Editorial

Sunday, April 28, 2024
సంపాద‌కీయంఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’ - తెలుపు సంపాదకీయం

ఫక్తు రాజకీయానికి బలైన ‘ధూం ధాం’ – తెలుపు సంపాదకీయం

SARATHI LOGOనిజం చెప్పాలంటే, ‘సాంస్కృతిక సారథి’ అన్న విభాగం ఉద్యమంలో ఎగిసిన ‘ధూం ధాం’కు మారుపేరు. అదిప్పుడు కవి, గాయకులు, కళాకారుల నోటికి కెసిఆర్ వేసిన తాళం అని చెప్పక తప్పదు.

ఇది దశాబ్ది ఉత్సవాల సందర్భం. నేడు ‘సాంస్కృతిక సారథి’ పనితీరుపై కాదు, అసలు దాని ఉనికి పైనే చర్చ జరగాల్సి ఉన్నది. ఆ విభాగాన్ని రద్దు చేసి పాటను విడుదల చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ కళాకారులకు జీవన భృతి కల్పించి వారి కలాలు, గళాలను చుట్టిముట్టిన శృంఖలాలను త్రెంచవలసి ఉన్నదని పేర్కొంటూ రాస్తోన్న పునరాలోచనా వ్యాసం ఇది. తెలుపు సంపాదకీయం ఇది.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

అనేక విధాలా పీడనకు గురైన దశాబ్దాల తెలంగాణ తనను తాను విముక్తం చేసుకోవడానికి ఇక్కడి భూమి పుత్రులను కొందరిని ఎంచుకున్నది. అందులో కెసిఆర్ ఒక పాత్ర అయితే కవులు, గాయకులూ, కళాకారులది మరో పాత్ర. అంతా ఉద్యమ వేదిక మీద సమానమే. కానీ రాష్ట్రావిర్భావం అనంతరం కెసిఆర్ ముఖ్యమంత్రిగా మారాక హెచ్చుతగ్గులు కాన రావడం మొదలైంది. తానే అన్నిటికీ మూలంగా, మలిదశ ఉద్యమానికి తానే ఏకైక నేతగా, జాతిపితగానూ ప్రాచుర్యం కల్పించుకోవడం పెరిగింది. ఉద్యమ ఫలాలపై గుత్తాధిపత్యానికి వారు పూనుకున్నారు. మలిదశ పోరాట రూపాల్లో ముఖ్యమైన ‘ధూం ధాం’ని నీరుగార్చే పనికి పూనుకున్నారు. తద్వారా ప్రజల తరపున నిలబడే కలబడే బలమైన ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేశారు.

వాస్తవానికి మలిదశ ఉద్యమంలో జనించిన ‘ధూం ధాం’ సకల జనుల చేతనకు ప్రతిరూపం. అందులో పాల్గొన్న వేలాది కళాకారులకు పేరుపేరునా గుర్తించి వారికి ఎటువంటి షరతులు లేకుండా జీవన భృతి కల్పించాల్సి ఉండింది. కానీ ప్రభుత్వం వాళ్ళను జీతగాళ్ళుగా మార్చి భజన బృందంగా చేయడం విషాదకరం.

ఒక్క మాటలో ఉద్యమ కారులను ఉద్యోగులుగా మార్చిన ప్రభుత్వం దాన్ని తమ ఘనతగా చెప్పుకుంటూ ఉన్నది గానీ ప్రజల కేంద్రంగా నడయాల్సిన అట పాట మాటను రద్దు చేసి ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడిందనే చెప్పాలి.

celebrations logoరాష్ట్రం ఏర్పడగానే చేయాల్సిన పనుల్లో మొదటి ప్రాధాన్యత అమరుల కుటుంబాలన్నిటినీ
గుర్తించి వారికి అన్ని విధాలా అండగా ఉండవలసింది. తర్వాత ఉద్యమకారుల కోసం ఒక సంక్షేమ శాఖను గానీ లేదా ఒక ట్రస్టును గానీ రూపొందించి అందులో మొదట ‘ధూం ధాం’లో పాల్గొన్న వారు మొదలు విద్యార్థి వీరులు, పాత్రికేయులు మొదలు రాష్ట్ర సాధన కోసం మడమ తిప్పకుండా పోరాడిన వారందరికీ జీవన భృతి కల్పించవలసింది. కానీ ప్రభుత్వం ఆ దిశలో పనిచేయకుండా వారిని నిర్లక్ష్యం చేసింది. అదే సమయంలో తమకు విధేయంగా ఉండే గుప్పెండు మందికి పదవులు అందించి వారిని చూపిస్తూ వెనకాల వేలాది మంది పోరాట కారులను నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. దశాబ్ది ఉత్సవాల సంధర్భంగా ఒక్క ధూం ధాంను సమీక్షించుకుంటే జరిగిన అన్యాయం సులభంగా బోధపడుతుంది.

లుప్తమైన పాట

మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలక పాత్ర వహించినది ‘పాట’. అది ఆటా పాటాగా మారి సబ్బండ వర్గాల కళాకారులందరినీ కలుపుకొని వేదిక మీద ఆటా పాటాగానే కాకుండా మాటగా (ప్రసంగం)నూ మారి తెలంగాణా ప్రజానీకంలో ఉద్యమ చేతనను ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. అది ‘ధూం ధాం’గా ఎగిసి ఒక్క తెలాంగాణలోనే కాదు తెలంగాణా ప్రజానీకం ఎక్కడుంటే అక్కడ ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శనలతో సకల జనులను అపూర్వంగా సంఘటితం చేసింది. మలిదశ తెలగాణ ఉద్యమంలో ఉనికిలోకి వచ్చిన అటువంటి అసామాన్యమైన సంఘటిత కళా వేదిక ‘ధూం ధాం’ రాష్ట్రం ఏర్పాటయ్యాక కెసిఆర్ సూచనలతో సాంస్కృతిక సారథిగా మారింది. కానీ ప్రభుత్వం ఏర్పాటుకు ముందే కెసిఆర్ ఇక నుంచి తమ పార్టీ ఫక్తు రాజకీయ పార్టీ అని ఒక వైపు ప్రకటించి అప్పటిదాకా అలుపెరగక పోరాడిన ధూం ధాం బృందాన్ని మరోపక్క ప్రభుత్వంలో విలీనం చేసుకొన్నారు. ఇది ద్వంద పోకడకు మంచి ఉదాహరణ. ఇలా ఆ సృజన శీలురందరినీ అటు ప్రజలకు, ఇటు కళకు దూరం చేసి కేవలం ఉద్యోగులుగా మార్చివేయడం ఇప్పటికైనా చెప్పుకోవలసిందే.

వాస్తవానికి ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తి నుంచి వైదొలగినప్పుడు ఈ పని చేయవలసింది కాదు. కానీ ధూం ధాం వేదికను సాంస్కృతిక సారథిలో  కలుపుకోవడం అన్నది పూర్తిగా స్వప్రయోజనాలకే అన్నది ఎవరికైనా అర్థమవుతుంది.

పదిహేను వందల మందిలో 583 మందికే…

కొంచెం లోతుగా మాట్లాడుకుంటే, నాటి ఉమ్మడి పది జిల్లాల నుంచి దాదాపు వేయి నుంచి పదిహేను వందల మంది దాకా కవులు, గాయకులూ, వివిధ రకాల కళాకారులు రేయింబవళ్లు ‘ధూం ధాం’లో గొప్పగా పని చేశారని మనకు తెలుసు. వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పిన సాంస్కృతిక సారథి ఇప్పటిదాకా దాదాపు రెండు విడతల నియామకం అనంతరం కేవలం 583 మందిని మాత్రమే ఉద్యోగులుగా చేర్చుకున్నదని కూడా గమనించాలి. ఒక రకంగా అమర వీరుల కుటుంబాల విషయంలోనూ ఇదే జరిగింది. సగం మందికి కూడా ప్రభుత్వం అండగా నిలబడలేదని ఈ సందర్భంగా మనం యాది చేసుకోవాలి.

మొదట పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా 550 మంది దాక తీసుకోగా ఆ తర్వాత తమకు కూడా అర్హత ఉందన్న కారణంగా చేపట్టిన ఆందోళనలు, రకరకాల విమర్శలు, ఆరోపణల కారణంగా కోర్టు జోక్యం చేసుకొంది. నోటిఫికేషన్ ఇచ్చి ఒక క్రమ పద్దతిలో తిరిగి నియామకాలు జరపాలని తీర్పు ఇచ్చింది. దానివల్ల మరొక 43 మందిని చేర్చుకున్నారు. నిజానికి రాష్ట్ర వ్యాపితంగా పని చేసిన వాళ్ళలో సగం కన్నా తక్కువ మందిని మాత్రమే ప్రభుత్వం గుర్తించి వారిని సాంస్కృతిక సారథిలో ఉద్యోగులుగా మార్చిందని గమనించక పోతే జరిగిన అన్యాయపు విస్తృతి బోధపడదు కూడా.

వేతన జీవులుగా ఉద్యమకారులు

ఏమైనా, 583 మందితో నడుస్తున్న సాంస్కృతిక సారథిలో హైదరాబాద్ లోనే కాక రాష్ట్రమంతటా కలియ తిరిగుతూ క్రియాశీలంగా ఉండే కవులు, గాయకులూ కళాకారులు ఐదారుగురు లేదా ఒక పదిమంది దాకా ఉంటారని తెలుస్తోంది. మిగతా వారంతా జిల్లాల్లో పని చేసేలా ఉద్యోగాలు ఇచ్చారు. అలా ఉద్యోగం పొందిన ప్రతి ఒక్కరు ‘సాంస్కృతిక సారథి’ కింద లెక్క. వీరంతా తమ జిల్లాలోని సమాచార శాఖకు అనుబంధంగా పని చేయాలి. అంతేకాదు, తప్పకుండా నెలకు ఇరవై ఇదు రోజులు కార్యాలయంలో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అందుకు గాను ప్రభుత్వం తలా ఒక్కరికి 24 వేలా 514 రూపాయల వేతనాన్ని జీతంగా  ఇస్తోంది.

ప్రభుత్వం ఏడాది క్రితం వీరి వేతనాలను పెంచింది కూడా. కానీ PRC అమలు ద్వారా పెరిగిన ఆ మొత్తం 31,780 రూపాయల జీతాన్ని ఎప్పుడెప్పుడు చేతికి ఇస్తారా అని ఉద్యోగులు నేటికీ వేచి చూసేలా చేస్తోంది. దశాబ్ది ఉత్సవాల సందర్భంగానైనా ఆ తీపి వార్త చెబుతారా అని వారంతా ఆశగా చూస్తున్నారు.

వినడానికి ప్రభుత్వం ధూం ధాం కళాకారులందరికీ ఉద్యోగం ఇచ్చినట్లు, ఎంతో ఉదారంగా వ్యవహరించినట్లు అనిపిస్తుంది గానీ అదేమీ లేదని గమనించాలి.

మనకు తెలియంది కాదు, ‘ధూం ధాం’ అంటే ఒక ఐక్యత. అది వివిధ భావ సారూప్యత లేని రాజకీయ నేతలను ఎట్లాగైతే రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఒక్క త్రాటి మీదకు తెచ్చిందో; బతుకమ్మ బోనాలు మొదలు విభిన్న కళా రూపాలను కలగలసేలా చేసిందో, అట్లే, – ఊరూ వాడ, గ్రామం, పట్టణ రాజధానులను, దేశ విదేశాలను తమ కళా ప్రదర్శనలతో ఒక్క చోట కూర్చి మన సాంస్కృతిక ఘనతను, వైవిధ్యాన్ని తెలియజేసింది. ఉద్యమ కాలంలో అది అందరినీ ఒక్క చోట కూర్చోబెట్టింది. ప్రజలను ఒక్క మాట మీదే నిలబెట్టింది. అందరిదీ ఉద్యమ దశలో ఒకే ఆటగా మార్చింది. ఒకే పాటగా చేసింది.

విషాదం ఏమిటంటే రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వాన్ని పొగడటమే అట పాటగా కెసిఆర్ మార్చడం. అత్యంత క్లిష్టమైన సమయంలో అపూర్వంగా ఎదిగి వచ్చిన ‘ధూం ధాం’ స్పూర్తిని ఫక్తు రాజకీయాల కోసం నీరుగార్చేలా చేయడం. ఆ బలగాన్ని, ఆయా ఉద్యమ కారులని సాంస్కృతిక సారథి పేరిట ప్రచార కార్యకర్తలుగా మలివడం.

వంతపాడే ‘ఆటా పాట’ల  బృందంగా సాంస్కృతిక సారథి

నిజానికి ధూం ధాంలో ఆడి పాడిన వాళ్ళలో గూడ అంజన్న, గద్దర్, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయ రాజ్ వంటి వారు అప్పటికే ఉద్దండులైన కవి గాయకులు. వాళ్ళు గొప్ప సాంస్కృతిక యోధులు. వారితో పాటు ఇక్కడే తమ కలం గళం పాదాలను సవరించుకుని ఎదిగిన యువతరమూ పెద్ద ఎత్తున మలిదశ ఉద్యమం చివరి ఐదేళ్లలో ఎదిగి వచ్చింది. ఆ మొత్తం చేతనను కెసిఆర్ ఈ సారథి ద్వారా నీరుగార్చారని చెప్పడానికి వేనుకాడనక్కర లేదు. అదే సమయంలో మరికొందరు ఉద్దండులైన కవి గాయకులను ప్రభుత్వానికి విధేయంగా మార్చుకొని తెలంగాణాలో పాట అన్నది ప్రభుత్వానికి వంతపాడేదిగానే మార్చి వేశారు. అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన తరుణం దశాబ్ది ఉత్సవ సందర్భం కాకుండా మరొకటి లేదనే ఈ సుదీర్ఘ వ్యాసం.

స్వరాష్ట్రం ఏర్పాటుకు ముందు అప్రకటిత తెలంగాణ జాతీయ గీతంగా మారు మోగిన ‘జయ జయ జయహే తెలంగాణా’ గీతాన్ని చాలా వరకు నేనే రాశానని కెసిఆర్ అన్న కారణమో లేక ఆయనకు కనుసన్నల్లో ఉండలేని స్థితి కారణంగానో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కెసిఆర్ అందెశ్రీల మధ్య దూరం పెరిగింది. దాంతో ఆ పాట రాష్ట్ర గీతంగా కాకుండా పోవడం తెలిసిందే. అలా అందెశ్రీ ప్రభుత్వానికి దూరంగా ఉన్నారు. ‘నిప్పులవాగు’లా ఉన్నారు.

విప్లవాల నుంచి సామాజిక సమస్యల దాకా గళ మెత్తిన కవి జయరాజ్ గారు కూడా అనంతరం ప్రకృతి కవిగా మారిపోవడంతో ఆయన ప్రభుత్వానికి చేసే నష్టం ఏమీ లేదనుకున్నట్టున్నారు కెసిఆర్ గారు. వారికి ఎటువంటి ప్రభుత్వం పదవి వరించలేదు.

ఇక, మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశాక పార్లమెంటరీ పార్టీల పట్ల వ్యతిరేకత చూపకుండా ఓటు ద్వారానే సామాజిక విప్లవం వస్తుందని మాట్లాడుతున్న నిత్య సంచలనం – తన తీరం ఏమిటో అంతుపట్టని అగమ్య యుద్ద నౌక -గద్దర్ ఇప్పటికీ ప్రభుత్వానికి దూరంగానే ఉన్నారు. కానీ, చిత్రంగా ఆయన రెండవ విడత కోర్టు తప్పుపట్టిన అంతరం సారథిలో చేరేందుకు దరఖాస్తు పెట్టుకున్నారు. కానీ సరైన ఫార్మిట్ లో ఇవ్వక పోవడం కావొచ్చు లేదా మరే ఏ కారణమో తెలియదుగానీ వారికి ఆ ఉద్యోగం లభించలేదు. పెద్ద పదవేదీ తనను వరించ లేదు.

ఇట్లా -బయట ఉన్న మొదటి తరం కవి గాయకుల స్థితి ఇలా ఉండగా ధూం ధాం సృష్టికర్తగా పేరొందిన అంతడ్పుల నాగరాజు చివరకు సాంస్కృతిక సారథికి దూరమే అయ్యారు. అతడి కృషికి తగిన స్థాయిలో కెసిఆర్ ఉన్నత పదవి ఇవ్వలేదని అందులో చేరలేదని అంటారు. తీరా ఆ తర్వాత చేరుదామని అనుకున్నప్పటికీ రెండవ దఫా ఉద్యోగుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన ‘పరీక్ష’లో ఆయన ‘ఉత్తీర్ణుడు’ కాలేదంటారు. అది నిజంగానే విచిత్రమే. దాంతో ఆయనా ప్రభుత్వానికి దూరంగానే ఉన్నారు.

మొదట చేరినప్పటికీ నేర్నాల కిషోర్- రమాదేవి దంపతులు కూడా ఆ తర్వాత నియామక పత్రాలను చింపేసి బయటకు వెళ్ళారంటే వారేమి అయ్యారో ఇప్పటికీ తెలియని పరిస్థితి.

ఇక, ‘ధూం ధాం’కి కన్వీనర్ గా మొదటి ముంచీ నాయకత్వం వహించి, రాష్ట్ర సాధనలో కీలకమైన ఈ విశాల బృందాన్ని అనితర సాధ్యంగా కోఆర్డినేట్ చేసి, దాన్ని ఉద్యమంలో ఒక అజేయమైన శక్తిగా మార్చిన రసమయి బాలకిషన్ ని సహజంగానే కెసిఆర్ సాంస్కృతిక సారథి చైర్మన్ గా నియమించారు. ఆయన ఒక్కడే ఒక సైన్యం అని కెసిఆర్ కి బాగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని వదులుకోవడం ఇష్టం లేక మధ్యలో కొంతకాలం సారథి బాధ్యతల్లో రసమయి లేకపోయినా మొదటిసారి -మళ్ళీ ఇప్పుడూ (రెండవ విడత) అతడినే కెసిఆర్ చైర్మన్ గా కొనసాగిస్తుండటం విశేషం. అంతేకాదు, మానకొండూరు శాసన సభ్యులుగా కూడా రసమయికి రెండుసార్లు టిక్కెట్ ఇవ్వడమే గాక ప్రజా ప్రతినిధిగా గెలిచిన రసమయికి క్యాబినెట్ హోదాలో సాంస్కృతిక సారథికి చైర్మన్ గా కొనసాగిస్తున్నారు. 

ఉద్యోగ ఆసరా కోసం ఆత్మగౌరవం తాకట్టు!

ఇదిలా ఉంటే, విచారకరమైనది ఏమిటంటే ఉద్యమంలో ధూం ధాంను ఉర్రూతలూగించిన ముఖ్యమైన (ఉద్దండులైన ) కవులు, గాయకులూ, కళాకారులకు ఈ ఉద్యోగం చిన్నదిగా ఉంది. వారు ప్రైవేట్ గా రాసే ఒక్క పాటతోనే మూడు నెలల జీతానికి సరిసమానం సంపాదించుకోగలరు. కానీ, పేదరికం, వేరే అవకాశం లేని స్థితి, స్థిరమైన ఆదయ మార్గాలు లేని వారే ఎక్కువ. అటువంటి వారికి ఈ ఉద్యోగం ఒకింత ఉపశమనం కాదు, గొప్ప ఆసరాగానే మారింది. ప్రభుత్వ ప్రచారానికి తాము సారథ్యం వహించడం ఇష్టం లేకపోయినా అప్పటికే ఐదారేల్లుగా ఉద్యమలో తిరగడం, రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇంట్లో బయటా స్తిరమైన ఆదాయం పొందే మార్గం లేకపోవడంతో అనివార్యంగా వారు చేరిపోయారు. ఐతే, వారికన్నా ఆ వారు ఉద్యోగం చేయడం కెసిఆర్ కి ఎక్కువ ఉపయోగపడింది. దీర్ఘకాలికంగా వారు మాట్లాడకుండా ఉండాల్సిన ఆవశ్యకత కారణంగా తలవంచుకుని ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకొని వీరంతా సాంస్కృతిక సారథిలో కొనసాగుతున్నారు.

సారథి వల్ల నష్ట పోయింది కళాకారులకన్నా తెలంగాణా సమాజం అని చెప్పాలి. వీరంతా స్వతంత్రంగా ఉండి ఉంటే ఎన్ని సమస్యలను ప్రజల తరపున వినిపించేవారో!

మొట్టమొదట మనం గుర్తించాల్సినది ఏమిటంటే, ముందు అన్నట్లు, ఉద్యమ కారులైన వీరంతా ఎటువంటి షరతులు లేకుండా జీవన భృతికి అర్హులు. కానీ ఆ దిశలో కెసిఆర్ గారు ఈ పని చేయకుండా ఎన్నికల్లో గెలిచి వచ్చాక ఇక నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఉండబోదని సూచనాత్మకంగా చెప్పి కూడా ఉద్యమ కారులను తనవైన రాజకీయాలకు బలి ఇవ్వడం, దానికి వీరంతా గొర్రెల మందలా సిద్దం కావడం విషాదం. ఫలితంగా నష్ట పోయింది కళాకారులకన్నా తెలంగాణా సమాజం అని చెప్పాలి. వీరంతా స్వతంత్రంగా ఉండి ఉంటే ఎన్ని సమస్యలను ప్రజల తరపున వినిపించేవారో!

అంతెందుకు, మొత్తం ప్రపంచమే కరోనా బారిన పడి లక్షలాది జనం దిక్కులేని స్థితిలో నడిచి వెళుతుంటే ప్రభుత్వ వైఫల్యం కళ్ళముందు కానవచ్చినా ఒక్క ఆదేశ్ రవి తప్పా ఆ దుఖాన్ని ఆలపించే కవిగాయకులు లేకపాయె. రాజ్యాన్ని ప్రశ్నిస్తూ స్వతంత్ర కార్యాచరణకు తట్టిలేపిన వాళ్ళు చెప్పుకోదగిన స్థాయిలో రాకపాయే. ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనకుండా వందలాది కాలాలు, గళాలు సారథి ఉద్యోగులు మూగపోవడం ఒక వంక, ప్రభుత్వ పదవుల కోసం ఉద్దండులైన మరికొందరు కవులు వేచి ఉండటం వల్ల మరో వంకా ఈ దశాబ్ద కాలం ప్రభుత్వం యధేచ్చగా ఇష్టానుసారంగా నడుచుకుందని చెప్పక తప్పదు.

సారథిలో చేరిన చాలా మంది ఇప్పుడు బాధపడుతున్నారు. ఈ తొమ్మిదేళ్ళలో తాము ఏ ఒక్క ప్రజా సమస్యపై నోరు విప్పకుండా మౌనంగా ఉండిపోవాల్సి వచ్చిందని వాపోతున్నారు. “ఉద్యోగం అన్నది మాకు గౌరవమా లేక గుదిబండనా?” తెలియడం లేదని కొందరు అంటుంటే, “ఇది మా బలమా బలహీనతానా? ఇంకా తేల్చుకోలేక పోతున్నామ’ని మరి కొందరు అంటున్నారు. ఏమైనా, గౌరవం ఇచ్చినట్లే ఇచ్చి కెసిఆర్ తమను బందీ చేశారని అత్యధికులు అంగీకరిస్తూనే ఉన్నారు. ఒక రకంగా తెలిసి తెలిసి బురద కూపంలో ఇరుక్కున్న సంకట పరిస్థితిలో సారథి సభ్యులది.

‘సాంస్కృతిక సారథి’ పేరిట ప్రచార సారథ్యం

మొత్తం మీద వీరందరికీ కేవలం ప్రభుత్వం ప్రచార కార్యాక్రమాలకు దోహదపడే పాటలు రాయడం, ప్రదర్శనలు ఇవ్వడం తప్పా మరొక ఆచరణ లేదాని గుర్తించాలి.

వాస్తవానికి సాంస్కృతిక సారథి సభ్యులుగా ఉన్న వీరు బహుముఖాలుగా పనిచేయగలరు. ఉద్యమ దశలో ప్రతి పల్లెలో పెల్లుబికిన అనేక ప్రజా పోరాట రూపాలను అక్షరబద్ధం చేయగలరు. తమ నుంచి ఉబికిన వేలాది పాటలను సేకరించి గ్రంధస్థం చేయగలరు. అంతేకాదు, మన భాషా సంస్కృతి సంప్రదాయాలను, ప్రజల ఆచార వ్యవహారాలను, మారుతున్న వారి జీవన స్థితిగతులను పరిశోధించి తిరిగి పునర్ నిర్మాణ దశలో ప్రజల్లోకి తేగలరు. ఇంకా ఎన్నో చేయగలరు. కానీ వారికి ఆ అవకాశం లేదు. ఉన్న కార్యం ఒక్కటే- అది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేర్చడం. అందుకు కావాల్సిన రచనలు చేసి ప్రదర్శనలు ఇవ్వడం. ఈ రెండు పనుల నిర్వ్గాహణ కోసం ఏర్పాటు చేసిన విభాగానికి కెసిఆర్ ‘సాంస్కృతిక సారథి’ అన్న పేరు పెట్టడం ఒక అభాస. హాస్యాస్పదం.

విషాదం ఏమిటంటే, ఉద్యోగంలో చేరిన వారంతా మలి తెలంగాణా దశలో తాము నెలకొల్పిన ఒక నూతన సంస్కృతిని తిరిగి తామే లుప్తం చేశారని కూడా చెప్పక తప్పదు.

కాగా, మీకు తెలుసు. ఈ 583 మందిలో ఎక్కువకు ఎక్కువ ఎనభై మంది వరకూ వారికంటూ గుర్తింపు, సొంత అస్తిత్వం ఉన్న వారే. మిగతా వారు సాధారణ దళిత బహుజన కవులు, గాయకులూ, కళాకారులు. వారందరిలో కనీసం చురుకైన ఎనిమిది మందో లేదా చెప్పుకుంటే ఏనభై మంది కోసమో మొత్తం ఐదు వందల మందిని కెసిఆర్ కట్టడి చేయడం గమనార్హం. దీంతో వారంతా తమ ప్రజా క్షేత్రం నుంచి చేయవలసిన పని మానేసి కేవలం ప్రభుత్వం ప్రచారానికి నడుం కట్టిన ఫలితంగా తమ స్వేఛ్చా స్వాతంత్రాలకు, ఆత్మగౌరవానికి ప్రతి బంధకం ఏర్పడింది. వారి ఉద్యమ చేతన, వారి సృజన శక్తి నీరుగారి పోయింది.

ముఖ్యులు వీరే…

మరో విషయం. ప్రభుత్వం సారథిలో ఈ కవులు, గాయకులూ, కళాకారులను వేరువేరు హోదాల్లో నియమించలేదు. అందరినీ సమానంగానే చూసింది. ఒకే వేతనం ఏర్పాటు చేసి నియమించింది. ఇందులో కవులు రాస్తారు. గాయకులూ పాడుతారు. కళాకారులు ఆయా పాటలు’ స్కిట్స్ అభినయిస్తారు లేదా ప్రదర్శిస్తారు.

సారథిలో నియామకమైన కవుల్లో ముఖ్యమైన వారు -యశ్ పాల్, అభినయ శ్రీనివాస్, కొదారి శ్రీను, అంబటి వెంకన్న, చంద్ర ప్రకాష్, దయా నర్సింగ్, మిట్టపల్లి సురేందర్, గిద్దె రామనర్సయ్య తదితరులు.

గాయకుల్లో ముఖ్యులు గర్జన, కందుకూరి శంకర్ బాబు, తేలు విజయ, పద్మావతి, స్వర్ణ, అనిల్, బండ వెంకన్న, గడ్డం సతీష్ తదితరులు.

కళాకారుల్లో ప్రముఖులుగా చెప్పుకోదగిన వారు కందుకూరి అనిల్, మాపల్లె శంకర్, వెన్నెల నాగరాజు, వేముల నరేష్, జయ ప్రకాష్, దుర్గేశ్, రాచకొడ రంగన్న, మహ్మద్ జహంగీర్ తదితరులు. మహిళల్లో వల్లాల వాణి, ఈదునూరి పద్మ, వేముల పుష్ప, జలజ, మామిండ్ల మౌనిక, చైతన్య తదితరులు.

ముందే చెప్పినట్లు 583 మందితో ఏర్పడిన సాంస్కృతిక సారథిలోని స్టేట్ లెవల్ లో కలియతిరిగే బృందంగా కొందరు పనిచేస్తే మిగతా వారి జిల్లాల్లో విధులు నిర్వహిస్తారు. రాష్ట్ర స్థాయిలో చురుగ్గా ఉండేవారిలో చైర్మన్ రసమయి కాకుండా యశ్ పాల్, అభినయ శ్రీనివాస్, కోదారి శ్రీను, అంబటి వెంకన్న, చంద్ర ప్రకాష్, జలజలు ముఖ్యులని తెలిసింది.

 చెబితే బాధగా ఉంటుంది గానీ చీప్ లేబర్ గా వీరందరినీ ప్రభుత్వం ఉపయోగించుకున్నదని చెప్పవలసి వస్తుంది.

ఐతే, ఉద్యోగుల ఎంపిక అన్నది సరిగా జరిగి ఉంటే ప్రతి జిల్లా ప్రాతినిధ్యం ఇంకా అధికంగా ఉండేదని, ప్రస్తుతం కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచే దాదాపు రెండువందలకు పైగా నియమితులు కాగా మిగతా అన్ని జిల్లాల నుంచి మూడొందల మందే ఉంటారని తెలిసింది. ఏమైనా, వీరంతా ఏమీ చేయలేదని అనుకోనక్కర లేదు. ప్రభుత్వ పథకాలపై ఎన్నో పాటలు రాశారు. దాదాపు తొమ్మిదేళ్ళ స్వరాష్ట్ర ప్రయాణంలో వీరంతా నాలుగువేలకు పైగా పాటలు రాశారని చెబుతారు. అంతేకాదు, ఐదుగురు సభ్యుల సంపాదక మండలిగా ఉన్న బృందం ఆధ్యర్వ్యంలో రెండు ఘనమైన పుస్తకాలు వెలువరించారు. అందులో ఒక పుస్తకం పేరు ‘బంగారు తెలంగాణా బాటలో’. ఇందులో మూడొందల పాటలు ఉండగా మరో పుస్తకం పేరు ‘సంక్షేమ స్వరాలు’. ఇందులో ఐదువందలా ఐదు పాటలను గ్రంథస్థం చేశారు. ఐతే, ఇవన్నీ ప్రభుత్వ ప్రచారానికి రాసినవి కాబట్టి ఆయా కవులుకు గానీ ప్రదర్శించిన కళాకారులకు గానీ పెద్ద పేరు  ప్రఖ్యాతి వచ్చినట్టు లేదు. చెప్పదలిస్తే, ఇదంతా ప్రభుత్వానికి ఉపకరించేదే. మరో రకంగా ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చి చేసుకునే ప్రచారానికి తోడుగా ఈ సాంస్కృతిక సారథి బృందం ప్రచారం చేసి పెట్టిందని చెప్పాలి. మరి మాటలో చెబితే బాధగా ఉంటుంది గానీ చీప్ లేబర్ గా వీరందరినీ ప్రభుత్వం ఉపయోగించుకున్నదని చెప్పవలసి వస్తుంది.

ఒక్క మాటలో చెప్పాలంటే వీరందరికి కనీస వేతనం వంటిది ఇస్తూ నోటికి తాళం వేసిందని చెప్పాలి. గడిచిన కాలంలో ప్రభుత్వం కార్యక్రమాల పట్ల, చేపట్టిన వివిధ పథకాల పట్ల, ప్రభుత్వం ఆయా ప్రజా సమస్యల పట్ల చూపాల్సిన ధోరణి లేదా విధాన నిర్ణయాల పట్లా ఇసుమంత వ్యతిరేకత, కనీస నిరసన, విమర్శ, ఆగ్రహం – ఇవేవీ ‘ధూం ధాం’లో పాల్గొన్న కవులు, గాయకులూ, కళాకారుల నుంచి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా ఉండాలని కెసిఆర్ ఆశించారు. అందుకు వీలుగా ‘సాంస్కృతిక సారథి’ని ఏర్పాటు చేశారు. ఆయన ఆశించినట్లే వారంతా ప్రభుత్వంలో చేరి పాటకు, ప్రజలకు, ప్రజా సంస్కృతికి దూరం జరిగారు. నిజానికి ఒక రకంగా దొరల గడికి పాటను కట్టేసుకుని, తాము ఏదంటే అది ‘సై’ అనే భజన బృందంగా సాంస్కృతిక సారథి సభ్యులను మార్చారని చెప్పాలి.

కన్పించే కుట్రలకు ఇష్టంగా బలైన గోరటి…తదితరులు

వాస్తవానికి సారథిలో భాగం కాని, బయట ఉన్న సీనియర్లు చాలా తక్కువే. ,ముందు చెప్పినట్టు -గద్దర్, అందెశ్రీ, జయరాజ్, విమలక్క వంటి ఉద్యమ కారులు పట్టుమని పదిమంది కూడా బయట లేరు. కానీ పాట స్వతంత్రంగా బయట ఉంటే ఎంత ప్రమాదమో తెలిసిన కెసిఆర్ అందరినీ సాంస్కృతిక సారథి ఉద్యోగులుగా మలవడమో లేదంటే, ఉద్దండులైన వారిని ప్రభుత్వంలో భాగం చేయడమో ఒక వ్యూహంగా చెప్పుకోవాలి.

‘పల్లె కన్నీరు పెడుతుందో కన్పించని కుట్రల’ అంటూ తన పాటతో ప్రభుత్వాన్నే మార్చిన పేరును సొంతం చేసుకున్న గోరటి వెంకన్న కెసిఆర్ కి ‘జీ హుజూర్’ అనేలా మారిపోయారు. ఆయనకు కెసిఆర్ ఎం ఎల్ సి పదవి ఇచ్చి ప్రభుత్వంలో భాగస్వామ్యలను చేసిన విషయం తెలిసిందే. ప్రజల్లో తమ సాహిత్యానికి గొప్ప ఆదరణ ఉన్న గోరటి వంటి వారు తలచుకుంటే ప్రజల పక్షం వహించి రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టగలరు. కానీ ఇలాంటి వారికి అవ్వ కావాలి బువ్వా కావాలి కాబట్టి తెలంగాణా వారి పరిణామ క్రమాన్ని చూస్తూ ఉండిపోవాలి వస్తోంది.

మొదటి నుంచి కెసిఆర్ ని వెన్నంటి ఉన్న గాయకుడు, వక్తా – దేశపతి శ్రీనివాస్ ను మొదట్లోనే టీచరు ఉద్యోగానికి దూరం చేసి ముఖ్యమంత్రి తన ప్రత్యేక అధికారిగా చేసుకున్నారు. ఎంతోకాలంగా ఎం ఎల్ సి పదవిని ఆశజూపి ఇటీవలే, అదీ ఎన్నికల ఏడాది అనుకోవచ్చు. ఆ పదవికి నామినేట్ చేసి సంతోష పరిచారు. వీరు కవి నందిని సిద్దారెడ్డి శిష్యులని  చెప్పుకుంటారు. బయట ఉంటే తన ప్రసంగాలతో ప్రభుత్వాన్ని సులభంగా ఇరకాటంలో పెట్టగలరు.

అలాగే మరొక ఉద్యమ కారుడైన సాయిచంద్ ను కెసిఆర్ గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ ని చేశారు. నిజానికి ధూం ధాం నిర్మాణంలో అంతడ్పుల నాగరాజు ఎలా ముఖ్యులో కెసిఆర్ ప్రసంగాలలో సామెతలు, జాతీయాలతో కూడిన చెణుకులకు ( బొంత పురుగునైనా ముద్దు పెట్టుకుంటా -టైపు ) కారణమైన కవి గాయకుడూ వరంగల్ శ్రీనివాస్ కూడా ముఖ్యులే. ‘నూరేళ్ళ మా ఊరు’ ఒక గొప్ప కావ్యం. తాను రసమయి తో సమానమైన పదవిని ఆశించినప్పటికీ ఒక చిన్న ప్రభుత్వం ఉద్యోగిగా ఉన్న అతడికి కెసిఆర్ గారు తనకు డిప్యుటేషన్ పై సాంస్కృతిక సారథి కో ఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చారు. ఆ బాధ్యతల్లోనే ఇప్పటికీ ఉన్నప్పటికీ అతడికి కెసిఆర్ తగిన పదవి ఇవ్వలేదన్న అసంతృప్తితో వారికి దూరంగానే ఉన్నారు. వాస్తవానికి అతడికి బిజెపిలోకి రమ్మని ఆహ్వానం ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంకెంతకాలం ఇలా వారు ‘సమదూరం’లో ఉంటారో చూడాల్సిందే.

ఇక, ఎపూరి సోమన్న. తాను మటుకు మొదట సారథిలో ఉండి ఆ తర్వాత ఉద్యోగం కన్నా ఉద్యమమే మిన్న అని బయటకు వచ్చారు. కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నారు. ‘ఎవడి పాలైంది తెలంగాణా’ అని గానం చేస్తూ ఇప్పుడు వై ఎస్ ఆర్ తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారికి వెన్ను దన్నుగా ఉన్నారు.

‘వీరులారా వందనం’ అంటూ అమరులపై గొప్ప నివాళి గీతం రాసి పాడిన విద్యార్థి నేత దరువు ఎల్లన్న ‘సారథి’లో అసలే చేరలేదు. మొదట కాంగ్రెస్ లో తర్వాత ప్రస్తుతం బిజెపిలో ఉన్న ఆయనకు ఇటీవలే సెన్సార్ బోర్డు సభ్యుడిగా పదవి కూడా వరించింది.

ఇందులో చివరగా, సారథిలో ఉంటూనే (ప్రస్తుత) బి ఆర్ ఎస్ సాంస్కృతిక విభాగం బాధ్యులుగా ఉంటున్న కోదారి శ్రీను సంగతి తెలిసిందే. ‘కాళ్ల గజ్జెల గమ్మతి’, ‘ఉండు పైలంగుండు అమ్మ మాయమ్మ ఇల్లు పైలంజూడు తల్లి మాయమ్మ’ వంటిగొప్ప పాటలు రాసిన తాను  అప్పుడప్పుడు నల్లగొండపై తన పాట కూడా కెసిఆర్ రాసినట్లు చెప్పుకోవడం వింటూనే ఉంటాం.

స్వతంత్రత కోసం డిమాండ్ లేకపోవడం కలిసి వచ్చింది

విచిత్రమేమిటంటే సారథిలో చేరకుండా ఉంటామనే డిమాండ్ ఎవరి నుంచి బాహాటంగా మొదట్నుంచీ లేదు. ఉద్యమ కారులుగా మాకు అదే మొత్తాన్ని జీవన భృతిగా ఇవ్వాలన్న డిమాండ్ అప్పట్లో పెద్దగా లేదు. తమ స్వతంత్రత గురించి ఎవరూ అడగక పోవడం విచిత్రమే. అందువల్లే సారథి లో మమ్మల్ని కూడా చేర్చుకోవాలన్న ఆందోళన, డిమాండ్ లు ఉన్నాయే గానీ ఉద్యోగంతో నిమిత్తం లేకుండా తమకు గౌరవప్రదమైన జీవన బృతి పట్ల డిమాండ్ లేదు. అది కదా అసలు పెట్టవలసింది అన్న సొయి లేకపోవడానికి ఎన్ని కారణాలు ఉన్నా కూడా అది ప్రజలకు నష్టం చేసిందనే చెప్పాలి. వారి అంగీకారం ఉదాసీనత కెసిఆర్ కు కలిసి వచ్చింది.

ఒక రకంగా కెసిఆర్ దూర దృష్టిని ఈ బృందం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోవాలా లేక తెలంగాణా భవిత పట్ల వారికి ఉండవలసిన బాధ్యత వీగి పోయిందనుకోవలా అన్నది గట్టిగా చెప్పలేం.

వాస్తవానికి ఆ సమయంలో ప్రభుత్వ గుర్తింపు దొరకడం, ఉద్యోగం రావడం పట్ల వీరంతా ఆనందించారు గానీ సమీప భవిష్యత్తులో తామంతా ప్రజలకు దూరం అవుతామన్న స్పృహ కలగక పోవడం దురదృష్టకరం. ఒక రకంగా కెసిఆర్ దూర దృష్టిని ఈ బృందం సరిగ్గా అర్థం చేసుకోలేదనుకోవాలా లేక తెలంగాణా భవిత పట్ల వారికి ఉండవలసిన బాధ్యత వీగి పోయిందనుకోవలా అన్నది గట్టిగా చెప్పలేం. మొత్తం మీద ‘ధూం ధాం’ అన్నది సాంస్కృతిక సారథిలో విలీనం కావ డం చారిత్రక తప్పిదమే అని చెప్పక తప్పదు.

విషాదం ఏమిటంటే, ఇందులోని ఉద్యోగులకు ఇప్పటికీ జీతం తప్పా మరొక సౌకర్యం లేదని తెలుస్తోంది. నిజానికి ఇరవై ఇదు వేలు అంటే అది చాలీ చాలని జీతం కిందే లెక్క. పేదరికం, అప్పులు, వివిధ కుటుంబ సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది అసరాగానే చెప్పుకోవాలి. ఐతే, సారథి సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో మరణించినా లేదా మరే కారణంగానైనా వారి ప్రాణాలు పోయినా కుటుంబ సబ్యులకు చాలా ఇబ్బంది. చనిపోయిన వారి కుటుంబాలకు సారథి నుంచి సహకారం లభించే పరిస్థితి లేదు. దాంతో సారథి సభ్యులే ఒక ఉద్యోగ సంఘంగా ఏర్పడి తమకు ఎదురవుతున్న వివిధ సమస్యలను పరిష్కరించుకుంటూ ఉన్నారు. ఎవరైనా చనిపోతే సదరు వ్యక్తి కుటుంబ పరిస్థితి ఎంతమాత్రం బాగా లేకపోతే ఉద్యోగులే తలా వేయి రూపాయలు వేసుకొని ఐదు లక్షల దాకా ఆయా కుటుంబాలకు ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి.

ఇట్లా నలుగురైదుగురు సారథి సభ్యులు చనిపోవడం, విరాళాలు వేసుకొని ఆదుకున్న ఉదంతాలూ ఉన్నవి. వారిలో ఉమ్మడి నల్లగొండకు చెందిన వేణు కొండల్, పైలం సంతోష్, గద్ద కరుణాకర్ ల కుటుంబాలకే కాక వరంగల్ జిల్లాకు చెందిన కొంకాల శంకర్, మెదక్ జిల్లాకు చెందిన దేవదాసు, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సురేందర్ కుటుంబాలను సహా కళాకారులే అండగా నిలబడ్డారని తెలిసింది. ప్రస్తుతం గిద్దె రామ నర్సయ్య అన్న కవి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నారు. అయనకు వైద్య ఖర్చులకు గాను ఆర్థిక సహాయాన్ని కోరుతూ మిత్రులు కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన విషయం మీలో కొందరి చూసే ఉంటారు.

ప్రజల ఆకాంక్ష నుంచి జనించిన ‘ధూం ధాం’ తిరిగి ఎప్పటికీ ప్రజా క్షేత్రాన్ని వీడకుండా అవసరమైనప్పుడు తిరిగి కలబడేలా ఆయా కళాకారులను అండగా చూసుకోవలసింది. కానీ రాజకీయ జేఏసి విచ్చిన్నం కావడం, ఛేవలేని ప్రతి పక్షం ఉండటం, సమాజంగా మన ఉదాసీనత -ఇవన్నీ కెసిఆర్ కి కలిసి వచ్చాయి.

మొదట చెప్పినట్టు, అమరుల కుటుంబాల మాదిరిగానే ఉద్యమ పోరుబాటలో అహర్నిశలు కృషి చేసిన బృందం ‘ధూంధాం’. ఇందులోని ప్రతి వ్యక్తికీ గుర్తింపు, గౌరవం దక్కాలి. నిజానికి వీరంతా ప్రభుత్వం ఏర్పాటయ్యాక బాజప్తా ఉద్యమ కారులుగా లబ్ది పొందవలసిన వారు. సాంస్కృతిక సారథి కింద వీరిలో ఉద్యోగం వచ్చిన ఆరొందల మంది కాకుండా ఇంకా బయట ఉన్న వేయి మందిని కూడా ఎక్కడికక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా గుర్తించి అందరికీ గౌరవ భృతి కలిగించ వలసి ఉంది. వారిని ప్రభుత్వం తమ తాత్కాలిక ప్రయోజనలకోసం ఉద్యోగులుగా మార్చకుండా ఉద్యమ కారులుగా సగౌరవంగా స్వేఛ్చా స్వాతంత్ర్యాలతో ఆత్మగౌరవంతో బతికే హక్కు వారికి ఉన్నది. వారందరికీ ప్రజల సమస్యల గురించి మంచి అవగాహన ఉంది. సమస్యలను ఎలుగెత్తి చాటేందుకు గాను వివిధ సృజనాత్మక రచనలు చేయగల సత్తా ఉంది. వీరిని కాపాడుకోవడం సామాజిక బాధ్యత. ప్రజల ఆకాంక్ష నుంచి జనించిన ‘ధూం ధాం’ తిరిగి ఎప్పటికీ ప్రజా క్షేత్రాన్ని వీడకుండా అవసరమైనప్పుడు తిరిగి కలబడేలా ఆయా కళాకారులను అండగా చూసుకోవలసింది. కానీ రాజకీయ జే ఏ సి విచ్చిన్నం కావడం, ఛేవలేని ప్రతి పక్షం ఉండటం, సమాజంగా మన ఉదాసీనత -ఇవన్నీ కెసిఆర్ కి కలిసి వచ్చాయి. పథకం ప్రకారం వీరిని దెబ్బ తీశారు.

మరో రకంగా చెబితే, కెసిఆర్ ఎలాగైతే ఉద్యమ పార్టీ ఐన టిఆర్ ఎస్ ను వారు ఫక్తు రాజకీయ పార్టీగా ఎలా  మార్చారో, ఆఖరికి దాని పేరు కూడా మార్చి తెలంగాణా ఊసేలేని బిఆర్ ఎస్ గా చేశారో సరిగ్గా అదే మాదిరిగా నిజ అర్థంలో సాంస్కృతిక సారథులుగా ఉండాల్సిన కవులు, గాయకులూ, కళాకారులను ఆయన వట్టి ఉద్యోగులుగా మార్చారు. ఇది ఈ దశాబ్ది విషాదం. ఈ క్రమాన్నంతటినీ ఒళ్లంతా కళ్ళుగా చేసుకొని చూస్తున్న కళాకారులు ఇంకా బ్రమలో లేకపోయినా సాలెగూడు వంటి ‘సాంస్కృతిక సారథి’లో చిక్కుకు పోయారనే చెప్పాలి. వారు వెనక్కు రాలేరు. ముందుకు పోలేరు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇదీ వారి సంకట పరిస్థితి.

సాంస్కృతిక సారథి బదులు ఉద్యమకారులకై సంక్షేమ శాఖ

ఏమైనా, ప్రజల తరపున నిలబడాల్సిన తెలంగాణా పాట స్వరాష్ట్రంలో లుప్తమైనది. ఉద్యమంలో మహోన్నతంగా ఆడి పాడిన ‘ధూం ధాం’ ప్రభుత్వ బందీ ఐనది. సందేహం లేదు, ఈ తొమ్మిదేళ్ళ ప్రస్థానంలో దీన్ని విషాద అంకంగానే చూడాలి. అదే సమయంలో ఇక్కడే ఒక పరిష్కారం కూడా వెతుక్కోవాలి. తక్షణం అన్ని రాజకీయ పక్షాలకు కలిసి కట్టుగా ఒక మాట చెప్పుకోవాలి. ఈ విభాగాన్ని రద్దు చేసి పాటను విడుదల చేసుకోవలసిన అవసరం సమాజంగా మన అందరిదీ అని నమ్మబలకాలి. వచ్చే ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా సారథి స్థానంలో ఒక సంక్షేమ శాఖ ఏర్పాటు గానీ లేదా అవసరమైన నిధిని గానీ ఏర్పాటు చేసుకోవాలె. ఉద్యమ కారులు మొదలు ఈ కళాకారులందరికీ జీవన భృతి కల్పించేందుకు వారికి అండ దండలకు నూతన ఆలోచన చేయాలే. వీరి కలాలు, గళాలను చుట్టిముట్టిన దాస్య శృంఖలాలను త్రెంచి గౌరవంగా జీవించడానికి వీలుగా ఇటువంటి ఒక మంచి డిమాండ్ పెట్టగలగాలి. అప్పుడే ‘ధూం ధాం’ గా ఎగిసిన నాటి ఉద్యమానికి గౌరవం. సాధించుకున్న స్వరాష్ట్రానికి సముచిత గౌరవమూ, అమరుల త్యాగాలకు సార్థకతా.

ఈ దిశలో ఒక చిన్న ఆలోచనకు తావిచ్చినా చాలని  తెలుపు సంపాదకీయం, దశాబ్ది ఉత్సవాల ప్రత్యకం.

కందుకూరి రమేష్ బాబు దశాబ్ది ఉత్సవాలపై రాసిన ఇతర వ్యాసాలు…

ఉత్సవ తెలంగాణ – వాస్తవ తెలంగాణ

ఖాళీ సీసాలు – ఉత్సవ తెలంగాణ

‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!

భూస్వాముల స్వీట్ రివెంజ్ : రైతు బంధు

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article