Editorial

Wednesday, May 1, 2024
Opinion‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!

‘తెలంగాణా’కు లేని తెలంగాణ జర్నలిస్టులు!

పదేళ్ళ తెలంగాణా రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాజకీయలకు లోబడి జర్నలిస్టుల స్వతంత్ర కార్యాచరణ వీగిపోయిందని, అందులో ఎక్కువ నష్టపోయింది మొట్ట మొదటగా లేచి నిలబడిన, ఉద్యమ చేతన గల ‘తెలంగాణా జర్నలిస్టు ఫోరం’ అని, వాస్తవానికి “తెలంగాణా కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అన్న డిమాండ్ తో ఏర్పడిన ఈ సంస్థ వైఫల్యం మామూలు విషయం కాదని నేరుగా చెప్పక తప్పదు.

దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైఫల్యాలను చెప్పుకోవడంలో పునరాలోచన, ఒక మెలుకువ తిరిగి మరింత బాధ్యతగా నడుచుకోవడానికి వీలుండాలనే.

కందుకూరి రమేష్ బాబు

“తెలంగాణా కోసమే తెలంగాణా జర్నలిస్టులు” అంటూ ప్రారంభమైన ‘తెలంగాణ జర్నలిస్టు ఫోరం’ స్థాపించి నేటికి సరిగ్గా ఇరవై రెండేళ్ళు. 2001 మే 31 న అల్లం నారాయణ గారి అధ్యక్షతలో ఏర్పాటైన ఈ సంస్థ (TJF) తెలంగాణ రాష్ట సాధనలో తలమానికమైన పోరాటం చేసింది. దీని కృషిని నమోదు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజానికి రాష్ట్ర సాధనలో చివరి అంకంలో ముందకు వచ్చిన, 2009 లో కోదండరాం గారి ఆధ్య్వర్యంలో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ (TJAC) కన్నా దీని కృషి మిన్న. ప్రభావశీలం.

రాష్ట్ర సాధనకు మద్దతు కూడగడుతున్న మొదటి దశలో కేవలం తెలంగాణా రాష్ట్ర సాధన ఒక్కటే లక్ష్యంగా అన్ని భావజాలాలను పక్కన పెట్టి వేర్వేరు రాజకీయ పార్టీలను ఒక్క తాటి మీదకు తేవడంలో, రాజకీయ నేతలకు తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాల గురించిన అవగాహనకు, లెక్కలతో కూడిన సమాచారం ఇవ్వడంలో, అవసరమైన విధంగా అసెంబ్లీలో బయటా గొంతెత్తి పోరాడటానికి, మారుమూల గ్రామాలు మొదలు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దేశ రాజధాని డిల్లీలోని జర్నలిస్టు లందరినీ ఒక గొడుకు కిందకు తెచ్చి స్వరాష్ట్ర సాధన కోసం నడుం కట్టేలా, ఎప్పటికప్పుడు అవసరమైన కార్యక్రమాలు తీసుకుంటూ బహుముఖ లక్ష్యాలతో నాడు పిడికెడు మందితో ఏర్పడిన సంస్థ ఇది. ఈ సంస్థ ఒక లూస్ ఆర్గనిజేషన్ గా ప్రారంభమైన వేలాది జర్నలిస్టుల మద్దతుగల ఫోరంగా ముందుండి పోరాడిన చరిత్ర నిజంగా ‘చరిత్రకెక్క వలసిన చరిత్ర’. దాని వ్యవస్థాపకుల్లో ఒకరినైన నేను, నేటి స్వరాష్ట్ర దశాబ్ద ఉత్సవాల సందర్భంగా ఆ సంస్థ రాష్ట్రం ఏర్పాటయ్యాక ముఖ్యంగా నేటి తరుణంలో పూర్తిగా తన ఉనికిని కోల్పోవడమే కాదు, తెలంగాణా కోసం తెలంగాణా జర్నలిస్టులు లేని స్థితికి కూడా ఒక రకంగా కారణమైందని చెప్పుకోవడానికి ఈ ఘడియ తప్ప మరో మంచి తరుణం రాదని విచారంగానే రాయవలసి వస్తోంది.

రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఫోరంని రద్దు చేయవద్దు, అది తెలంగాణా కోసం మునుపటిలా స్వతంత్రగా పని చేయనివ్వాలి అని వాదించిన వాడిలో నేనొకడిని. యూనియన్ పనిలో ఉండేవారు ఉంటారు, కానీ ఫోరంకి చిన్నగానైనా పని ఉండాలి. దాని పని ప్రజా క్షేత్రంలో ఎప్పటికైనా మళ్ళీ చిగురించి వట వృక్షంగా మారవచ్చు. ముఖ్యంగా ప్రజల వద్దకు వెళ్లి నివేదికల రూపంలో, క్షేత్రస్తాయి సర్వేల రూపంలో పునర్ నిర్మాణ తెలంగాణా అడుగులను ఎప్పటికప్పుడు భేరీజు వేయడానికి ఫోరంకు ఉన్న వెసులుబాటు, ప్రజల్లో నేతల్లో ఉన్న అంగీకారం కారణంగా దాన్ని ఉండనివ్వాలి అన్న ఆలోచన వీగిపోయేలా చేసారు.

ఆసక్తి ఉన్న వారిని ఫోరం పేరుతో పని చేయనివ్వాలి అన్న ఆశయాన్ని యూనియన్ కన్వీనర్ గా అలాగే తర్వాత ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా రెండు బాధ్యతలను ఎంచుకున్న అల్లం నారాయణ గారు, అలాగే కార్యదర్శిగాను, ఎం ఎల్ ఎ గానూ చాలాకాలం రెండు బాధ్యతలను ఎలిన క్రాంతి గారు, ఇతర ముఖ్య నేతలు వొద్దు, కూడదు అన్నారు.

ఒక్క మాటలో ముందు అన్నట్టు జర్నలిస్టులు తమ వ్యక్తిగత సంక్షేమం పేరిట విశాలమైన తెలంగాణా ఇతివృత్తం నుంచి దూరం జరిగినట్లు అయింది.

యూనియన్ అయ్యాక ఫోరంను చేశారు. ఇదంతా తమ నాయకత్వంలో ఒక వైపు జర్నలిస్టుల సంక్షేమం, మరో వైపు పునర్నిర్మాణం కోసమే అన్నారు. కానీ ఆచరణలో ఈ యూనియన్ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అనుకూలమైన విధానాన్ని తీసుకొని ప్రభుత్వానికి ఒక అనుభంద సంస్థగా మారిపోయిందనే చెప్పాలి. ప్రజల తరపున మాట్లాడే ఏ సందర్భం వచ్చినా మౌనంగా ఉండవలసి వచ్చింది. ఈ పదేళ్ళలో రాష్ట్రం ప్రభుత్వం పని తీరును, దాని మంచి చెడ్డలను విశ్లేషించి ప్రశ్నించే అవకాశం నుంచి పూర్తిగా దూరం జరిగింది. ఫలితంగా తెలంగాణ ఆకాంక్షలు, ఆచరణలో ప్రభుత్వం పనితీరు, రాష్టాభివృద్ధికి ప్రభుత్వం ఎంచుకున్న నమూనా, దానివల్ల జరుగుతున్న పర్యవసానాలు, విద్వంసం, పలు సమస్యలపై దాని వైఖరిని ఎండగట్టే అవకాశం, ఇవన్నీ ముఖ్యమైన అంశాలు కాకుండా పోయాయి, ఒక్క మాటలో ముందు అన్నట్టు జర్నలిస్టులు తమ వ్యక్తిగత సంక్షేమం పేరిట విశాలమైన తెలంగాణా ఇతివృత్తం నుంచి దూరం జరిగినట్లు అయింది. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆ యూనియన్ పరిధిలో ఉన్న నేతలు ఏమైనా రాయగలరా అంటే అది కేవలం ప్రభుత్వ అభివృద్ధిని కీర్తించడమే గానీ పాత్రికేయులకు మౌలికంగా ఉండదగిన విమర్శనాత్మక దృక్పథం నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే అయింది.

దశాబ్ద కాలంలో ప్రభుత్వం ఎక్కడ వైఫల్యం చెందిందో చెప్పే గొప్ప అవకాశాన్ని, నైతికతను బాగా ఆర్గనైజ్ ఐనప్పటికీ కూడా తెలంగాణా జార్నలిస్టుల సమాజం ఒక రకంగా చేజేతల కోల్పోయింది.

నిజానికి యూనియన్ కు ఉన్న పరిమితి అదే. ప్రభుత్వానికి అది దగ్గరగా ఉంటూ జర్నలిస్టుల సంక్షేమం కోసం అనేక అంశాలపై పోరాడి సాధించుకోవాలి. నిజమే. ఆ ఉద్దేశ్యంతోనే యూనియన్ అలా పరిమితికి గురైతే ఫోరం ముందుండి పోరాడేది. కానీ చాలా చాకచక్యంగా ఫోరంను లేకుండా చేసి ఒకరకంగా ఈ నాయకత్వం ఆచరణలో తెలంగాణా ఉద్యమ స్పూర్తికి ద్రోహం చేసినట్టే ఐంది. పునర్ నిర్మాణంలో జర్నలిస్టుల క్రియాశీల పాత్ర సైతం లేకుండా చేసినట్లు అయింది.

దీనికి మరి కొన్ని కారాణాలు కూడా ఉన్నాయి. తెలంగాణా జర్నలిస్టు ఫోరం మాదిరే రాష్ట్రంలో తెలంగాణ అంశాలపై స్వతంత్రంగా పోరాడేందుకు ఏర్పాటైన జర్నలిస్టు వేదికలన్నీ మెల్లగా రాజకీయ పార్టీలకు దగ్గరగా మెలుగుతూ ఆచరణలో విశాల ప్రజా రాశుల కోసమే అని చెబుతూ తెలంగాణా సమాజానికి తీవ్ర నష్టం చేశాయనే చెప్పాలి. అట్లా ఈ సంస్థల వల్ల, ఉద్యమ కారుల చేతులోనే నష్ట పోయింది – సామాన్య తెలంగాణయే.

అల్లం నారాయణ గారు ప్రభుత్వం పై పల్లెత్తు మాట అనడానికి జంకవలసిన అవసరం ఏమిటీ అంటే వారు ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా బాధ్యతల్లో ఉన్న కారణంగానే తప్ప మరొకటి కాదు.

తెలంగాణా జర్నలిస్టు ఫోరం అధ్యక్షులైన అల్లం నారాయణ గారు నమస్తే తెలంగాణా సంపాదకులుగా ఉన్నప్పుడు అది పోరాట బాట. కానీ ఎప్పుడైతే ఫోరం యూనియన్ గా మారిందో వారు ప్రభుత్వంపై పల్లెత్తు మాట అనడానికి జంకవలసిన అవసరం ఏమిటీ అంటే వారు ప్రెస్ అకాడమీ చైర్మెన్ గా బాధ్యతల్లో ఉన్న కారణంగానే తప్ప మరొకటి కాదు. నిజానికి అకాడమీ చైర్మెన్ గా ఉంటూ యూనియన్ కు అధ్యక్షులుగా ఉండటం అన్నది రెండు విధాలా విమర్శ ఉండనీయకుండా చూసుకుంటూ కెసిఆర్ కు గారికి ఉపయోగపడటమే లేదా జర్నలిస్టుల సంక్షేమాన్ని ఇటు వారి నిరసనలను అదుపులో ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నమనే ఎవరికైనా బోధపడుతుంది. తద్వారా తెలంగాణ జర్నలిస్టు ఫోరం లేదా ఆ ఫోరం యూనియన్ గా మారడంతో ఏర్పడిన TUWJ పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మారిపోయింది. దాంతో ఈ యూనియన్ కింద ఉన్న జర్నలిస్టులు ఎవరూ అటు పత్రికల్లో లేదా ఇటు స్వతంత్ర కార్యచారణతో రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే కార్యం నుంచి అనివార్యంగా పక్కకు జరిగారు. ఈ సంస్థ ఒక్కటే కాదు, మరొక జర్నలిస్టు నేత కప్పర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన కార్యాచరణ కూడా అలాగే మారిందనాలి. అది మరొక పార్టీ – భారతీయ జనతా పార్టికి అనుబంధంగా జరిగిందనే చెప్పాలి. అలాగే జర్నలిస్టు ఫోరం మరో ముఖ్య నేత పల్లె రవికుమార్ గౌడ్ మధ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అయన అధ్యర్యంలో ఏర్పాటు చేసిన సంస్థ కూడా మరో పార్టీ అంటే కాగ్రెస్ పార్టీకి దగ్గరైన కార్యాచరణలోకి వచ్చింది. ఇప్పుడు తాను కూడా కెసిఆర్ పక్షాన చేరి ఒక కార్పోరేషన్ చైర్మన్ ఐన విషయం తెలిసిందే.

ఇవన్నీ లేదా వీరంతా నిజానికి తెలంగాణా ప్రజల సమస్యలను పట్టించుకోవడమే ప్రథమంగా ఎంచుకుని తర్వాత రాజకీయాల నీడలో వాటి కార్యాచరణ ద్వితీయంగా మారిపోవడం, ఆయా సంస్థల బలహీనతగా మారిపోవడాన్ని మనం గుర్తించాలి.

celebrations logo

పదేళ్ళ స్వరాష్ట్రం చేసుకోవలసిన ఆత్మ విమర్శలో తెలంగాణా జర్నలిస్టు సోదరులు నా స్పిరిట్ ని అర్థం చేసుకొంటారని, ఇండిపెండెంట్ కార్యాచరణ మించి పాత్రికేయులకు మరొకటి ఉండదని మరొకసారి నొక్కి చెబుతూ వారికి కృతజ్ఞతలతో…

తెలంగాణా ప్రజల ఆకాంక్షలు, వారి భవిత కన్నా ఆయా పార్టీ భావజలాలకు, ఆశయాలకు, తమ తక్షణ అవసరాలకు లోబడి ఈ నేతలు స్వప్రయోజనం ప్రధానంగా పనిచేయడం వలన తెలంగాణ ప్రజల ఇరుసుగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరగవలసిన విశాల కార్యచారణ కుంటూ పడింది. లేదా ఆగిపోయింది. స్వరాష్ట్రంలో జరిగిన అన్యాయాల్లో దీనిపై లోతుగా చర్చించాలనే ఒక అంత విమర్శగా ఈ అంశాన్ని సాహసోపేతంగా నేను ప్రస్తావిస్తున్నాను. ఇప్పటికైనా చెప్పకపోతే అది వ్యక్తిగతంగానే ఉండిపోతుంది. సమాజానికి తీరని హాని అవుతుంది.

పదేళ్ళ తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల సందర్భంగా రాజకీయలకు లోబడి జర్నలిస్టుల స్వతంత్ర కార్యాచరణ వీగిపోయిందని, అందులో ఎక్కువ నష్టపోయింది మొట్ట మొదటగా లేచి నిలబడిన, ఉద్యమ చేతన గల ‘తెలంగాణా జర్నలిస్టు ఫోరం’ అని, వాస్తవానికి “తెలంగాణా కోసమే తెలంగాణ జర్నలిస్టులు” అన్న డిమాండ్ తో ఏర్పడిన ఈ సంస్థ వైఫల్యం మామూలు విషయం కాదని నేరుగా చెప్పక తప్పదు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వైఫల్యాలను చెప్పుకోవడంలో పునరాలోచన, ఒక మెలుకువ తిరిగి మరింత బాధ్యతగా నడుచుకోవడానికి వీలుండాలనే.

ఇవన్నీ బాగా తెలిసినందునే, నిజానికి పైన పెర్కొన్నదంతా తన కనుసన్నల్లో నడిచినందునే – ఇప్పటికీ తెలంగాణ జర్నలిస్టులంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి గౌరవం లేకపోగా చులకన భావం.

ఫోరం వైఫల్యం, యూనియన్ పరిమిత కార్యాచరణ, అలాగే వేరే యూనియన్ కి తెలంగాణా ఉద్యమ చరిత్ర లేని విషయం. ఇవన్నీ బాగా తెలిసినందునే, నిజానికి పైన పెర్కొన్నదంతా తన కనుసన్నల్లో నడిచినందునే – ఇప్పటికీ తెలంగాణ జర్నలిస్టులంటే ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి గౌరవం లేకపోగా చులకన భావం. ఎంత తోస్తే అంత అంత అనగలిగే స్థితిలో ఉన్నారాయన. అంతెందుకు! కోర్టు తీర్పు అనుకూలంగా ఉన్నప్పటికీ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి స్థలం ధారాదత్తం చేయడానికి కూడా వారు వెనుకాడటమే అందుకు మంచి ఉదాహరణ.

జర్నలిస్టుల పట్ల ఇలాంటి ఉదాసీన స్థితి ఈ దశాబ్దంలో జరిగిన మార్పు ఇది. అంతకు ముందు ఆయన మనతో కలిసి నడిచిన పరిస్థితి.

వాస్తవానికి ఈ అంశంలో ‘ఫక్తు’ రాజకీయాలే చేసే ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని నిందించి కూడా ప్రయోజనం లేదు. అన్నీ తెలిసి వ్యవహరించవలసిన మన నాయకత్వం స్వప్రయోజనాలకు తలొగ్గడమో లేదా ఉద్యమ కార్యాచరణ వీడటం చేతనో తెలంగాణకు జరిగిన నష్టంగానే దీన్ని చూడాలి.

పదేళ్ళ స్వరాష్ట్రం చేసుకోవలసిన ఆత్మ విమర్శలో తెలంగాణా జర్నలిస్టు సోదరులు నా స్పిరిట్ ని అర్థం చేసుకొంటారని, ఇండిపెండెంట్ కార్యాచరణ మించి పాత్రికేయులకు మరొకటి ఉండదని మరొకసారి నొక్కి చెబుతూ వారికి కృతజ్ఞతలతో…

 

More articles

4 COMMENTS

  1. ప్రతీ మీడియా,దానిలో పనిచేసే జర్నలిస్టులు ఏదో ఒక పార్టీ కొమ్ము కాయటంతో ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయింది.చాలా వివరంగా, స్పష్టంగా మీ వ్యాసం ఉంది.అభినందనలు.

  2. ప్రస్తుత పరిస్దితులను చక్కగా వివరించారు.

  3. ఉద్యమ సమయంలో జర్నలిస్టులతో కలిసి నడిచిన కేసీఆర్ ఇప్పుడు అదే జర్నలిస్టులకు విలువ ఇవ్వడం లేదంటే ఆ తప్పు బాధ్యత మరిచిన జర్నలిస్టులది. అసలు వృత్తి మీద ప్రేమ, అంకితభావంతో పని చేయడంమాని ఇదో సంపాదనా మార్గంగా ఎంచుకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోతది. నిబద్ధతతో పనిచేసే జర్నలిస్టులతో మరో సంఘం పెట్టండి.

  4. ఎవరి కోసం, దేనికోసం, ఏ లక్షాల కోసం ఉద్యమం చేశారో కాని, అధికారం రాగానే తమ స్వప్రయోజనం కోసం వాటిని సులువుగా మర్చిపోయి, జీహుజూర్ అనడం మొదలు పెట్టారు. ఫలితంగా జర్నలిస్టులను చులకనగా చూడటం నుంచి మొదలై…బరితెగించి అవమానించడం వరకు పరిస్థితి వెళ్ళింది. అయినా ఎలాంటి ఖండనలు లేవు. ప్రెస్ మీట్ లను మనం బహిష్కరించాలన్న సోయి లేకుండా పోయింది. ప్రెస్ మీట్ అంటే కచరా చెప్పేదే వేదం. ఎవరూ ప్రజల కోసం ప్రశ్నలు అడిగే పరిస్థితి లేకుండా పోయింది. అకాడెమి రెండేళ్ల పదవీ కాలం మూడెళ్ళయింది. రెండుసార్లు మాత్రమే ఉండే పదవీకాలం మూడు సార్లు అయింది. రాజు తలచుకుంటే పదవీ కాలానికి పరిమితి లేదు. ఇంకొకరికి చాన్సూ లేదు. సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేకుండా మరొకరు ఆర్టీఐ కమిషనర్ అవుతారు. కొలువుల నియామకాలు చేయకుండా ఉండేందుకు పూర్వశ్రమపు జర్నలిస్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అవుతాడు. మా తెలంగాణలో మీ పెత్తనమేమిటి అని ఆంధ్రా హౌసింగ్ సొసైటీ నాయకులను ప్రశ్నించి, దొడ్డి దారిన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను ఆక్రమించి, ఎన్నికలే లేకుండా ప్రజాస్వామిక పద్ధతినే పరిహాసం జేసినవారు క్రాంతి కారుడు, చీకట్లను పంచినవాడు రవి ఎట్లయితడు? ఎమ్మెల్యే అయినవాడు అసలు సొసైటీ అధ్యక్షుడుగా ఎట్లా కొనసాగుతడు? ఉపాధ్యక్షుడికి ఇప్పుడు మరో పదవి? దీని భావమేమి? వీళ్ళే జాగా తెస్తారు…మన బతుకులు మారుస్తారు అంటూ తెగ ముచ్చట పడిపోతూ బతికే జర్నలిస్టులను చూస్తుంటే ‘ ముజె క్యౌం గుస్సా ఆతా హై ? ‘ ఎందుకంటే … ఆత్మగౌరవాన్ని మీరు తాకట్టు పెట్టారు గనక. కొందరు
    విసిగిపోయి నిరాశా, నిస్పృహలతో ఉన్నప్పుడు, కొందరు కాలం చేసినపుడు, సరే… మంచి చేద్దాం అని, అనుమానాలతోనే హౌసింగ్ సొసైటీ సారథ్యపు దారిలోకి రాగానే నమ్మిన డిస్సెంటర్ల వెన్నుపోటు తో నా ఊహ నిజమైంది. ఏం సాధించారు? ఏదో రోజు మీకు జాగా వస్తుందేమో కాని…పోగొట్టుకున్న గౌరవం తిరిగి రాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article