Editorial

Wednesday, May 8, 2024
శాంతిMedak Cathedral - అన్నార్తుల సౌధం : క్రిస్మస్ శుభాకాంక్షలతో...

Medak Cathedral – అన్నార్తుల సౌధం : క్రిస్మస్ శుభాకాంక్షలతో…

మెదక్ చర్చి చరిత్ర వినిపించమని ఫాదర్ ని అడిగితే అయన సుబ్రహమణ్యం గారని ఒక గైడుని ఏర్పాటు చేశారు. వారు పదవీ విరమణ పొందిన అధ్యాపకులు. ఒక అరగంట పాటు చరిత్ర తెలిపిన వైనం ఈ కథనం.

కందుకూరి రమేష్ బాబు

కరువు కాటకం, దానికి తోడు గత్తర – ప్లేగ్లు, ఎటు చూసినా దుర్భరమైన ఆకలీ ఆర్తనాదాలు.. సరిగ్గా అదే సమయంలో చర్చి నిర్మాణం తలపెట్టిన ఫాదర్ – చార్లెస్ వాకర్ పాస్నేట్ వందలు, వేలాది మందికి అన్నం మెతుకులు పెడుతూ ఆలయాన్ని నిర్మింప చేయడం ఒక చరిత్ర …ఆ నిరతి… ధార్మిక ప్రచారం నేపథ్యంలో జరిగిన సేవా నిరతి… అంతకు ముందు ఉన్న పేరు స్థానంలో నేడు చెలామణి లో ఉన్న పేరుకు కారణం అనీ తెలిసింది.

ఆదే ఒక నాడు పూల తోటగా పేరున్న గుల్శానాబాద్. అంతకు ముందు ‘సిద్దాపురం’. కానీ చర్చి నిర్మాణం ‘మెతుకు’ గా మార్చిందని, అది నేడు ‘మెదక్’ గా మారడం విశేషం.

మెదక్ చర్చి చరిత్ర వినిపించమని ఫాదర్ ని అడిగితే అయన సుబ్రహమణ్యం గారని ఒక గైడుని ఏర్పాటు చేశారు. వారు పదవీ విరమణ పొందిన అధ్యాపకులు. ఒక అరగంట పాటు చరిత్రను తెలిపారు.

వారు చెప్పాక శతాధిక వృద్దులు ఎవరైనా ఉన్నారా, ఇంటర్వ్యూ చేస్తాను అని అరా తీస్తే ఇటీవలే 108 ఏండ్ల పెద్ద మనిషి ఒకరు కాలం చేశారని తెలిసింది. ఆమె చర్చికి మొన్న మొన్నటి దాక వచ్చారట. ఆమెతో తాను కూడా అప్పటి జ్ఞాపకాలు అడగలేదని, ఈ ఆలోచన రాలేదని నొచ్చుకున్నారు. ఐతే, మరొకరు రామాయం పేటలో ఉన్నారని, తప్పక కనుక్కుంటానని చెప్పారు.

ఒకరినైనా కలవాలి. వారి జ్ఞాపకాల్లో నాటి స్థితి, నిర్మాణం పని, అందులో అప్పుటి మెతుకుల కన్నీటి గాథ వినాలి. ఆ నిర్మాణం వరకూ ఉన్న మెదక్ పేరుకు మూలమైన పూవులు. అవును. నిజాం రాజుల వందలాది సతీమనులకు బండ్లలో కట్టి పూవులను అక్కడినుంచి పంపిన వైనాన్నీ వినాలి.

సుదీర్ఘ కాలం…ఒక దశాబ్ద కాలం…1914 -1924 వరకూ కొనసాగిన ఆలయం పని, అప్పటి కరువూ, అప్పటి ప్రజల శ్రమదానం – వీటి గురించి సాహిత్యంలో ఎవరైనా నమోదు చేశారో లేదో తెలియదు. జానపదం తప్పక ఇముడ్చుకొనే ఉంటది!

ఈ కాలంలోనే చర్చి తో పాటు, దాని వెనకాలే నిర్మించిన వైద్యశాల కూడా చరితార్థమే నట. పాస్నేట్ మహానుబావుడు అన్నార్తుల ఆకలి తీర్చడమే కాదు, ఇంగ్లాండ్ నుంచు రాలిపోతున్న సన్నజీవులను కాపాడేందుకు మందులు తెప్పించి ప్లేగు వ్యాధి సోకిన వారికి వైద్యం చేశారట. ఆ కాలమంతా అన్నం, మందులతో అభాగ్యులను ఆదుకున్నది ఈ చర్చి, ఆసుపత్రే నట. అది తెలంగాణలోనే వైద్యానికి పేరు మోసిందట.ఒ

ఒక సామాన్య పవిత్ర హృదయం, గ్రామీణ ప్రాంతీయులకు సేవ చేయాలన్న అయన మొక్కవోని సంకల్పం, అదే తనని ఇంగ్లాండ్ నుంచి సికింద్రాబాద్ కి, అక్కడినుంచి సైదాపురం అన్న గ్రామానికి రప్పించడం, అది ఈ ఆలయానికి మూలం కావడం అంతా ఒక డెస్టినీ కాబోలు అనీ అనిపించింది

ఆరవ నిజాం హయాంలో ఈ చర్చి నిర్మాణం జరిగింది. ఐతే, నిజాం రాజు పాస్నేట్ గారి ప్రతిపాదనకు ఒక షరతు మీద ఆమోదించారట. 180 అడుగుల ఎత్తు కాకుండా ఐదు అడుగులు తగ్గించి అంటే, 175 అడుగులలో కట్టమని సూచించారట. ఎందుకూ అంటే, తాము నిర్మించిన చార్మినార్ 180 అడుగులు కాబట్టి. దాని ఎత్తు మించకుండా ఉండాలని చెప్పారట. దాంతో మెదక్ చర్చి అంతటి ఎత్తుతో వేలాది కరువు పీడిత శ్రామికుల స్వేదంతో లేచి నించున్నది.

గైడ్ చార్మినార్ ప్రస్తావన తేవడంతో అది కూడా ప్లేగు వ్యాధి నేపథ్యంలో కట్టారని ఒక కథనం ఉందని గుర్తుకు వచ్చింది. అన్నట్టు, ‘గోథిక్ నిర్మాణం’ అని వినడమే గానీ, శిలువ వేసిన ఏసు క్రీస్తు మాదిరి నిర్మాణమే గోతిక్ అని, అదే ఈ చర్చకి మూలమనీ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు!

ఏమైనా, ప్రజల శ్రమతో నిలబడ్డ ప్రేమ సౌధం తాజ్ మహల్ గురించి ఎట్లాగైతే చెప్పుకున్నామో, ప్రజల ఆకలి నుంచి నిలబడ్డ ఆలయాల గురించి, నిర్మాణాల గురించి కూడా ఒకసారి చెప్పుకోవాలి. ఆ దిక్కునుంచి కూడా చూడాలి.

ప్రబువు ఎత్తిన శిలువ భారం, ఆ మహనీయుని సువార్తలు , చర్చి ఇస్తున్న స్వాంతన ఒక అనుభవం కాగా, ఇది అన్నార్తుల సౌధం అని తెలియడం మరో అవ్యక్తమైన అనుభవం. చర్చి చుట్టారా తిరుగాడుతుంటే ఎన్నో భావనలు. ఇప్పుడు కాదు, తొమ్మిది దశబ్దాల క్రితం ఇంతటి నిర్మాణం… వేయి ఎకరాల స్థలంలో రెండొందల నమూనాల నుంచి ఎంపిక చేసిన ఈ నిర్మాణం…దానికి పూనుకున్న ఫాదర్ విరళాలకోసం ఇంగ్లాండ్ లో పడ్డ బాధలు… ఆయన్ని భారతీయ బిచ్చగాడు అని తొలుత అవహేళన చేయం… తర్వాత వారి సంకల్పం నచ్చి అందరూ ఆర్థిక సహకారం చేయడం…ఆయన తిరిగి రావడం, వచ్చాక నిర్మాణానికి నడుం కట్టడం, సరిగ్గా అప్పుడు కరువు…మెతుకుల కోసం పనికి వెళ్ళిన మనుషులు. వందలు వేలు….
..
ఎవరైనా ఛాయా చరిత్రకారుడు అప్పటి స్థితిని రూపు కట్టే ఉంటాడు. చూడాలి.

తాను నివసించడానికి రెండంతస్తుల భవనాన్ని నిర్మించుకున్న ఫాస్నేట్ అక్కడినుంచి ఒక రోజు చర్చిని చూసి కలవర పడినాడట. అది తనకన్నా కింద ఉండటం కలచి వేసిందట. తనలో పచ్చత్తాపాన్ని రగిలించిందట. అలా అపరాధ భావంతో మొదలైన సౌధమా ఇది అన్నవిస్మయం కలిగింది.

ఒక సామాన్య పవిత్ర హృదయం, గ్రామీణ ప్రాంతీయులకు సేవ చేయాలన్న అయన మొక్కవోని సంకల్పం, అదే తనని ఇంగ్లాండ్ నుంచి సికింద్రాబాద్ కి, అక్కడినుంచి సైదాపురం అన్న గ్రామానికి రప్పించడం, అది ఈ ఆలయానికి మూలం కావడం అంతా ఒక డెస్టినీ కాబోలు అనీ అనిపించింది లేదా కరువు కాలంలో మెతుకులు పోయడానికే అయన వచ్చాడా తెలియదు.

 

2018 జూలై లో మొదటిసారి మెదక్ చర్చి చూసినప్పుడు రాసిన వ్యాసం

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article