Editorial

Sunday, April 28, 2024
సంపాద‌కీయంఅశ్రీన్ సుల్తానా - ఒక 'ప్రేమ సంఘటన'కు నాయకి : తెలుపు సంపాదకీయం

అశ్రీన్ సుల్తానా – ఒక ‘ప్రేమ సంఘటన’కు నాయకి : తెలుపు సంపాదకీయం

చంపొద్దని అందరి కాళ్ళు మొక్కిన.
ఇప్పుడు నాకేం న్యాయం వద్దు.
నా రాజును సంపెటప్పుడు మనుషులు రాలేదు.
పోలీసులైనా, మనుషులైనా… చెబుతున్న కదా, ఈ సమాజం మనిషి కాదు…ఉమ్మాలి వీల్లమీద.
చెప్పు తీసికొని కొట్టాలి మొత్తాన్ని.ఈ సమాజం మీద మన్నువడ. ఉమ్మాలి.

కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Ramesh Babu

గతవారం దళితుడైన నాగరాజు తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నందుకు కక్ష గట్టిన ఆమె అన్నయ్య, వారి మిత్రులు నిర్లజ్జగా, నిర్దాక్షిణ్యంగా అంత్యంత కిరాతకంగా హత్య చేసిన అనంతరం ఆ అమ్మాయి మాట్లాడిన మాటలను ఎవరు మరచిపోగలం. అవి మాటలు కాదు, ఈ సమాజానికి చెప్పుదెబ్బలే.

నాగరాజును నడిరోడ్డు మీద హత్య చేస్తున్నప్పుడు చోద్యం చూసిన మనుషులను, మొత్తం సమాజాన్ని ఆమె అత్యంత ఆవేదనతో, ఏహ్యభావంతో విలేకరుల ముందు నిందిస్తూ చెప్పిన మాటలు శరా ఘాతాలు. వాటిని ఇప్పటికీ వినని వారుండకపోవచ్చు. కానీ, విన్నవారు సిగ్గుపడకుండా ఉండగలరా!

హిందు మతం ..అంతకన్నా ముఖ్యం దళిత కుటుంబం నుంచి వచ్చిన నాగరాజు తన చెల్లెలిని ప్రేమించి పెళ్ళాడి నందుకు ఆమె అన్నయ్యనే కిరాతకంగా హత్య చేశాడు. ఇద్దరి మతాలు వేరు అన్న కారణంగా  హత్య చేసినట్టు చెబుతున్నప్పటికీ జరుగుతున్న దారుణాన్ని నడి రోడ్డుపై అందరూ చూశారు. నాగరాజును హత్య చేస్తుండగా చేష్టలుడిగిన పౌర సమాజం పట్ల అశ్రీన్ తీవ్రంగా చాలా పరుషంగా తప్పు పట్టింది. నిందించింది. ఉమ్మేయాలనీ అన్నది. ఆమె బాధ, ఆవేదన, ఆవేశం న్యాయమైనది. అన్య్యాయంగా ఉన్న మానవత్వానికి అది చెప్పుదెబ్బ.

ఆమె నిస్సహాయ, హృదయ విదారకమైన ప్రతి మాటా మనల్ని వెంటాడే శాపం. దానికి త్వరగా మనం జవాబు చెప్పాలనే ఈ సంపాదకీయం.

లోతుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. కులం మతం నీడన జరిగిన ఈ హత్యోదంతం మన ప్రేమరాహిత్యానికి అచ్చమైన ప్రతిబింబం. ఎన్ని గొప్పలు పోయినా మన సమాజం ఇసుమంతైనా మారలేదనడానికి తిరుగులేని సాక్ష్యం కూడా.

హత్య చేసిన అన్నతో ఒకసారి మాట్లాడాలన్నాది ఆమె అంతిమ కోరిక. మొత్తం సమాజం స్తబ్ధంగా ఉండిపోయిన వేళ ఆమెకు ఇప్పుడు అన్నయ్యే ప్రథమ శత్రువు. ఆ అన్నయ్యకు సమవుజ్జీగా మనందరం కూడా అంతే ద్రోహులం అన్న మాట ఆమె అంటూనే ఉన్నది. ఉమ్మేయాలి మనపై అని అంది కూడా.

హత్య జరిగిన తర్వాత ఆమె అనేక ఛానళ్ళకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇప్పటికీ అనేక సంగతులు వెల్లడిస్తూనే ఉన్నది. తాను ఎంతో సంయమనంతో మాట్లాడుతోంది. ముఖ్యంగా ఇప్పడు తాను ఒకటే అడుగుతోంది. ప్రభుత్వం, పోలీసు వ్యవస్థా తనకు ‘అన్నయ్య’తో ఒకసారి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వమని కోరుతున్నది. తనకు ఆ అనుమతి ఎందుకు ఇవ్వడం లేదనీ ప్రశ్నిస్తోంది. తనను పరామార్శించడానికి వచ్చిన వాళ్లకు కూడా అదే చెబుతోంది “నాకు హక్కులేదా?” అని అడుగుతోంది. హత్య చేసిన అన్నతో ఒకసారి మాట్లాడాలన్నది ఆమె అంతిమ కోరిక. మొత్తం సమాజం స్తబ్ధంగా ఉండిపోయిన వేళ ఆమెకు ఇప్పుడు అన్నయ్యే ప్రథమ శత్రువు. ఆ అన్నయ్యకు సమవుజ్జీగా మనందరం కూడా అంతే ద్రోహులం అన్న మాట ఆమె అంటూనే ఉన్నది. ఉమ్మేయాలి మనపై అని అంది కూడా.

‘సమాజం’ అన్నప్పుడు మనం చాలా సహజంగా అది మన గురించి కాదని భావిస్తూ ఉంటాం. ‘మనుషులు ‘ అన్నప్పుడు కూడా మనం కాకుండా ఇంకెవరో అనిపిస్తుంది. కానీ ఆమె మనందరినీ ప్రశ్నిస్తోంది. చీమూ నెత్తురు ఆత్మా సాహసం లేని మనందరి కన్నా అన్నయ్యే ఆమెకు కాస్త నయం అనిపించవచ్చు. “ఎందుకు చంపావు. చంపి ఏం సాధించావు?” అని నేరుగా అడుగుతుంది కాబోలు. ఆ అవకాశం కోసమే ఆమె ఓపికగా ఎదురి చూస్తున్నది.

నిజానికి ఆమె తన దగ్గరకు వచ్చిన వారందరినీ అడుగుతోంది. వారం రోజులు గడిచాక ఆమె మరింత స్థిరంగా అడుగుతోంది. చాలా సూటి ప్రశ్నలు అడుగుతోంది. చంపడానికి వచ్చిన వాళ్ళందరి కాళ్ళు మొక్కినా వాళ్ళు వదల లేదు. కానీ నాడు జరుగుతున్న ఘోరం చూస్తున్న వాళ్ళెవ్వరూ అడ్డుకోలేదు “ఎందుకూ?’ అని అడుగుతోంది. ఆ ప్రశ్నలు మనల్నీ అనునిత్యం ప్రశ్నిస్థాయి. చిత్రమేమిటంటే మొత్తం అమానవీయ మనుషులకు ప్రతీకగా ఆమెకు అన్నయ్యే కనిపిస్తున్నట్టు ఉన్నాడు. అతడ్నే ఆడగాలని ఉంది ఆమెకు.

ఆమె ఒక నిజ మనిషి. సిసలైన ప్రేమమయి. తన రాజును కాపాడుకోలేని సిల్తానా ఒక కిరీటం లేని రాణిలా నిస్సహాయంగా వగస్తోంది. మండే గుండెతో ప్రశ్నిస్తోంది.

వర్తమానంలో ఇంతటి బాధామయిని, అదే సమయంలో ఇంతటి అసామాన్యమైన ధీర వనితను చూడలేదు మనం. ఆమె ఒక నిజ మనిషి. సిసలైన ప్రేమమయి. తన ‘రాజు’ను కాపాడుకోలేని ఈ సుల్తానా ఒక కిరీటం లేని రాణిలా నిస్సహాయంగా వగస్తోంది. మండే గుండెతో ప్రశ్నిస్తోంది.

మొన్న దండోరా నిర్మాత మంద కృష్ణ మాదిగ వెళ్ళినప్పుడూ అడిగింది. చుట్టూ చోద్యం చూసిన జనానికి బాధ్యత లేదా అని అడిగింది. అయన అన్నారు, “వారికి ప్రాణ భయం ఉంటుంది కదా” అమ్మ అని. కానీ,  తనంది…కనీసం దగ్గరకు రాకపోయినా పోలీసులకు ఫోన్ చేయవచ్చు కదా అంది. అయన మరో  ప్రశ్న అడిగితే, అక్కడ ‘తన రాజు’ను చంపిన ఘటన ఐదు నుంచి పది నిముషాల వ్యవధిలో జరిగిందని. అంతలోపు పోలీసులకో అంబులెన్స్ కో ఫోన్ చేస్తే ఎవరైనా వచ్చేవారు కదా అంది. తన భర్తను ఆస్పత్రికి తీసుకెళ్ళే చాన్స్ ఉండేది కదా అని కూడా ఆశతో అడిగింది. కృష్ణ మాదిగ కు ఏం చెప్పాలో తెలియలేదు. ఆయనకే కాదు, ఎవరమూ ఏమీ చెప్పలేని నిస్సహాయ స్థితి. అందుకే ఆమె మనల్ని అడగడం వృధా అనుకుంటోంది. తన అన్నయ్యను అడగాలనుకుంటోంది.

తాను అడ్డుకున్న తర్వాత గానీ అతడు కాస్త వెనక్కు తగ్గిన తర్వాత గానీ ఈ సమాజం మెల్లగా అతడి వైపు కదిలింది. ఒకరు ఇద్దరు ముగ్గురు పదుగురు చిన్నగా ఆకదిలి అతడ్ని బంధించేందుకు వచ్చారు. కానీ అవసరమైన క్షణాల్లో….

రోడ్డు మధ్య రెండోసారి తన భర్తను అన్న ఇనుప రాడ్ తో మోదేందుకు వస్తుంటే ఆమె సివంగిలా అడ్డుపడ్డ దృశ్యం మీరు చూసే ఉంటారు. భర్త ప్రాణాలకు తన ప్రాణానికి అడ్డుగా పెట్టేందుకు ఆమె చివరిక్షణం దాకా ప్రయాస పడింది. కానీ ఆమె తప్పా అక్కడ ఇంకెవరూ లేరు. మనుషులెవరూ జోక్యం చేసుకోలేదు. ఆమె అన్నను కాలర్ పట్టుకుని తాను అడ్డుకున్న తర్వాత గానీ అతడు కాస్త వెనక్కు తగ్గిన తర్వాత గానీ ఈ సమాజం మెల్లగా అతడి వైపు కదిలింది. ఒకరు ఇద్దరు ముగ్గురు పదుగురు చిన్నగా ఆకదిలి అతడ్ని బంధించేందుకు వచ్చారు. కానీ అవసరమైన క్షణాల్లో…. నాగరాజు తలపై ఇనుప రాడ్ తో కొడుతున్నప్పుడు ఒక్క మనిషీ కదలలేదు…మెదలలేదు. అందుకే ఆమె అన్నది. ఇది సమాజం కాదు… వీళ్ళు మనుషులూ కాదని. వీళ్ళను చెప్పుతీసి కొట్టాలీ అంది. ఉమ్మాలి అని కూడా అన్నది.

కాగా, తమ ముందు జరుగుతున్న దాన్ని పట్టించుకొని సమాజం ఆ తర్వాత పరామార్శలకు వస్తుంటే ఆమె సాదరంగా ఆహ్వానిస్తోందీ అంటే ఎందుకో మనం గ్రహించాలి. ఆమె తన వద్దకు వచ్చిన వారితో మాట్లాడుతున్నదీ అంటే ఎందుకో మనం సావధానంగా అర్థం చేసుకోవాలి.

దానర్థం ఆమెకేదో మన పరామర్శ అవసరం అని కాదు. తన ప్రశ్నలను వినాలనే ఆమె అంత దు:ఖంలో కూడా మనతో మాట్లాడుతున్నది.

కృష్ణ మాదిగతో కూడా ఆమె అన్నది. తన అన్నయ్య దగ్గరకు తీసుకెల్లడం సాధ్యం కాదని ఆయన అంటే, ఐతే.. మరి రావొద్దు అని అన్నది. తన ప్రశ్నలకు జవాబు చెప్పకుంటే ఎవరూ రానవసరం లేదనీ ఖరాఖండీగా చెబుతున్నది.

తక్షణం మనం ఒక ప్రేమ సంఘటన కట్టాలి. రెండవది, ఆ ‘ప్రేమ సంఘటన’కు ఒక మానవీయ సంఘంగా మనం అండగా ఉండి ప్రభుత్వం నుంచి ప్రేమికుల కోసం రక్షణ చట్టం ఏర్పాటు చేపించాలి.

అసలైన హంతకులం మనం. జీవచ్చవాలం మనం. మరి ఆమె వద్దకు ఎందుకు పోవాలి. చేవ ఉంటే మనం వెనుదిరిగి చేయవలసింది వేరే ఉన్నది.

అశ్రీన్ సుల్తానా ఒక ధీర వనిత. ఆమె కోసం ఇప్పడు చేయవలసిన కర్తవ్యాలు రెండు ఉన్నాయి. ఒకటి, పౌర సమాజంలో తక్షణం ఒక కదలిక తేవాలి. తనలా కులాంతర మతాంతర ప్రేమ వివాహాలు చేసుకున్న ఒక్కొక్క జంటనూ ఒక్కటి చేయాలి. ఊరూ వాడాల నుంచి వారిని ఈ బాగ్య నగరానికి రప్పించి వారితో ఒక ప్రేమ సంఘటన కట్టాలి. రెండవది, ఆ ‘ప్రేమ సంఘటన’కు ఒక మానవీయ సంఘంగా మనం అండగా ఉండి ప్రభుత్వం నుంచి ప్రేమికుల కోసం రక్షణ చట్టం ఏర్పాటు చేపించాలి. ఇక ఈ ‘వెలి ప్రేమ’లు ఇలాంటి అధోగతి పట్టకుండా భవితకు అండగా విజయవంతం ఐనవో విఫలమైనవో అన్ని ప్రేమ జంటలనూ కలపాలి. ఒకటి, స్వతంత్రతకు, మరొకటి రక్షణకు.

ఈ మాట పరామార్శకు వెళ్ళిన వారు వినాలి. మహిళా సంఘాల నేతలు…వ్యక్తులూ శక్తులూ వినాలి. పాదయాత్రలో ఉండి ఫోన్లో మాటాడిన బహుజన ప్రవీణ్ కుమార్ గారూ…మాల మాదిగల మధ్య అవశ్యమైన వర్గీకరణ నుంచి పిల్లల హృదయాల రక్షణకోసం కదిలిన కృష్ణ మాదిగ గారూ వినాలి. ఇందుకు మీలో ఒకరు చొరవ తీసుకోవాలి.

ఊరూ వాడా వేరైనా, నిన్న మొన్నటి వారైనప్పటికీ లేక దశాబ్దాల కిందటి ప్రేమ వివాహితులైనా… అందరినీ ఐక్యం చేయాలి. ఒక ట్రస్టుగా వారు మన సమాజానికి ఆదర్శం. కలిసున్న వారు, విడిపోయిన వారు, ఇలా మన కళ్ళ ముందే వేరుపడ్డ వారూ అందరినీ కదిలించాలి. వారే తమకు ఆర్ధిక హార్థిక రక్షక దళంగా నిర్మించాలి. ఒక శాశ్వత ప్రాతిపదికగా ప్రేమికులను ఒక సంపదగా మనం ఒక సమాజంగా అంగీకరించాలి. వారి ఐక్య డిమాండ్ గా ప్రభుత్వ రక్షణ చట్టం కోసం మనందరం కలిసి కట్టుగా పోరాడాలి.

ఆ పనికి ఒక అమృత…ఒక అశ్రీన్ సుల్తానా నాయకత్వం వహించాలి. లేకపోతే ఆమె అన్నయ్యకు మనకూ  ఫరక్ లేదు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article