Editorial

Friday, May 10, 2024
సంపాద‌కీయం20 Years Of TRS: కేసిఆర్ వ్యక్తిత్వంలోని రెండు పార్శ్వాలు – మూడు సూత్రాలు

20 Years Of TRS: కేసిఆర్ వ్యక్తిత్వంలోని రెండు పార్శ్వాలు – మూడు సూత్రాలు

తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది సందర్భంగా నిర్వహిస్తున్న ప్లీనరి సమయంలో చెప్పుకోవలసిన ఒక మాట ఉన్నది. గమనంలోకి తెసుకోవలసిన మూడు సూత్రాలున్నవి. వాటి యాది లేదా తెలుపు సంపాదకీయం ఇది.

కందుకూరి రమేష్ బాబు 

పార్టీ ఆవిర్భవించి దశాభ్ద కాలం నిండిన (20 Years Of TRS) సందర్భంగా 2011లో వి.ప్రకాష్ గారు ఒక పుస్తకం తెచ్చారు. అప్పట్లో అయన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులో ఒకరు, అధికార ప్రతినిధి కూడా. తాను ‘పదేండ్ల ప్రస్థానం’ పేరిట తెచ్చిన ఆ పుస్తకానికి తెలంగాణ సిద్దాంతకర్త ప్రొ.జయశంకర్ సార్ ముందు మాట కూడా రాశారు. అందులో “తెలంగాణ ఉద్యమానికి టీఆర్ ఎస్ ఒక ప్రధాన చోదక శక్తిగా ఆవిష్కారమైంది” అని అభివర్ణిస్తూ ఆ పార్టీ చేసిన పదేళ్ళ కృషికి వారు చక్కటి కితాబునిచ్చారు. అది అక్షర సత్యం. ఆ ముందుమాటలోనే ఉద్యమ నేత కేసిఆర్ వ్యక్తిత్వంలోని రెండు పార్శ్వాల గురించి కూడా రెండు విలువైన మాటలు చెప్పారు. ఒకటి, తెలంగాణ వాదిగా కేసేఆర్ ఘనత. రెండవది రాజకేయ నాయకుడిగా వారి ప్రత్యేకత.

“నేను వ్యక్తిగతంగా గత యాభై ఏళ్ల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన అనేక మంది నాయకులను చాలా దగ్గరి నుంచి చూశాను. కొంతమందితో కలిసి పని చేశాను. వారందరితో పోల్చినప్పుడు చంద్రశేఖర్ గారిది ఒక విశిష్టమైన వ్యక్తిత్వం. తెలంగాణ సమస్యతో ముడివడిన అంశాలన్నిటిని కూలంకషంగా అధ్యయనం చేసి, విమర్శనాత్మకంగా విశ్లేషించి వాటన్నిటిని ప్రజల భాషలో ప్రజలకు వివరించడంలో చంద్రశేఖర్ రావు ఆయనకు ఆయనే సాటి. వాస్తవాలను ఒకవైపు పాలక వర్గాల దృష్టికి తీసుకు వచ్చి, వాటి గురించి జన సామాన్యాన్ని చైతన్య పరిచి వారిని ఉద్యమానికి సమాయత్తం చేయడంలో అయన అసామాన్య ప్రతిభాశాలి అని నేనే కాదు, అయన ప్రత్యర్థులు కూడా అంగీకరిస్తారు.”

నిజమే. సమాజాన్ని ఉద్యమానికి సమాయాత్తం చేయడంలో కేసిఆర్ గారు అద్వితీయ నేత. అది జయశంకర్ సారే అన్నట్టు ఎవరైనా అంగీకరిస్తారు. ఇందులో సందేహం లేదుగానీ వారు చెప్పదలుచుకున్నఈ రెండో మాట చూడండి.

“రెండవది, ఒక రాజకీయ నాయకునిగా చంద్రశేఖర్ రావు వ్యక్తిత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే సమకాలీన రాజకీయ సంస్కృతిలో నిలదొక్కుకావాలంటే ఏ వ్యవహార శైలి అవసరమో అయన అదే అవలంభించారు. దానికి భిన్నంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమయ్యేది”

ఇందులో రెండు కీలక అంశాలున్నై. ఒకటి కేసిఆర్ గారు అవలంభించిన రాజకీయ సంస్కృతి గురించి. అలాగే దానికి భిన్నంగా ఉంటే కష్టమయ్యేదనే అంశాన్ని పేర్కొనడం.

దురదృష్టవశాత్తూ జయశంకర్ సార్ ఈ పరిణామాలను చూడలేకపోయారు. వారు గతించడంతో ఇప్పుడు కేసిఆర్ వైఖరిని, అయన ప్రగతిని తెలంగాణా కోణంలో సమీక్షించే పెద్ద మనుషులు ఎవరూ లేరనే చెప్పాలి.

ఈ రెండు మాటలనూ ఎవరైనా ఒప్పుకుంటారు. నిజానికి ఈ మాటలు ఒక దశాబ్ద క్రితంవి. 2011లో పార్టీ దశాబ్ధపు ఉత్సవాలు జరిపాక మరో మూడేళ్ళకు అంటే 2014కి రాష్ట్రం ఏర్పాటైంది. ఆ తర్వాత కేసిఆర్ గారు తెలంగాణ వాదిగా ఉన్నారా లేదా అని సమీక్షించుకోవడం అంత్యంత కీలకం. అలాగే అయన తర్వాత అనుసరించిన రాజకీయ సంస్కృతి భిన్నంగా ఉండవలసినది కాదా అన్నది చాలా కీలకం.

కాగా, ఆ మేరకు రాష్ట్రం ఏర్పాటయ్యాక లేదా ప్రభుత్వం ఏర్పాటు సమయంలో కేసిఆర్ గారే చెప్పుకున్నట్టు “ఇక నుంచి మాది ఫక్తు రాజకీయ పార్టీ” అన్న విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఒక్క మాటలోనే అయన, అయన పార్టీ – దశాభ్దం క్రితం వేరని, రాష్టం వచ్చాక వేరని స్పష్టంగానే చెప్పారు. ఇక అప్పటి నుంచే అయన ప్రస్థానం భిన్నంగా సాగింది. వారి వ్యక్త్యిత్వంలోనూ రాష్ట్ర సాధన దాకా అవలంభించిన విధానం స్థానంలో పెను మార్పు మొదలైంది. అయన అందరూ అవలంభించే సమకాలీన రాజకీయ సంస్కృతిని అనుసరిస్తూ ఉద్యమ పంథా తాలూకు స్పృహను పక్కకు నెట్టేయడం తెలిసిందే. ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ ఎస్ ను తీర్చిదిద్దడంతో అది ప్రజా క్షేత్రంలో అన్న పార్టీల నేతలను చేర్చుకుని ఒక ఎన్నికల లెక్కల మాయాజాలానికి పరిమితమైన రాజకీయ పార్టీగా మారిందే తప్పా ప్రత్యేక విలువల సౌజన్యానికి దూరమైంది. తెలంగాణా సొయి దూరమైంది. దురదృష్టవశాత్తూ జయశంకర్ సార్ ఈ పరిణామాలను చూడలేకపోయారు. వారు గతించడంతో ఇప్పుడు కేసిఆర్ వైఖరిని, అయన ప్రగతిని తెలంగాణా కోణంలో సమీక్షించే పెద్ద మనుషులు ఎవరూ లేరనే చెప్పాలి. ఉన్నదంతా ఒకటే రకం. ఐతే ఆయన్ని ఆయనన్ని పూర్తిగా అభినందించేవాళ్ళు లేదా ఆయన్ని సంపూర్ణంగా విమర్శించేవాళ్ళు. అంతే తప్పా తెలంగాణా ప్రజానీకం తాలూకు ఉద్యమ ఆకాంక్షల కేంద్రంగా నిలబడి గట్టిగా వారి ధోరణిని తప్ప పట్టి కేసిఆర్ వైఖరిని ప్రజస్వామీకరించే ముల్లుగర్ర లేకుండా పోయిందనే చెప్పవలసి ఉంది.

బహుశా జయశంకర్ సార్ ఉంటే నేటి రెండు దశాబ్దాల టీఆర్ ఎస్ ఉత్సవాల సందర్భంగా అయన మాట లేదా ముందు మాట మరో తీరుగా ఉండేదేమో అన్న అభిప్రాయం వూహాజనితం కాదేమో!

చిత్రమేమిటంటే, ప్రస్తుతం తెలంగాణ వాటర్ రిసోర్సేస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కి చైర్ పర్శన్ గా ఉన్న వి. ప్రకాష్, వారు కూడా తాను వెలువరించిన అప్పటి ‘పదేండ్ల ప్రయాణం’ దగ్గరే నిలిచిపోయారా తెలియదు. ఆ పుస్తకానికి అదనంగా ఈ పదేళ్ళ ప్రయాణాన్ని క్రోడీకరిస్తూ ‘ఇరవై ఏండ్ల ప్రస్థానం’గా తేవలసిన ఆవశ్యకతను ఎందుకో ఫీల్ ఐనట్టు లేదు.

విషాదం ఏమిటంటే, ఆ తర్వాత టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంతో ఏర్పాటైన ప్రభుత్వం జయశంకర్ సార్ పేర్కొన్న మూడు అంశాల నుంచి వైదొలగిందా అన్నది, ఆ సూత్రాలను పునర్ నిర్మాణంలో కూడా అన్వయించుకోవాడలో విఫలమైందా అన్నది గమనంలోకి తీసుకొని చర్చించాల్సి ఉండింది.

మీకు తెలుసు, రెండు దశాబ్దాల క్రితం స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి కేసిఆర్ అధ్యక్షులుగా ప్రారంభమై సకల జనుల సహకారంతో ఆధికారంలోకి వచ్చిందని. మూడే మూడు సూత్రాలు. భావజాల వ్యాప్తి, ఉద్యమ నిర్మాణం, రాజకీయ ప్రక్రియ. ఈ మూడింటి ఆవశ్యకతను నూరి పోసిన ఆచార్య జయశంకర్ సార్ మార్గదర్శకత్వం స్వరాష్ట్ర ఉద్యమానికి ఎంతటి ప్రాధాన్యం వహించిందో కూడా తెలుసు. వారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటును గొప్ప ఆశతో, ఆశయంతో స్వాగతించడమూ అందరూ చూసిందే. వారే, పైన అన్నట్టు, వర్తమాన రాజకీయ పోకడలు తెలిసి, తగిన విధానాలను అవలంభించే సత్తా ఉన్న నేత లభించారని గొప్పగా ఆనందించారు. కేసిఆర్ స్థాపించిన పార్టీతో తెలంగాణ రాష్ట్రం నిశ్చయంగా వస్తుందని గట్టిగా నమ్మరు. వారు నమ్మినట్టే స్వరాష్టం సిద్దించడం ఒక గొప్ప ఉపశమనం. అరవై ఏండ్ల కల సాకారం కావడం చారిత్రాత్మక శాంతి. విషాదం ఏమిటంటే, ఆ తర్వాత టీఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంతో ఏర్పాటైన ప్రభుత్వం జయశంకర్ సార్ పేర్కొన్న మూడు అంశాల నుంచి వైదొలగిందా అన్నది, ఆ సూత్రాలను పునర్ నిర్మాణంలో కూడా అన్వయించుకోవాడలో విఫలమైందా అన్నది గమనంలోకి తీసుకొని చర్చించాల్సి ఉండింది.

నేడు మళ్ళీ జయశంకర్ సారే యాదికి వస్తున్నరు. వారు మూడు సూత్రాలే తిరిగి తెలంగాణ పునర్నిర్మాణానికి, ఈ సమాజాపు ప్రగతికి మార్గదర్శనం అని భావిస్తూ కేసీఆర్ ను అదమాయించే ముల్లుగర్రలు అవే అని తెలుపు సంపాదకీయం ఇది.

టీఆర్ ఎస్ పార్టీ / ప్రభుత్వం తెలంగాణ భావజాల వ్యాప్తి నుంచి పక్కకు జరిగిందా లేదా? ఉద్యమ స్పృహను కోల్పోవడం నిజం కాదా? ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా పునర్ నిర్మాణంలో సైతం కొనసాగించాల్సిన రాజకీయ ప్రక్రియను కాదని గత ప్రభుత్వాల మాదిరి యధావిధి పరిపాలనను స్థిరపర్చుతూ, సకల జనులనూ లబ్దిదారులుగా ఐదేళ్ళ కొకసారి అధికారంలో నెగలడానికి ఉపయోగించుకునే ఓటర్లుగానే చూడటం లేదా?

ద్విదశాబ్ద ఉత్సవాల సందర్భంగా ఈ మూడు అంశాల సంగతి ఏమిటన్నది ప్రశ్న.

వాటిని ఎవరూ విశ్లేషించే స్థితి లేదు. కేసిఆర్ ను పొగడటమో లేదా మిన్నుకుండటమో అన్నదే శ్రేయస్స్జు అనుకున్న కవులు, కళాకారులు, మేధావుల కారణంగా నేడు మళ్ళీ జయశంకర్ సారే యాదికి వస్తున్నరు. వారు మూడు సూత్రాలే తిరిగి తెలంగాణ పునర్నిర్మాణానికి, ఈ సమాజాపు ప్రగతికి మార్గదర్శనం అని భావిస్తూ కేసీఆర్ ను అదమాయించే ముల్లుగర్రలు అవే అని తెలుపు సంపాదకీయం ఇది.

పార్టీకి అధినేతకి ద్విదశాబ్ది ఉద్యమాభినందనలతో …

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article