేయించి బిన్యాకి ఇస్తాడు రాం భరోసా.
ఈ కథ ఆధారంగా 2005లో విశాల్ భరద్వాజ్ చక్కని సినిమా తీశారు.

బాల సాహిత్యం ఎలా ఉండాలి అని చెప్పటానికి నేను ఇచ్చే ఉదాహరణలలో రస్కిన్ బాండ్ కథలు తప్పనిసరిగా ఉంటాయి.

బాల సాహిత్యం ఎలా ఉండాలి అని చెప్పటానికి నేను ఇచ్చే ఉదాహరణలలో రస్కిన్ బాండ్ కథలు తప్పనిసరిగా ఉంటాయి. అతని కథలలో నీతులు ఉండవు, సందేశాలు ఉండవు, ‘స్ఫూర్తిదాయకంగా’, ‘సందేశాత్మకంగా’ ఉండటానికి రాసినవి కాదు. రస్కిన్ బాండ్ రచనలలో చక్కని కథ, ఆకట్టుకునే వర్ణన, మరిచిపోలేని సన్నివేశాలు, హృదయాన్ని తాకే ఉద్వేగాలు ఉంటాయి. ఇవి పిల్లల మనస్సులకు హత్తుకుపోతాయి. ఆ తరవాత ఎప్పుడో సందర్భాన్ని బట్టి అవి మళ్లీ గుర్తుకు వస్తుంటాయి, మనస్సును రంజింప చేస్తాయి, తేలికపరుస్తాయి, ఆలోచింప చేస్తాయి. పెద్దవాళ్ల కథలైనా, పిల్లల సాహిత్యమైనా ఇంతకంటే ఏం కావాలి? అలాంటి రెండు కథలు తెలుగు బాలలకు, పాఠకులకు అందించగలగటం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తినీ ఇస్తుంది.

ఇలాంటి కథలు తెలుగులో విరివిగా రావాలని కోరుకుంటూ, ఆశపడుతూ ఉంటాను.

ఇలాంటి కథలు తెలుగులో విరివిగా రావాలని కోరుకుంటూ, ఆశపడుతూ ఉంటాను. అన్నట్టు, శివమెత్తిన నది ఇప్పుడు మూడవ ముద్రణలో అందుబాటులో ఉంది. 96 పేజీల ఈ పుస్తకం 85 రూపాయలు. పుస్తకం కావాలనుకున్న వాళ్లు ఈ లింకుని క్లిక్ చేయవచ్చు.

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. ఏడవది ‘జీవన గీతం’ . ఎనిమిదవది ‘యుద్ధోన్మాది అమెరికా’. తొమ్మిదవది ‘బార్బియానా బడి పిల్లల నుంచి టీచర్లకు ఉత్తరం’. పదవది ‘ప్రకృతి నేర్పిన పాఠాలు’. పదకొండవది ‘పరుసవేది’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు. వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article