Editorial

Sunday, May 19, 2024
కాల‌మ్‌పెరుగన్నం : 'జింబో' కథా కాలమ్ ప్రారంభం

పెరుగన్నం : ‘జింబో’ కథా కాలమ్ ప్రారంభం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. సామాన్యుల పక్షాన న్యాయ వ్యవస్థపై అనేక రచనలు వెలువరించిన ‘తరాజు’.

తెలుపు కోసం ‘కథా కాలమ్’ రాసేందుకు అంగీకరించినందుకు ధన్యవాదాలు. ఇక నుంచి ప్రతి ఆదివారం ‘పెరుగన్నంతో వారు మన కడుపులను చల్లగా ఉంచుతారని తెలియజేయడానికి  ఏంతో సంతోషంగా ఉంది. మొట్ట మొదట అమ్మ చెప్పిన కథతో ‘మన గొప్ప కథకులు’ ఎవరో తెలుపు తొలి వ్యాసానికి ఇదే సాదర ఆహ్వానం.

వారి సవివరమైన పరిచయం వ్యాసం చివర్లో చూడాలి.

జింబో 

గాలి లాగా, నీరులాగా కథలు ప్రపంచమంతటా ఉంటాయి. అది అవసరం కూడా. కథల ఉనికి తెలియని వ్యక్తి బహుశా ఎవరూ ఉండరేమో.

పిల్లలు చిన్నప్పుడు కథలంటే ప్రాణం ఇస్తారు. కథలు చెబితేనే పాలు తాగుతారు. అన్నం తింటారు. కథలో లీనం అవుతారు. కథలోని పాత్రలతో ఐడెంటిఫై అవుతారు.

మనిషి జీవితం పాటతో మొదలవుతుంది. బుద్ధి తెలియనప్పుడు పిల్లవాడు వినేది తల్లి పాటలే. బుద్ధి తెలిసిన తర్వాత అతను వినేవి కథలే. మనిషి జీవితం కథలతోనే మొదలవుతుంది. బహుశా కథలతోనే ముగుస్తుంది. అవి ఆత్మకథలు కావచ్చు. జ్ఞాపకాలు కావచ్చు.

జింబో గారి మాతృమూర్తి – మంగారి సత్యమ్మ’. ఫొటో : శ్రీ భరత్ భూషణ్

మా అమ్మ చెప్పిన కథ లో నాకు బాగా గుర్తున్న కథ “పీటలమ్మ వారి కథ”. కోడల్ని మంచిగా చూడని అత్తకీ చిన్న కోడలు చెప్పే గుణపాఠం ఆ కథ సారాంశం.

మా అమ్మ చదువుకోలేదు. కొంత కాలం తరువాత సంతకం చేయడం నేర్చుకుంది. మా అమ్మ వాళ్ళ తండ్రి అంటే మా తాత. అతనూ చదువుకోలేదు. వీళ్ళని నేను వేధించిన సందర్భాలు తక్కువే. కానీ కథల కోసం వేధించిన సందర్భాలు చాలా ఎక్కువ. వాళ్లు నాకు కథలు చెప్పే వాళ్ళు. మా అమ్మ చెప్పిన కథలు ఇంకా నాకు గుర్తున్నాయి. మా తాత మా ఇంట్లోనే ఉండేవాడు. మాకు కథలు చెప్పడం, బొమ్మలు చేసి ఇవ్వడం ఆయనకున్న పని.

తాను పొలం ఎలా దున్నేది, బర్రెల నుంచి పాలు ఎలా పిండేదీ ఇవన్నీ కథలు కథలుగా చెప్పేవాడు మా తాత. తాను విన్న కథలు తన అనుభవంలోకి వచ్చిన కథలు అతను చెప్పేవాడు. ఆయన చుట్ట తాగడం వల్ల ఆయన దగ్గర కంపు వాసన వేసేది. కానీ ఆయన కథలు వినాలి. ఆయన మాటలు వినాలి. కథల్లోని పేదరాశి పెద్దమ్మని చూడాలి. మాయల మరాఠి మంత్రాల్లో మాయం అవ్వాలి. అందుకని ఆయన కంపు వాసనని నేను భరించే వాడిని.

మా అమ్మ చెప్పిన కథ లో నాకు బాగా గుర్తున్న కథ “పీటలమ్మ వారి కథ”. కోడల్ని మంచిగా చూడని అత్తకీ చిన్న కోడలు చెప్పే గుణపాఠం ఆ కథ సారాంశం. ఆ కథలోని అత్తకు నలుగురు కొడుకులు, నలుగురు కోడళ్ళు. వాళ్లకి వాళ్లకి మంచి భోజనం పాయసం తినాలని ఉండేది. కానీ వాళ్ళ అత్త వాళ్ళ కి మామూలు భోజనం పెట్టేది. విసుగెత్తిన చిన్న కోడలు మిగతా కోడళ్ళతో చెప్పి ఓ అర్ధరాత్రి వంట చేస్తుంది. పాయసము కూడా చేస్తుంది. అర్ధరాత్రి వచ్చి ముగ్గురు కోడళ్ళు భోజనం చేసి పాయసం తాగి వెళ్ళిపోతారు. చిన్న కోడలు బావి దగ్గరికి పీటలని తీసుకొని వెళ్ళి కడిగి వంటింటి వైపు వెళ్తుంది. అదే సమయంలో వాళ్ల మామ మూత్రవిసర్జన కి పెరటి లోకి వస్తాడు

చీకట్లో కోడలిని గుర్తించడు. తల మీద పీటల తో ఉన్న ఉన్న మనిషిగా గుర్తించి “ఎవరమ్మా నువ్వు?” అని భయం భయంగా ప్రశ్నిస్తాడు.

కోడలికి సమయస్ఫూర్తి ఎక్కువ. మామ తనని గుర్తించ లేదన్న విషయాన్ని ఆమె వెంటనే గ్రహిస్తుంది.

“నేను పీటల అమ్మవారిని. కోడల్ని సరిగ్గా చూడని అత్తలని తీసుకువెళ్లడానికి వచ్చాను. ఇప్పుడు నీ భార్యని తీసుకువెళ్లడానికి వచ్చాను ” అంటుంది.

అతను ఆమెకు భయపడి లోపలికి వెళ్ళి పోతాడు. తలుపు గడియ వేసుకుంటాడు. ఈ విషయమంతా భార్యకు చెబుతాడు. ఆ తర్వాత ఆ అత్త కోడళ్ళని బాగా చూసుకుంటుంది. ఇది ఆ కథ .

మా అమ్మకి ముగ్గురు కోడళ్ళు. మా పెద్దన్న కూతురు నా కన్నా పెద్దది.” నీ కథే చెబుతున్నావా నానమ్మ” అనేది.

” మీ అమ్మని అడగవే” అని మా అమ్మ అనేది. ఇలా ఎన్నో కథలు మా అమ్మ చెప్పేది. మా తాత చెప్పేవాడు. మనుషుల్లో ఉండే సృజనాత్మకత గురించి చెప్పడానికి ఈ విషయాలు చెప్పాను.

సాహితీ ప్రక్రియలు ఎన్ని ఉన్నా మనిషికి అత్యంత సన్నిహితంగా, ఆత్మీయంగా ఉండే ప్రక్రియ కథ. నేను నా చిన్నతనంలో చూసిన కథకులూ ముగ్గురు. వాళ్ళు మా తాత, మా అమ్మ, మా సీనియర్ ఎల్లయ్య.

పిల్లలు పాటలు కావాలని వేధించరు. కథలు కావాలని వేధిస్తారు. చెప్పిన కథ నే చెబితే పిల్లలు ఊరుకోరు కొత్త కథ కావాలని కోరతారు. సాహితీ ప్రక్రియలు ఎన్ని ఉన్నా మనిషికి అత్యంత సన్నిహితంగా, ఆత్మీయంగా ఉండే ప్రక్రియ కథ. కవిత్వంలో వివరణ ఉండదు. నిగూఢత ఉంటుంది. కథల్లో అలాంటి అవకాశం ఉండదు. కథలు అర్థం కాక పోవడం అంటూ ఉండదు ఆ కారణంగా పిల్లలకి, కథలతో సాన్నిహిత్యం ఎక్కువ.

నా చిన్నప్పుడు కథలు అంటే పిచ్చి ఇష్టం ఉండేది. ఆ తర్వాత అంతటి ఇష్టాన్ని మా అబ్బాయి లో చూశాను. చిన్నప్పుడు ప్రతిరోజు వాడికి రెండు మూడు కథలు చెప్పాల్సి వచ్చేది. వాడి కోసం ఎన్నో కథలను పుట్టించేవాడిని. ఆ కథల్లోని పాత్రలతో వాడు మమేకమయ్యే వాడు. కథల్లో కష్టం ఉంటే కన్నీళ్లు పెట్టేవాడు. ఆనందం ఉంటే ఆనందించేవాడు .ఇప్పుడు వాడికి చెప్పిన కథలు రాస్తే అదో చిన్న పిల్లల కథల పుస్తకం అవుతుంది.

నేను ఏడవ తరగతి కి వచ్చిన తర్వాత కథల కోసం వేధించడం తగ్గిపోయింది. చందమామలు బాల్యమిత్రులు చదువుకునే వాడిని. ఆ సమయంలో నాకు పరిచయమైన వ్యక్తి స్కూల్లో మా సీనియర్ ఎల్లయ్య అతను బాగా కథలు చదివే వాడు. అతను రాసేవాడు. కానీ అవి అచ్చుకు నోచుకోలేదు. అతను జీవన పోరాటం లో కూరుకు పోయినాడు. నేను నా చిన్నతనంలో చూసిన కథకులూ ముగ్గురు. వాళ్ళు మా తాత, మా అమ్మ, మా సీనియర్ ఎల్లయ్య.

మా అమ్మ మా తాత ఎన్నో కథలు చెప్పినా వాళ్లు కథకులు కాలేకపోయారు.అట్లాగే యెల్లయ్య కూడా.వాళ్లలో సృజనాత్మకత లేదా ..? ఉంది. బహుశా నాకన్నా ఎక్కువ ఉండి ఉంటుంది.వాల్లలోనే కాదు ప్రతి వ్యక్తిలోనూ సృజనాత్మకత ఉంటుంది.కొంతమంది కాగితంపై పెడతారు.మరికొంతమంది కాగితంపై పెట్టరు. వాళ్లు కాగితంపై పెట్టకపోవడం వల్ల కథకులు కాలేకపోయారు. ఎల్లయ్య కాగితంపై పెట్టి కూడా ప్రచురించక పోవడం వల్ల కథకుడిగా నిలబడ లేక పోయాడు. అందుకని అతను కథకుడు కాలేకపోయాడు.

గొప్ప కథకులు చాలామంది కాగితం మీద పెట్టకుండా అదృశ్యమైన వాళ్లే. మా అమ్మ లాగా, మా తాత లాగా, మా ఎల్లయ్య లాగా. ఇంకా చెప్పాలంటే అందరూ అమ్మల్లాగా అందరి తాతల్లాగా.

ప్రతి తల్లిలోనూ ఆమెకే తెలియని కథకుడు ఉంటాడు. తాను విన్న కథలను పిల్లలకు చెబుతూ ఉంటుంది. చెప్పిన కథలనే మళ్లీమళ్లీ చెబితే పిల్లలు వినరు. కొత్త కథ చెప్పమని వేధిస్తారు. గొడవ చేస్తారు ఆ క్రమంలో ఆమె కొత్త కథని సృష్టిస్తుంది. ఆ తర్వాత పిల్లలు ఆ కథకి మరికొంత కథను చేర్చి మరో కొత్త కథను సృష్టిస్తారు. కాగితంపై పెట్టి ప్రచురించిన వాళ్ళు కథకులుగా చలామణి అవుతారు. కాగితం మీద పెట్టని వాళ్లు కథకులుగా చలామణి అయ్యే అవకాశం ఉండదు. గొప్ప కథకులు చాలామంది కాగితం మీద పెట్టకుండా అదృశ్యమైన వాళ్లే. మా అమ్మ లాగా, మా తాత లాగా, మా ఎల్లయ్య లాగా. ఇంకా చెప్పాలంటే అందరూ అమ్మల్లాగా అందరి తాతల్లాగా.

ఎములాడ ‘రాజేందర్’ పరిచయం

‘జింబో’ కలం పేరుతో సాహితీ లోకానికి చిరపరిచితులైన మంగారి రాజేందర్ కవీ, కథకులు. వారికి కవిత్వం, కథ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. 

వృత్తిరీత్యా జిల్లా సెషన్స్ జడ్జిగా, జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ గా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యునిగా పనిచేసి, పదవీ విరమణ చేసినప్పటికీ రచయితగా అందరికీ న్యాయం అందాలన్నది వారి అభిమతం. అందుకే కల్పనాత్మక రచనలతో పాటు వారు న్యాయం, ధర్మం గురించిన అనేక రచనలు చేశారు. ఒక్క మాటలో అయన వృత్తీ ప్రవృత్తీ వ్యావృత్తీ అన్నీ కూడా రచనలుగా ఆవిష్కారం కావడం అదృష్టం అనే చెప్పాలి. 

ఎములాడ రాజన్న పాదాల ముందు జన్మించిన ఈ తెలంగాణ బిడ్డ ‘మా వేములవాడ కథలు’, ‘రూల్ ఆఫ్ లా’, ‘కథలకి ఆవల’, ‘ఓ చిన్న మాట’ వంటి కథా సంపుటులు వెలువరించారు. రాబోయే సంపుటులు “నాల్ల కోటు”, మా వేములవాడ కథలు-2″. కవిత్వానికి వస్తే ‘హాజిర్ హై’ అంటూ నేర న్యాయ వ్యవస్థపై మరే కవీ రాయలేని కవిత్వం రాసిన జింబో ‘లోపలివర్షం’, ‘చూస్తుండగానే’ పేరిట ఇతర కవితా సంపుటులు తెచ్చారు. ఈ మధ్య వచ్చిన కవితా సంపుటి -“ఒకప్పుడు” కాగా రాబోయే కవితా సంపుటి -“ఒక్క కేసు చాలు”.  ఇవి కాకుండా వారు చాలా లా పుస్తకాలని వెలువరించారు. తాజా సంతోషం ఏమిటంటే, తెలుపు కోసం నేటి నుంచి వారు ‘కథా కాలమ్’ అందించడానికి అంగీకరించడం. వారికి తెలుపు హృదయపూర్వక ధన్యవాదాలు.

జింబో e-mail: rajenderzimbo@gmail.com

More articles

9 COMMENTS

  1. నమస్కారం కథల గురించి అమ్మ తాతలు చెప్పే కథల గురించి చిన్నప్పటి జ్ఞాపకాలు……
    ..పెరుగన్నమే

  2. నేను చిన్నప్పుడు (జగిత్యాలలో చదువుకునేటప్పుడు ) మీ పేరు విన్నాను. అడపాదడపా మీ రచనలను పత్రికలలో చూసాను. ఇప్పుడు మరోసారి చదువుతున్నాను. సంతోషం.

  3. కథలు ఉబుసుపోకకే అన్నట్లనిపించినా, తరచి చూస్తే ఎన్నో జీవిత సత్యాలు, విలువలు ఆణిముత్యాల్లా కథల్లోంచి తొంగిచూస్తాయి. జింబో గారి “పెరుగన్నం” మనసుకు ఆనందం, బుద్దికి వికాసం కలిగిస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
    స్వాగతం…!

  4. పెరుగన్నం లో పీటలమ్మ కథ సమయస్ఫూర్తి కథ.చందమామ,బాలమిత్ర లో యిలా టి నీతి కథలు వుండేవి.బావుంది.

  5. కంగ్రాచులేశన్స్ సర్,
    మీరు చిన్నప్పుడు విన్న కథల్లో దబ్బనాల రాజు కథ,అందమైన వైశ్య యువతి శవం కొంగు కు ఐదు రూపాయల బిళ్ళ కట్టే కథ ఉన్నాయా?
    ఉంటే వాటిని రాయండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article