Editorial

Thursday, May 9, 2024
సంపాద‌కీయంPadma Shri కిన్నెర మొగిలయ్య మనకు థాంక్స్ చెప్పాలా? తెలుపు సంపాదకీయం

Padma Shri కిన్నెర మొగిలయ్య మనకు థాంక్స్ చెప్పాలా? తెలుపు సంపాదకీయం

ఒక మనిషి మనకు కృతజ్ఞతలు చెప్పుకునే దుస్థితి ఎంత దుర్మారమైనదో తెలుపు నలుపు వ్యాసం ఇది.

కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

కాశీలో నేను ఒక గుడి ఫోటో తీశాను. దాదాపు ఐదు వందల ఏళ్లుగా ఆ గుడి కొంచెం కొంచెం ఒరుగి పోతున్నది. పీసా టవర్ కన్నా ఎక్కువ కృంగిన ఆలయంగా దానికి పేరున్నది. ఇంజనీరింగ్ లొసుగులు ఏమైనప్పటికీ అందుకు గల కారణం మరొకటి అని ఒక కథ ప్రాచుర్యంలో ఉన్నది. తనకు జన్మ నిచ్చినందుకు కృతజ్ఞతగా తల్లి పేరిట ఒక రాజు దాన్ని నిర్మించాడట. ఆ సంగతే నిర్మాణం పూర్యయ్యాక తల్లికి చెబుతాడట. అందుకు సంతషించాల్సిన ఆ తల్లి అతడిని శపించిందట. తల్లికి కృతజ్ఞత చెబుతావా…ఎంత అహంకారం అని మందలించిందట. శపించిందట. ఆ కారణంగానే ఆ గుడి ప్రతి ఏటా మరింత కృంగిపోతున్నదని చెబుతారు.

దాని పేరు రత్నేశ్వర్ మహాదేవ ఆలయం. నిర్మించింది రాజో మరొకరో నిర్దారణగ తెలియదు గానీ ఆ తల్లి రత్నాబాయి.

ఈ కథ చెప్పడం ఎందుకూ అంటే కృతజ్ఞతలు చెప్పుకొనే అవసరం గురించి ప్రస్తావించడానికి. అది నిజానికి అవసరమా కాదా అని వివేచించడానికి. ఇది ఆ గుడి పోటో.

మరో కథ కూడా గుర్తుకు వస్తుంది.

విశాఖపట్నం నుంచి కేర్ ఆస్పత్రిలో పని చేసే ఒక డాక్టరు పదిహేనేళ్ళ క్రితం నాకొక ఉత్తరం రాశాడు. ఒక సామాన్యమైన రైతు తన కళ్ళు తెరిపించాడని, ఆ కథ ఎంత విలువైనదో మీరు నలుగురికీ చెప్పమని.

ఆ రైతు చావు బతుకుల మధ్య ఉన్న తన కొడుకును భుజాన వేసుకొని వచ్చాడట, వైద్యం చేపించమని.

డాక్టరు అతడ్ని పరీక్షించి అత్యంత విషమంగా ఉంది పరిస్థితి. చాలా టెస్టులు చేసి అడ్మిట్ చేసుకొని చికిత్స చేయాలి. అందుకు చాలా డబ్బులు ఖర్చవుతాయి అని చెప్పాడట సదరు తండ్రికి. సరే, నా దగ్గర మా ఉన్నయి. మీరు వైద్యం చేయండని చెప్పాడట ఆ తండ్రి.

టెస్టులన్నీ చేసి అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంచారు డాక్టర్లు. రోజులు గడుస్తున్నాయి. రోజుకు ఇంత డబ్బు అంటే అయన కడుతున్నాడు. అది వందలు దాతిండి. వేలు దాటిపోతున్నది. ఇంకా అడిగారు. మారు మాటాడకుండా ఆ తండ్రి చేల్లిస్తున్నాడు. ఒక దశలో అయన వెంటనే కట్టలేక ఒకటి రెండు రోజులు పర్మిషన్ అడిగేవాడు. మొత్తానికి తెచ్చి కట్టేవాడు. ఇంకా అడిగారు. ఇంకా తెచాడు. ఈ సారి నాలుగు రోజులు ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. వచ్చి  ఆ డబ్బులు కట్టాడు తండ్రి.

మొత్తానికి పక్షం రోజుల తర్వాత అత్యంత ఖరీదైన ఆ ఆస్పత్రిలో అమిత శ్రద్ధతో వైద్యలు చేసిన కష్టం ఫలించి ఆ బిడ్డ బతికి బట్ట కట్టాడు.

అయ్యా. నేను చదువులేని వాడిని. ఒక నిరుపేద రైతుని. జీవితంలో జ్వరం ఎరిగింది లేదు. మా ఊరి దాటి మరో ఊరు అవసరం లేకుండా బతికిన వాడిని. చేయి జాచి పది పైసలు కూడా అడిగిన వాడిని కాను.

డిచ్చార్జీ చేశాక తండ్రి కొడుకును తీసుకొని వెళుతున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఈ డాక్టరు అతడిని చూస్తున్నాడు, కృతజ్ఞతలు చెబుతాడేమో అని. కనీసం కృతజ్ఞతా పూర్వకంగా చూస్తాడేమో అని. కానీ అదేమీ లేదు. ఇతడి ముఖం కూడా చూడలేదు.

ఇతడికి సహనం నశించి అడిగేశాడట. ఇంత అన్యాయమా అని! తాము అంత బాధ్యత తీసుకొని రాత్రింబవళ్ళు చేసిన సేవలకు మాట వరసకైనా కృతజ్ఞతలు చెప్పవా? అని.

అందుకు ఆ రైతువిస్మయంతో చూశాడట. డాక్టరు అజ్ఞానానికి ఎం చెప్పాలో తెలియని విభ్రాంతికి లోని ఆఖరికి ఇలా అన్నాడట.

అయ్యా. నేను చదువులేని వాడిని. ఒక నిరుపేద రైతుని. జీవితంలో జ్వరం ఎరిగింది లేదు. మా ఊరి దాటి మరో ఊరు అవసరం లేకుండా బతికిన వాడిని. చేయి జాచి పది పైసలు కూడా అడిగిన వాడిని కాను. భార్యను కూడా కోల్పోయిన వాడిని. ఉన్న ఒక్కగానొక్క కొడుకు వైద్యం కోసం రేపటి గురించి క్షణం కూడా ఆలోచించకుండా నాకున్న యావదాస్తి ఐన ఎకరంన్నర భూమిని పదుగురి కాల్లా వెళ్ళా పడి అమ్మేసి మీకు చెల్లించాను కదా. ఇంత చేసిన నాకు మీరు కృతజ్ఞతలు చెప్పాలి కదా. నన్నడుగుతారేమిటి? అన్నాడట.

ఈ ఉత్తరం రాసిన డాక్టరు కల్లనీల్ల పర్యంతం అవుతూ ఆ ఉత్తరం నాకు రాసి పంపాడు. జీవితంలో కృతజ్ఞతలు ఎవరు ఎవరికీ చెప్పాలో బోధపరిచిన ఆ రైతును తాను ఎన్నడూ మరచిపోలేను. సదా గుర్తు చేసుకుంటాను అని రాశారు.

ఇదిలా ఉంటే ఇంకో కథ కూడా గుర్తుకు వస్తుంది.

హైదరాబాద్ సెక్రటేరియేట్ వద్ద విమలమ్మ అని ఒక అంధురాలు ఉండేది. పదహారేళ్ళ ప్రాయంలో ఇంటి నుంచి పారిపోయి వచ్చి ఆ ఫుట్ ఫాత్ ని ఆశ్రయించి బతికింది. అక్కడే ప్రేమ. పెళ్లి. భర్త పోయాడు కూడా.

బిక్షానికీ ధర్మానికీ తేడా ఉందని తొలిసారిగా ఆ చదువుకొని అంధురాలైన మాతృమూర్తి వద్ద మొదటిసారిగా నేను తెలుసుకున్నాను..అన్నారు జయసుధ గారు..ఎంతో అభిమానంగా.

చూపు లేనందున చిన్నగా తాళం వేస్తూ ఆమె ఎదో సన్నగా పాడేది. దారిన పోయే వారు ఆగి ఎంతో కొంత ఇచ్చేది. అమెకు ఇద్దరు కొడుకులు. వాళ్ళను ప్రయోజకులని చేయాలనీ ఆ డబ్బుతో పిల్లల్ని హాస్టల్లో వేసి చదివించింది. ఇద్దరినీ పోలీసులను చేసింది. ఆ తర్వాత ఆమె ఇక్కడి నుంచి వెళ్లిపోయి ఓక గుడిసే వేసుకొని నేడు ప్రశాంతంగా జీవిస్తోంది.

ఆమె పిల్లలు పోలీసు ఉద్యోగంలో చెరక ముందు ఒక టీవీలో ఒక కథనం చేశాను. సినీ తార జయసుధ తో ఆమెను ఇంటర్వ్యూ చేపించాను. అప్పుడు జయసుధ గారు ఆమెతో ‘ఇలా బిక్షం అడుక్కుంటూ పిల్లల్ని చదివించడం ఎంత గొప్ప పని’ అని ప్రశంసగా అన్నారు. అప్పుడామే జయసుధ చేతులను చేతుల్లోకి తీసుకుని ప్రేమగా  ‘బిక్షం కాదు, ధర్మం అడుక్కుంటున్నాను” అంది.

బిక్షానికీ ధర్మానికీ తేడా ఉందని తొలిసారిగా ఆ చదువుకొని అంధురాలైన మాతృమూర్తి వద్ద మొదటిసారిగా నేను తెలుసుకున్నాను..అన్నారు జయసుధ గారు..ఎంతో అభిమానంగా.

ఇవన్నీ ఎందుకు గుర్తు వస్తున్నాయి అంటే సమాజంలో అట్టడుగున పుట్టి నిస్సహాయ పరిస్థితుల్లో తన కిన్నెరా చేతబట్టి మన వద్దకు వచ్చిన మొగిలయ్య మనకు చేసింది మరచిపోయి మనం చేసింది ఏమిటో గుర్తు చేసుకున్తున్నందుకు…

నిజమే. మనం ఎన్నో చేసి ఉంటాం. కానీ నేడాయన పద్మశ్రీ. ఈ స్థాయికి రావడానికి, పదుగురి దృష్టిలో పడటానికి ఎందరో సహకరించి ఉంటారు. జానపద పరిశోధకులు, రీసెర్చీ స్కాలర్స్, పాత్రికేయులు, వ్యాసకర్తలు, సినీ దర్శకులు, నటులు, సామాజిక సేవకులు, ప్రభుత్వంలో సాంస్కృతిక శాఖా సంచాలకులు, సలహాదారులు, మంత్రులు, చివరకు ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి. పద్మశ్రీ ఎంపిక కమిటీతో సహా. వీరంతా ఉన్నారు. నిజానికి అయన ఎవరెవరికి కృతజ్ఞతలు చెప్పాలి? ఆ వరస క్రమం ఏమిటి?

ఒక జానపద కళాకారుడు కళకు ఆదరణ లేని ఈ రోజుల్లో అనేక నిస్సహాయ పరిస్థితులను తట్టుకుని తననూ తన సాస్కృతిక వాహిక ఐన కిన్నెరను బతికించుకుంటూ ప్రజా పోరాట పోరాట యోధుల గాథలను ఊరూ వాడల్లో అంగళ్ళు మొదలు వెండి తెర మీది వరకూ ఆలపిస్తూ, పిల్లా జెల్లలను పోషించుకుంటూ తాను చావకుండా బతికినందుకు మనం చెప్పాలా కృతజ్ఞతలు లేక అయన మనకు చెప్పాలా?

పద్మశ్రీ రాగానే స్పందించమని అయన ముందు ఎవరో కెమెరా పెట్టినప్పుడు అయన ఒకే పేరు చెప్పలేదు కదా. కొందరినైనా ప్రస్తావించారు కదా.

పద్మశ్రీ రాగానే స్పందించమని అయన ముందు ఆ రాత్రి ఎవరో కెమెరా పెట్టినప్పుడు అయన ఒకే పేరు చెప్పలేదు కదా. కొందరినైనా ప్రస్తావించారు కదా. ఆ క్షణంలో తెలిసో తెలియకో గుర్తు రాకో మనందరి పేర్లను అయన చెప్పనందుకు లేదా ఇప్పటికీ ఇంకా పేరు పేరునా మనల్ని పేర్కొన నందుకు అతడిని మనం ప్రశ్నించాలా?

నిజానికి అయన కృతజ్ఞతలు చెప్పనందుకు మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. నిజానికి వారి స్మృతిలో ఇంకా వీరగాథలున్నందుకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. అయన చేతిలో పన్నెండు మెట్ల కిన్నెర పదిలంగా ఉన్నందుకు మనం కృతజ్ఞతలు చెప్పడం కాదు, మోకరిల్లాలి.

ఈ పద్మశ్రీని ఇకనుంచైనా అపురూపంగా చూసుకొని మురిసిపోవాలి. మన హిపోక్రసీ నుంచి మన లౌకిక చేష్టల నుంచి ఆయన్ని ఇప్పటికే చాలా దూరం చేశాం. ఇక చాలు అనుకోవాలి.

నిజానికి మనం ఇప్పుడు వినాలి. ఇక నుంచి అయన ‘మన పాటలు’ పాడటం వొద్దూ అంటూ తాను పాడే సిసలైన వీరగాథల వినాలి. అందుకోసం బతిమిలాడాలి.

పన్నెండు మెట్ల కిన్నెర మొగులయ్యా… వేనవేల కృతజ్ఞతలు.

 

 

 

 

More articles

3 COMMENTS

  1. నిజంగా అద్భుతం. చాలా మంది ఎందుకో జీర్ణించుకోలేక పోతున్నారు. సరైన సమాధానం దొరికింది మీ వ్యాసం లో అన్నా

  2. మీ artcle చాలా బాగున్నది,
    మంచి పరిశీలాత్మక వ్యాసం అందించినందుకు అభినందనలు. భవిష్యత్తులో ఇలాంటి మంచి
    వ్యాసాలు అందిస్తారని ఆశిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article