Editorial

Monday, May 20, 2024
కథనాలుమహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ఘనంగా ప్రారంభం : మీడియా సెంటర్, 5 లక్షల...

మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ ఘనంగా ప్రారంభం : మీడియా సెంటర్, 5 లక్షల సాయానికి ప్రభుత్వ హామీ

తెలంగాణ మహిళా జర్నలిస్టులకు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం నేడు ఘనంగా ప్రారంభమైంది. మహిళా మంత్రులు ఇద్దరు, మహిళా కమిషనర్ చైర్ పర్సన్, విప్ గొంగిడి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొనడమే గాక మహిళా జర్నలిస్టుల  ముఖ్యమైన ప్రతిపాదనలకు దాదాపు వారు  ఆమోదం తెలపడం విశేషం.

మీడియా సెంటర్ కోసం కచ్చితంగా సాయం చేస్తామని తెలపడంతో పాటు ఈ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ కు ఆర్ధికసాయం కింద 5 లక్షల రూపాయలిస్తామని, అలాగే వారు కోరిన మిగిలిన అంశాలను సిఎం కేసిఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం తరపున కచ్చితంగా తోడ్పాటు అందిస్తామని రాష్ట్ర మహిళా మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డిలు హామీ ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ తరపున మహిళా జర్నలిస్టులకు ఆర్ధిక సాయం కింద 5 లక్షల రూపాయలు కూడా ఇస్తామని వారు తెలిపారు. అంతే కాకుండా మహిళా జర్నలిస్టులు ఈ సమావేశంలో చేసిన ప్రతిపాదనలన్నింటినీ మంత్రులం, మహిళా కమిషనర్ చైర్ పర్సన్ శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి, విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి గారితో కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని ధీమా కల్పించారు. జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలలో ఫీజు రాయితీ కి ఇస్తున్న మెమోను కచ్చితంగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటానని కూడా వారు హామీ ఇచ్చారు

తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులకు బేగంపేట, ప్లాజా హోటల్ లో చైర్మన్ అల్లం నారాయణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల శిక్షణ తరగతుల కార్యక్రమం ప్రారంభోత్సవంలో నేడు మహిళా మంత్రులు ఇద్దరు, మహిళా కమిషనర్ చైర్ పర్సన్, విప్ గొంగిడి శ్రీమతి సునీతా మహేందర్ రెడ్డి పాల్గొని, ప్రసంగించారు.

జ్యోతి వెలిగించిన తర్వాత ఈ మహిళా జర్నలిస్టుల శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి శ్రీమతి సుమబాల అధ్యక్షత వహించగా, శ్రీమతి స్వేచ్ఛ సమన్వయకర్తగా వ్యవహరించారు.  అకాడమీ సెక్రెటరీ వెంకటేశ్వరరావు, జర్నలిస్ట్ నాయకులు, మారుతి సాగర్, రమణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇస్మాయిల్, రమణ కుమార్, నవీన్ కుమార్ యార లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళా జర్నలిస్టుల సమస్యలను, ప్రతిపాదనలను హాజరైన మంత్రులు, ఇతర ప్రముఖుల ముందు వారు ప్రస్తావించారు. ఆ ప్రతిపాదనలు కింద ఇచ్చాము, గమనించగలరు.

ఈ వర్క్ షాప్ మహిళా జర్నలిస్టు లే నిర్వహిస్తారు – అల్లం నారాయణ

జర్నలిస్టుల అస్తిత్వాన్ని, పనిచేసే చోట ఉన్నా వివక్షను ఇతర సున్నితమైన సమస్యలను చర్చించడానికి ఈ ప్రత్యేక వర్క్ షాప్ ఏర్పాటు చేసినట్లు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ అన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ వర్క్ షాప్ మహిళా జర్నలిస్టు లే నిర్వహిస్తారని, దీనికి సంబంధించిన అనేక అంశాలపై చర్చలు జరుపుతారని అన్నారు. మీడియా అకాడమీ గత నెలలో నిర్వహించిన దళిత జర్నలిస్టుల శిక్షణా తరగతుల కు మంచి స్పందన వచ్చిందని రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 2000 మంది జర్నలిస్టు లు పాల్గొన్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

రాష్ట్రంలోని మహిళా జర్నలిస్టులందరినీ ఒకచోటకు తీసుకొచ్చి, శిక్షణ ఇచ్చే ఈ కార్యక్రమం చాలా మంచిది. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో దళిత జర్నలిస్టులకు కూడా ఇటీవలే మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా మహబూబాబాద్ జిల్లా నుంచి కూడా దళిత జర్నలిస్టులు వచ్చారు. 2000 మంది దళిత జర్నలిస్టులు శిక్షణా తరగతులకు రావడం సంతోషం.

2000 మంది దళిత జర్నలిస్టులు వస్తే…400 మంది మాత్రమే మహిళా జర్నలిస్టులున్నారు. మా మహిళా జర్నలిస్టుల సంఖ్య ఇంకా పెరగాలి. జర్నలిజంలో మహిళా జర్నలిస్టుల సంఖ్య పెంచడానికి రిజర్వేషన్ పెట్టాలా? సామర్థ్యం మీదనే ఎక్కువ మందికి అవకాశాలు కల్పించాలా అనేది చర్చించాలి.

జర్నలిజంలో రోజురోజకీ కొత్త, కొత్త విధానాలు, సాంకేతిక పరిజ్ఞానం వస్తోంది. ఫలితంగా తీవ్ర పోటీ నెలకొంది. కాబట్టి ఈ పోటీ జర్నలిజంలో నిలదొక్కుకోవడం నిజంగా మహిళలకు ఛాలెంజ్.

మహిళా జర్నలిస్టులకు వృత్తిపరంగా అనేక ఇబ్బందులు ఉంటాయి. వ్యంగ్యపు మాటలు ఉంటాయి. కానీ మీరంతా వీటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. రాణిస్తున్నారు. ఇటీవలే మహిళా దినోత్సవం సందర్భంగా మా యువ నాయకులు మంత్రి కేటిఆర్ గారి చేతుల మీదుగా మహిళా జర్నలిస్టులను సన్మానం చేసుకున్నాం.

పురుషులకు మహిళలు అంటే చిన్న చూపు ఉండొచ్చు. కానీ పురుషులు అంటే మహిళలకు చిన్న చూపు ఉండదు, నిత్యం తండ్రిగా, అన్నగా, తమ్మునిగా, భర్తగా మనతో ఎక్కువ కలిసి ఉండేవారు కనుక, మనం ఎప్పుడూ వారిని చిన్న చూపు చూడము.

కత్తి, కలం రెండింటిని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళది. కుటుంబంలో తనకు కావల్సినవి అన్ని త్యాగం చేసి కూడా కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహించే శక్తి మహిళకు ఉంటుంది.

ఉమ్మడి రాష్ట్రంలో నేను ఎమ్మెల్యే గా ఉన్నాను. ఎప్పుడూ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరిగినట్లు నాకు తెలువదు. కానీ తెలంగాణలో సీఎం కేసిఆర్ గారి నాయకత్వంలో మీడియా అకాడమీ ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి.

మీరు పెట్టిన డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాము. మహిళా జర్నలిస్టుల ఆర్ధిక సాయానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి 5 లక్షల రూపాయలు ఇస్తాం.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, సాధికారత సాధించాలని ప్రయత్నం చేస్తున్నాం. మీరు పెట్టిన డిమాండ్లను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాము. మహిళా జర్నలిస్టుల ఆర్ధిక సాయానికి మహిళా, శిశు సంక్షేమ శాఖ నుంచి అకాడమీకి 5 లక్షల రూపాయలు ఇస్తాం.

సీనియర్ జర్నలిస్టు, కవయిత్రి శ్రీమతి వాసిరెడ్డి కాశీరత్నం నేడు ఇక్కడకు రావడం చాలా సంతోషం. ఆమెతో నాకు 1985 నుంచి అనుబంధం ఉంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నేను కొత్తగా చేరాను. అన్నగారు ఎన్టీఆర్ తెలుగు విజయం పేరుతో తెలుగు దేశం పార్టీలో శిక్షణ తరగతులు నిర్వహించేవారు. మొదటిసారిగా నేను శిక్షణ తరగతులకు హాజరయ్యాను. అప్పుడే అన్నగారు ఎన్టీఆర్ ను చూశాను. ఆరోజు జూన్ 21, 1985. ఎప్పటికీ మరిచిపోలేనిది.

ప్రభుత్వ పరంగా మహిళా జర్నలిస్టులకు అన్ని విధాల తోడు ఉంటాం. ఇంత మంది మహిళా జర్నలిస్టు మేధావులను నేడు కలుసుకోవడం సంతోషం.

మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి

ఇంతమంది మహిళా జర్నలిస్టులను ఇలా కలుసుకోవడం సంతోషం.

తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సీఎం కేసిఆర్ గారు ఒక్కో రంగాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి నేతృత్వంలో మీడియా రంగాన్ని అభివృద్ది చేస్తున్నారు.

మహిళలు వివక్ష స్టేజ్ దాటారు. సమాజంలో సగం ఉన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మీ డిమాండ్లను కచ్చితంగా చర్చించి, ముఖ్యమంత్రి కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తాం.

మహిళా జర్నలిస్టులు అందరూ కలుసుకునే విధంగా మహిళా మీడియా సెంటర్ కోసం ప్రయత్నం చేస్తాం. జర్నలిస్టుల పిల్లల విద్య కోసం కూడా సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తాం.

నేడు మహిళలు పురుషులతో పాటు సమానంగా సంపాదన చేస్తున్నా…ఇంట్లో, ఆఫీసుల్లో పనివల్ల చాలా ఒత్తిడికి గురి అవుతున్నారు. కానీ ఈ ఒత్తిడికి తట్టుకుని నిలబడే శక్తి మహిళలకు ఉందని నిరూపిస్తున్నారు. జర్నలిజం అంటే ఆషామాషీ కాదు. అయినా ఈ రంగాన్ని ఎంచుకున్న మీకు అభినందనలు.

మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొంత ఇబ్బందిగా ఫీల్ అయ్యాం. కానీ ఇపుడు అంత ఇబ్బంది లేదు. అయినా మీరంతా ఛాలెంజ్ గా తీసుకుని చేస్తున్నారు. ఎనిమిది చేతులున్న శక్తి స్వరూపినిలం మహిళలం.

ఉద్యమ కాలంలో, తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో మహిళా జర్నలిస్టు పాత్ర మరిచిపోలేనిది. ఉద్యమ సమయంలో ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని ఆనాడు అరెస్టు చేశారు. రాత్రి రెండు గంటలకు పోలీసు స్టేషన్ లో పెట్టారు. అప్పుడు నాకు ఆమె ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇప్పుడు చాలామంది వాళ్ళు ఏమి చేశారు అంటున్నారు. ఇలా అనే వారికి వారు చేసినవి కనపడవు.

ఈ శిక్షణా తరగతులను మహిళా జర్నలిస్టులు సద్వినియోగం చేసుకుని విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.

శ్రీమతి సునీతా లక్ష్మారెడ్డి

ఇంతమంది మహిళా జర్నలిస్టుల ఒక్క దగ్గర కనపడడం సంతోషంగా, కలర్ ఫుల్ గా ఉంది.

జర్నలిజం వినూత్నమైన రంగం. ప్రజాస్వామ్య రక్షణలో నాలుగవ స్తంభం. పురుషులకే సొంతం అన్న ముద్ర ఉన్న ఈ రంగంలో మహిళలు ఇంతమంది ఉండడం, నిలదొక్కుకోవడం సంతోషం. సవాళ్ళను ఛేదిస్తూ ముందుకు సాగుతున్నందుకు అభినందనలు.

ఇటీవల చాలా ఛానెల్స్ వస్తున్నాయి. అన్ని ఛానళ్లలో మహిళలు రాణిస్తున్నారు.

న్యూస్ బయటకు తీసుకురావడంలో అనేక ఒత్తిళ్లు ఉంటాయి. వాటిని తట్టుకుంటూ మహిళలు గొప్ప చర్చలు కూడా చేస్తున్నారు.

ఇందు కలరు అందు లేరు అన్న విధంగా ఎందెందు వెతికినా నేడు మహిళలు అందందు ఉన్నారు.  వంటింట్లో కత్తిని…వృత్తిలో కలాన్ని సమ పాళ్లలో వినియోగిస్తున్న వారు మహిళలు. ఇంకా ఉన్నతమైన స్థానాలకు మీరంతా వెళ్లాలని కోరుకుంటున్నాను. కమిషన్ చైర్ పర్సన్ గా మీకు అండగా ఉంటాను.

వృత్తిపరంగా పని చేసే చోట వేధింపులను అరికట్టే విధంగా మీడియాలో కమిటీలు వేయాలని మీడియా అకాడమీని కోరుతున్నాను.

ప్రభుత్వ సహకారంతో, మీడియా అకాడమీ ప్రోత్సాహంతో మరింత రాణించాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి

ఇంతమంది మా మహిళా జర్నలిస్టులతో సమావేశం కావడం సంతోషం. ఇది శిక్షణ తరగతి కాదు. ఇదొక ఉద్యమం.

మహిళలు ఏ స్థాయిలో ఉన్నా వారి పట్ల వివక్ష ఉంది. ఎన్ని వత్తిళ్లు ఉన్నా.. మహిళలు విజయం సాధిస్తూ ఉనికిని చాటుతున్నారు. మహిళా జర్నలిస్టుల ప్రతిభకు తక్కువ లేదు…కానీ అవకాశాలు తక్కువ ఉన్నాయి.

మహిళల మీడియా అకాడమీ ప్రత్యేకంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను.

మహిళల మీడియా అకాడమీ ప్రత్యేకంగా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను. జర్నలిజంలో అన్ని విభాగాల్లో మహిళలు ఉండాలి. మనం ఎందులోనైనా ఫిట్ అవుతామని నిరూపించాలి. అవకాశం ఇస్తే డామినేట్ చేస్తామనే భయంతో మనకి అవకాశాలు ఇవ్వరు అని గుర్తుంచుకోవాలి.

మనకు అవకాశం ఇవ్వరు…మనం సాధించుకోవాలి. ఆధారపడడం కాకుండా స్వతంత్రంగా వ్యవహారిద్దాం.

ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆకాంక్షిస్తున్నాను.

 మహిళా జర్నలిస్టులు పెట్టిన  ప్రతిపాదనలివే…

  • మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్ ఏర్పాటు చేయాలి.
  • మహిళా జర్నలిస్టులు మరింత సమర్థవంతంగా పనిచేయాలంటే వారి పిల్లల కోసం క్రష్ లు ఏర్పాటు చేయాలి, పనిచేసే సంస్థల్లో ఫీడింగ్ కేంద్రాలు పెట్టాలి.
  • మహిళా జర్నలిస్టులపై వేధింపుల నిరోధానికి కమిటీలు వేయాలి.
  • మహిళా జర్నలిస్టులు స్వతంత్రంగా ఎదగడానికి దళిత బంధువలె కనీసం 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాలి.
  • మహిళా జర్నలిస్టుల హక్కులను కాపాడాలి, కనీస వేతనాలు ఇప్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి.
  • నెలసరి మొదటి రోజు ఇచ్చే సెలవును వర్తింపజేయాలి, నైట్ డ్యూటీ చేసే మహిళలకు రక్షణ, రవాణా వసతి కల్పించాలి….అని ప్రతిపాదనలు చేశారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article