Editorial

Friday, May 17, 2024
ఆధ్యాత్మికంమేడారం ఒక దేవత, కనువిప్పు

మేడారం ఒక దేవత, కనువిప్పు

జాతర వైభవం చెప్పుకోవడంకోసం ఇది దేశంలో అతి పెద్ద ఆదివాసీ జాతర అనడం లేదా తెలంగాణా కుంభమేళ అనడం వృధా. అది జీవితకాలం అనుభవం.

మేడారం వైభవం గురించి చెప్పే వాటిల్లో రెండు ముఖ్యమైనవి. ఒకటి, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆదివాసీ గిరిజన జాతర అంటాం. రెండవది, భారతదేశంలో కుంభమేళ తర్వాత అంత పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్శించే జాతరగా చెబుతాం, ‘తెలంగాణ కుంభమేళ’గానూ అభివర్ణిస్తాం. ఐతే, ప్రతి రెండేళ్లకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లతో పాటు మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, ఒరిస్సా, మధ్య ప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కారణంగా మేడారం జాతర విస్తీర్ణం పెద్దది.
అలాగే, సంప్రదాయ దృష్టిలో ఇసుక వేస్తే రాలనంత జనం ఉండటం వల్ల కూడా ఈ రెండు విశేషణాలు జాతర వైభవాన్ని చెబుతాయనే అనుకుంటాం. కానీ అవి రెండూ చాలా చిన్న విషయాలు. అసలు మేడారంలో జరిగే వ్యవహారం ఒక గుట్టు వంటిది. అది చూస్తే కనిపించదు. వింటే వినిపించదు. చాలా జీవన వ్యాపారం జరుగుతుందక్కడ. అంతుపట్టని ఒక ఆవాహనకు ఆధీనం మేడారం. అందుకు ఇరుసు స్త్రీ. ఆమె దేవత. మేడారాన్ని ఆవహిస్తుంది. కనీసం నాలుగు ఘట్టాలు చూడాలి. అదంతా మహిళావరణం. దాన్ని చూడకుండా, వినకుండా రావోద్దనే ఈ చిన్న సందర్శనం.
ఒకటి, మేడారం చేరకముందు, కనీసం ఐదారు కిలోమీటర్ల ముందు నుంచే భక్తుల్లో ఒక తాదాత్మ్యత. చిన్నగా మొదలై అది ఆ స్థలానికి చేరుకుంటూ ఉంటే, ఒక లోలకం తన చుట్టూ తాను తిరుగుతూ ఎట్లయితే లయాత్మకంగా ఊగుతుందో అలా మహిళలు, వారి ఆత్మలు అమ్మవారు ఆవహిస్తూండగా అలా పరిబ్రమిస్తూ తూలుతాయి. భక్తులకు ఆ అలజడి ప్రయాణీకుల స్థాయి నుంచే మొదలవడం ఒక విస్మయం కలిగించే వాస్తవం. ప్రతి ఎడ్లబండి, ట్రాలీ, వ్యాను, బస్సు – ఒక అంతుపట్టని శక్తికి లోబడటం కానవస్తుంది. భక్తులు ఆ ఎర్రమట్టి నేలలో కాలీడక ముందే ఒక అపారమైన చేతనావృతం ఇంతితై పెరుగుతుండటం విస్తీర్ణంగా పరివ్యాప్తం చెందటం చూస్తాం. అది మేడారం మొదటి మెట్టు.

మేడారం జాతర – అద్వితీయం ఘట్టం..

మొదటిరోజు సుదూర ప్రాంతాల నుంచి సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు గద్దెలను చేరుకుంటారు. ఆ మరుసటి రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెల వద్దకు చేరుతుంది. సమ్మక్కను చిలకల గుట్ట నుంచి తీసుకు వస్తుంటే కనీసం కిలోమీటరు పొడవునా నిస్సందేహంగా దారికి అటూ ఇటూ ఒక తాండవం. బీకరం. దాన్ని భక్తుల పారవశ్యం అంటే చిన్న మాట. శివాలూగే ఆ జీవశక్తిని కళ్ళారా చూడటం మొత్తం మేడారం జాతరలో అద్వితీయం ఘట్టం. అది ఎదురుకోళ్ళ ఘట్టం. సమ్మక్కను ఎదుర్కొంటూ అడుగడుగునా కోళ్ళు, మేకలు, గొర్రెలు తెగిపడుతుంటే, అడవికి జన సంద్రానికీ మధ్య ఏర్పడే ఆ వంతెనలో నిలబడటం ఎంతో కష్టం. మనిషి దేవతను ఆవహించుకోవడం అంటే ఏమిటో చూడాటానికి కళ్ళు మాత్రమే కాదు, సమస్త ఇంద్రియాలూ ఆ ఘడియలో అప్రమత్తం కావాల్సిందే.
ప్రతి మహిళా సమ్మక్క అవడం అక్కడి విశేషం. శిగమూగుతూ అమ్మవారిని ఆహ్వానిస్తూ ఉండే ఆ మహిళలు, వారిని పట్టుకోలేక ఆశక్తులవుతూండే పురుషులు, అంతా ఒక జన సముద్రం పోటెత్తి ఉప్పొంగే ఆ వాతావరణం చూడటానికీ ఎంతటి భీతివాహంగా ఉంటుందీ అంటే దుర్భాల మనస్కులు చూడక పోవడమే ఉత్తమం.

రక్తం చిందించిన ఆ నేలనే.. జంపన్న వాగు

ఇక మూడవది, జంపన్న వాగు. సమ్మక్క కుమారుడు జంపన్న రక్తం చిందించిన ఆ నేలనే వాగైంది. అక్కడే తల నీలాలు సమర్పిస్తారు. ఇక్కడ పిల్లాజెల్లతో కుటుంబాలు కుటుంబాలు పవిత్ర స్నానం ఆచరిస్తారని మాత్రం అనుకుంటే పొరబాటు. కాస్త జాగ్రత్తగా చూస్తే, ఇక్కడి జలంలో జీవం పలు ప్రశ్నలై, తగు సమాధానాలై ఎగిసి సద్దుమనుగుతుంది. అకస్మాత్తుగా కుటుంబంలోని ఒక మహిళ సమ్మక్క అవుతుంది. మొత్తం సభ్యులందరి మంచి చెడ్డలు విని, విచారించి, పరిష్కరించే దేవతా మూర్తిగా మారుతుంది. తమలోని ఒకరే తమకు మార్గదర్శకత్వం వహించే స్థితిలో జంపన్న వాగాంతా ఒక నూతన అవతారమై, శాసనమై పోటెత్తడం దర్శించవలసిందే తప్ప మాటల్లో వర్ణించలేం.
ప్రతి కుటుంబం నుంచి ఒకరు ప్రతినిధిగా మారగా ఆ వాగు యావత్తూ ఏండ్లుగా తమను పట్టి వేధిస్తున్న సమస్యలన్నిటినీ ఏకరువు పెట్టె అసెంబ్లీ అవడం, ఒక పరిష్కార కేంద్రంగా మారడం, అదొక ప్రకటిత శాసన సభగా మారడం నిజంగా ఒక విశేషం. అసామాన్య శక్తితో శిగమూగే ఆ సమ్మక్క తల్లి కుటుంబ సభ్యుల సమస్త సమస్యలకు పరిష్కారం చెప్పడం గనుక శ్రద్దగా వింటే, ఇంట్లోని గుట్టంతా అక్కడ భహిర్గతమై ఒకానొక మార్గదర్శకత్వంతో తిరిగి సద్దుమణుగుతుందా అనిపించక మానదు. నేడు పిత్రుస్వామికంగా మారిన లోకమంతా అక్కడ, ఆ వాగులో అనివార్యంగా మాత్రుస్వామికంగా మారిపోవడం, సమ్మక్క మాట జవదాటకుండా కట్టడిలోకి మారడం నేటి ఆదునిక మానవుడి అనాది వైచిత్రి.

ముడుపులు – మొక్కులు – గద్దెలు

జంపన్న వాగు నుంచి అటు తర్వాత ముడుపులు, మొక్కులు చెల్లించేందుకు గద్దెల వద్దకు కదులుతారు. అటు తర్వాత మరో నాలుగో ఘట్టం. అది నిజానికి ప్రతి డేరాలో కనిపిస్తుంది. ముఖ్యంగా చీకటి పడుతుంటే ఎడతెగకుండా వినవస్తుంది. దానికు ముందు మరో సంగతి అర్థం చేసుకోవాలి.
నిజానికి మేడారం జాతర మొత్తంగా స్త్రీ కేంద్రకం అనాలి. ప్రతి మహిళా ఇక్కడ సమ్మక్క సారలమ్మ అవడం విశేషం. పురుషులు కేవలం నిమిత్త మాత్రులే. ఒక రకంగా తెలంగాణలో బతుకమ్మ, బోనాల పండుగల్లో ఎట్లయితే మగవాళ్ళు స్త్రీలకు సహకారంగా ఉంటారో ఇక్కడా అటువంటిదే కనిపిస్తుంది. ఒక్క మాటలో మనలోని అజ్ఞాత సమ్మక్క సారలమ్మలు అక్కడికి వచ్చి ఊరేగడమే ఈ మేడారం జాతర విశేషం. అంతా ఒక దివ్యానుభవం.
ఇక, చెప్పవలసిన నాలుగో విశేషం, ఈ నాలుగు రోజులూ ఒక గొడగొడ దుఖం మనల్ని అంటిపెట్టుకునే ఉండటం. అవును. ప్రతి బిడారంలో వదినా యారాళ్ళు, అత్తా కోడళ్ళు, ఆడబిడ్డలు ఒకరిని ఒకరు పట్టుకొని, అది శిగాలూగడం కూడా కాదు, అది ఎట్లా ఉంటుందీ అంటే, తమలోని గూడు కట్టుకున్న వేదనను మెల్లగా ఎగదోసేలా, తోసుకువచ్చే దుఖం ఎల్లలు లేకుండా వ్యక్తమయ్యేలా ఒక శాఖను ఇంకో శాఖ, అట్లా శాకోపశాఖాలుగా స్త్రీ దేహం ఒదార్చుకోవడం కానవస్తుంది. బెంగటిల్లిన తనమంతా తనవితీరా, ‘పురాత’ పంచుకునేలా చేస్తుంది. అంతు తెలియని దుఖం, రంది, నిద్రపట్టనీయని బాధ అంతనూ సుదీర్ఘంగా రోదిస్తున్నట్టు ఉంటుంది. మనిషిని మనిషి పట్టుకుని, అలిమిచ్చుకుని తనవితీరా వారంతా అలా రోదిస్తూ ఉంటే, తల్లడిల్లే ఆ కుటుంబ వృక్షం మెల్లగా తేటపడటం ఈ నాలుగు రోజుల విశేషం అని చెప్పాలి. మీరు ఎక్కడ పడుకున్నా చెవోగ్గి వింటే లీలగా నిద్రలేపే ఆ సామూహిక అంతరంగ రోదన ఒకటి ప్రతి గుడారం నుంచి మొత్తం మేడారం అంతటా పరివ్యాప్తమై, సమస్త పంచభూతాలలో వ్యాప్తమై, ఇది కదా స్వాంతన అనిపించేలా చేస్తుంది.

యాతనకు కాస్త ఉపశమనం

నిజానికి లోవెలుపలా ఒక సముద్రం ఉంటుంది. అందులో బడబాగ్ని ఒకటి జ్వలించి సద్దుమణుగుతుంది. అది శాంతించేదాకా వదిలిపోదు. సరిగ్గా ఈ నాలుగు రోజులు కడుపారా కావలించుకుని ఏడుస్తారు. నవ్వుతారు. ఆ నవ్వులో ఒక వర్ణించలేని శోభ, సొంధర్యం ఉంటుంది. ఎవడూ నిలిపలేని ఒక వికట్టహాసమూ ఉంటుంది. ఎదిరింపూ, ధిక్కారం ఉంటుంది. గొప్ప ఆత్మగౌరవం కానవస్తుంది. మనిషి ప్రకృతిగా, దేవతగా మారి జూలు విదిల్చడం, తిరిగి శాంతించే మహోగ్ర రూపకం అక్కడ చూస్తుండగానే పురుడు పోసుకుని మెలమెల్లగా అదృశ్యమవడం ఈ జాతర విశేషం. నిజానికి ఏ ఆధునిక వైద్యం, మానసిక చికిత్సా ఇవ్వని స్వాంతన ఎదో, మన ఇంగితానికి అందని థెరపి ఏదో ఆ ఆదివాసీ గిరిజన జాతర ఇస్తున్నాదా అనిపించక మానదు. తినడం, తాగడం అన్నది పైన చెప్పినట్టు, నిలువెల్లా వ్యక్తమయ్యే యా యాతనకు కాస్త ఉపశమనం తప్ప మరోటి కాదు.
చెట్టుపుట్టల నుంచి చీమలబారులు నడిచొచ్చినట్టు మేడారం రెండేళ్లకొకసారి జనవనం అవుతుంది. నాలుగు రోజుల అనంతరం తిరిగి దేవతలు వనప్రవేశం చేయడంతో సమస్త మానవ బలగాలు ఆదిమ వాసులుగా తిరిగి సజీవమై తిరుగుముఖం పడుతారు. ఇదంతా ఒక ఆవాహన. ఆధునికత, అభివృద్ధి అన్న నాణానికి మరో పక్కన రూపుగట్టే బొమ్మ. చిత్తు. జీవితకాలం మరచిపోలేని ఒక అపురూప అర్చన, క్రతువు. టూరిజం కానే కాదు. అందుకే దీన్ని చూడటానికి కళ్ళు సరిపోవు. కను విప్పాలి అనడం. నలు దిక్కులా భయమూ భక్తీ, శ్రద్దా విశ్వాసం తప్పా మరేం లేని ఈ జాతర వైభవం చెప్పుకోవడంకోసం ఇది దేశంలో అతి పెద్ద ఆదివాసీ జాతర అనడం లేదా తెలంగాణా కుంభమేళ అనడం వృధా. అది జీవితకాలం అనుభవం. దర్శించండి.

More articles

2 COMMENTS

  1. మేడారం ఒక దేవత, కనువిప్పు..
    మీరు ఉపయోగించిన చిత్రాలు మాత్రం కాశి వి …ఇది చాలా అన్యాయం ..

    • డమ్మీ కోసం తయారు చేసిన పోస్టు అలాగే ఉండిపోవడం వల్ల తప్పు జరిగింది. ఆ పోస్టును తీసేస్తాము త్వరలో. దృష్టిలోకి తెచ్చినందుకు కృతజ్ఞతలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article