Editorial

Wednesday, May 1, 2024
ఆటలునిఖత్ జరీన్‌ : 'బంగారి' తెలంగాణ

నిఖత్ జరీన్‌ : ‘బంగారి’ తెలంగాణ

మన తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ బిడ్డ – నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి దేశానికే వన్నె తెచ్చింది. తెలంగాణనే కాదు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు బిడ్డగా మనందరినీ గర్వపడేలా చేసింది.

డాక్టర్ మహ్మద్ రఫీ

టర్కీలో జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబీఏ) ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌‌‌లో మన తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ బిడ్డ – నిఖత్ జరీన్ స్వర్ణం సాధించి ఈ ఘనత సాధించిన తొలి తెలంగాణ అమ్మాయిగా రికార్డ్ సృష్టించింది. తాను చరిత్రలో సువర్ణాక్షరాలత్గో  లిఖించదగ్గ చరిత్ర సృష్టించిందని  బాక్సింగ్ ఫెడరేషన్ అభివర్ణించడం విశేషం.

ఇందూరు టు ఇస్తాంబుల్

టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ఈ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో 52 కిలోల విభాగంలో జరీన్ గోల్డ్ మెడల్ గెలిచింది. 73 దేశాల నుంచి దాదాపు 310 మంది మహిళా బాక్సర్లు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ తరుపున నిఖత్ జరీన్ సత్తా చాటడంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

నిఖత్ జరీనా 52 కేజీల విభాగం (ఫ్లై వెయిట్)లో నేడు జరిగిన ఫైనల్లో 5-0తో జిట్‌పోంగ్ జుటామస్(థాయ్‌లాండ్)పై గెలిచి తెలంగాణ సత్తా ప్రపంచానికి చాటింది.

బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్టాఫ్ ఆఫీసర్

నిఖత్ జరీన్ వయసు 26. తల్లిదండ్రులు పర్వీన్ సుల్తానా, మహ్మద్ జమీల్ అహ్మద్. నిజామాబాద్ లో హై స్కూల్ విద్య పూర్తి అయ్యాక హైదరాబాద్ దోమలగూడ లో వున్న ఎ.వి.కాలేజీ లో బి.ఎ., పూర్తి చేసింది. ఎ.సి.గార్డ్స్ లో వున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్టాఫ్ ఆఫీసర్ గా ఉద్యోగం చేస్తోంది.

తొలి కోచ్ తండ్రి

ఆమె తొలి కోచ్ తండ్రి జమీల్. 2009లో విశాఖపట్నం వెళ్లి స్పోర్స్ అథారిటీ లో చేరింది. అక్కడ ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వి.రావు గారి దగ్గర శిక్షణ పొందింది. 2010 లోనే జాతీయ స్థాయిలో గోల్డెన్ బెస్ట్ బాక్సర్ గా గెలిచి భవిష్యత్ తనదే అని చెప్పకనే చెప్పింది. అనేక జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని ప్రత్యేకతను చాటుకుంటూ వివిధ మెడల్స్ సాధిస్తూనే ఉంది. అడిదాస్ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ గా 2018 లో నియమితురాలు అయ్యింది. నిజామాబాద్ పట్టణ అధికార బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది.

సాధన మాములుగా సాగలేదు!

వరల్డ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో తొలి సారి పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్న నిఖత్ సాధన మాములుగా సాగలేదు. ఆ అమ్మాయి కఠోర పరిశ్రమ గురించి ముందే తెలుసుకున్న కెటిఆర్ 50 లక్షలు ప్రకటించి ఆశీర్వదించి పోటీలకు పంపించారు! ఇప్పుడు స్వర్ణం తో తిరిగి వచ్చాక కెసిఆర్ భారీ నజరానా అందించనున్నారు. మరో వైపు భారత రాష్ట్రపతి నిఖత్ కు అభినందనలు తెలిపారు. ప్రధాని మోడీ నిఖత్ నీ రాక కోసం ఎదురు చూస్తున్నా అని ప్రకటించారు. కేంద్రం నుంచి భారీ నజరానా నిఖత్ కు లభించనున్నది.

 

 

ప్రపంచ చాంపియన్ కు తెలుపు అభినందనలు

మొత్తం 12 మంది ఇండియన్ బాక్సర్లు ఈసారి ప్రపంచ ఛాంపియన్ షిప్ లో పోటీ పడగా, నిఖత్ సత్తా చాటింది. మొదటి రౌండ్ నుంచీ దూకుడు ప్రదర్శించి ఫైనల్స్ వరకు శివంగిలా దూసుకెళ్లి పసిడి పతకం పట్టేసి భారత జెండా ను రెపరెప లాడించి తెలంగాణ ప్రత్యేకతను చాటి చెప్పింది. స్వర్ణం సాధిస్తా అని చెప్పి మరీ విజయం సాధించింది. విశ్వ విజేతగా నిలిచి ఇండియన్ మహిళా బాక్సింగ్ ఛాంపియన్లు మేరీ కోమ్, సరిత సరసన నిలిచింది.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article