Editorial

Tuesday, May 14, 2024
ప్రేమ‌విరాటపర్వం : 'యుద్దమే కథగా ప్రేమనే విప్లవం'గా వేణు ఊడుగుల చిత్రం - జూన్ 17...

విరాటపర్వం : ‘యుద్దమే కథగా ప్రేమనే విప్లవం’గా వేణు ఊడుగుల చిత్రం – జూన్ 17 విడుదల

మొదటి సినిమా ‘నీది నాది ఒకే కథ’తో తనదైన ముద్ర వేసుకున్న నవతరం తెలంగాణ దర్శకుడు వేణు ఊడుగుల కొత్త చిత్రం ‘విరాట పర్వం’ విడుదల తేదీ ఖరారైంది. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17న  విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.

కందుకూరి రమేష్ బాబు

‘Revolution an act of Love’ అంటూ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా వస్తోన్న ఈ చిత్రం కథాంశం ఏమిటో చూచాయగా చెప్పాలంటే, తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం… మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్బం…ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం”గా  దర్శకులు వేణు ఊడుగుల పేర్కొన్నారు.

జున్ పదిహేడవ తేదీన మన ముందుకు వస్తున్న ఈ సినిమాలో రవన్న పేరుగల ఒక విప్లవకారుడు కథా నాయకుడు. నలుగురు మహిళా మణులు అంతే ప్రాధాన్యం గల కథా నాయకులు. యుద్దమే కథగా ప్రేమనే విప్లవంగా ముందుకు వస్తోన్న ఈ చిత్రం తొంభయ్యవ దశకంలో పోరుబాటలో నడిచిన కొందరి నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం వేణు ఊడుగుల.

కరోనా కారణంగా అనేక మాసాల ఆలస్యంగా విడుదలకు నోచుకుంటోన్న ఈ చిత్రం సహజంగానే తెలంగాణ ప్రజల హృదయాల్లో ఎపుడెపుడు చూడాలా అన్న ఉద్వేగాన్ని కలిగించడం సహజం. కవులు, మేధావులు, రచయితలకే గాక తెలంగాణా ఉద్యమంలో పాల్గొన్న వారికీ దర్శకులు వేణు ఊడుగుల చిరపరిచితులు. ఓరుగల్లు జిల్లాకు చెందిన ఈ తెలంగాణా బిడ్డ చక్కటి కవి. వేటూరి వద్ద కొంతకాలం సహాయకుడిగా పని చేశారు. అట్లే, శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘జై బోలో తెలంగాణ’కు మాటల రచయితగా పని చేశారు.

“ప్రజలు బిగించిన పిడికిలి అతడు…ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించిన అడవి అతడు…ఆయుధమై కదిలిన ఆకాశం అతడు….విరాటపర్వం అలియాస్ రవన్న”

“ప్రజలు బిగించిన పిడికిలి అతడు…ఆలివ్ గ్రీన్ దుస్తులను ధరించిన అడవి అతడు…ఆయుధమై కదిలిన ఆకాశం అతడు….విరాటపర్వం అలియాస్ రవన్న” అంటూ గతంలో ఈ సినిమా ప్రచార పోస్టర్, వీడియోలు విడుదలై ఎంతోమందిని ఉత్కంఠకు గురి చేశాయి. డా.రవి శంకర్‌ అలియాస్  రవన్నగా దగ్గుబాటి రాణా నటించడం విశేషం.

సహజత్వానికి మారుపేరుగా నిలిచే వారందరూ ఉద్దండ నటీమణులు కావడం ఈ సినిమాకు మరో ముఖ్య బలం.

అలాగే, మార్చిలో మహిళా దినోత్సవం సందర్భంగా విడుదలైన మరో పోస్టర్ కూడా ఎంతోమందిని కదిలించింది. అందులో ఈ సినీ ఆకాశంలో భాగమైన నలుగురు మహిళల పరిచయాన్ని ఏంతో ఆర్ద్రంగా పంచుకున్నారు. సహజత్వానికి మారుపేరుగా నిలిచే వారందరూ ఉద్దండ నటీమణులు కావడం ఈ సినిమాకు మరో ముఖ్య బలం.

అనన్యం, అసామాన్యమైన మార్గంలో సాగిన ఈ మందారాలకు ఎర్రఎర్రని దండాలు అర్పిస్తూ వెండి తెరపై ఒక దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్నివేణు ఉడుగుల మలిచినట్లు తెలుస్తోంది.

ప్రేమ కూడా మానవ స్వేచ్ఛలో భాగమే అని నమ్మిన పాత్రలో సాయి పల్లవి నటిస్తుండగా మహా సంక్షోభమే గొప్ప శాంతికి దారి తీస్తుందని నమ్మిన విప్లవ కారిణి పాత్రలో ప్రియమణి నటించారు. అడవి బాట పట్టిన అనేక మంది వీరులకు ప్రతి రూపాలుగా నందిత దాస్ తో పాటుఈశ్వరీరావ్‌ నటించడం మరో విశేషం.

దర్శకులు ‘నీది నాదే ఒకే కథ’ను మించిన విజయం అందుకోవాలని ఆశిస్తూ తెలుపు కథనం ఇది.

అనన్యం, అసామాన్యమైన మార్గంలో సాగిన ఈ మందారాలకు ఎర్రఎర్రని దండాలు అర్పిస్తూ వెండి తెరపై ఒక దృశ్యకావ్యంగా ఈ చిత్రాన్నివేణు ఊడుగుల మలిచినట్లు తెలుస్తోంది. అన్నట్టు, దీనికి సినిమాటోగ్రఫీ చేసింది కూడా మరో విశిష్ట వ్యక్తి. ఆయన డాని సాంచెజ్-లోపెజ్. వారే మహానటి చిత్రానికి కూడా పని చేశారు.

మరి వేచి చూద్దాం. ప్రపంచ వ్యప్తగా ఉన్న తెలుగు ప్రజలకు చేరువై ఈ సినిమా ‘నీది నాదే ఒకే కథ’ను మించిన విజయం అందుకోవాలని ఆశిస్తూ దర్శకుడికి శుభాకాంక్షలు తెలుపు కథనం ఇది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article