Editorial

Sunday, April 28, 2024
ARTSOpen letter to CM KCR : పది కోట్లతో 'భరత్ భూషణ్ ట్రస్ట్' కై...

Open letter to CM KCR : పది కోట్లతో ‘భరత్ భూషణ్ ట్రస్ట్’ కై కెసిఆర్ గారికి వినమ్ర విజ్ఞప్తి

ఇటీవల కన్ను మూసిన ఛాయా చిత్రకారులు శ్రీ భరత్ భూషణ్ గారి పేరిట ఒక ట్రస్టు నెలకొల్పి వారి గ్రంధాలను అచ్చువేయడం, ఒక శాశ్వత గ్యాలరీ నెలకొల్పి వారి చిత్రాలను మహత్తరంగా ప్రాచుర్యంలోకి పెట్టడం అంటే అది తెలంగాణా పెద్ద దర్వాజకు పచ్చటి తోరణం కట్టడమే.

తెలంగాణా సంస్కృతికి, జీవన శైలికి ప్రభుత్వం తరపున జరిగే ఘనమైన చేర్పుగా కొనియాడాలి. అందుకే వారి పేరిట పదికోట్ల ట్రస్టు ప్రతిపాదన ముఖ్యమంత్రి గారి ముందు పెట్టడం. అమలుకోసం అందరి మద్దతు కూడగట్టడం.

కందుకూరి రమేష్ బాబు 

Kandukuri Ramesh Babu
Editor, Teluputv

ఇటీవల కన్ను మూసిన ఫోటో గ్రాఫర్ శ్రీ భరత్ భూషణ్ స్మారక సభ నిన్న ప్రెస్ క్లబ్ లో జరిగింది. వారి కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, పిల్లల్లో ఒకరికి ఉద్యోగం, తక్షణం కుటుంబ నిర్వహణకు చేతనైన ఆర్థిక సహాయం వంటివి కొందరు ప్రతిపాదించారు. వారిపై వచ్చిన వ్యాసాలను సంకలనం చేయడం కూడా ఒక ఆలోచనగా చేశారు. వ్యక్తిగతంగా చేయవలసింది చేస్తూనే ప్రభుత్వ పరంగా భరత్ భూషణ్ కుటుంబానికి సహాయం కోసం తాముఅండగా ఉంటామని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఐతే, సభ చాలా పేలవమైన ప్రతిపాదనలు ముందుకు పెట్టడం పట్ల నేను అభ్యంతరపెడుతూ మరింత అవశ్యమైన గంభీర ప్రతిపాదనలు చేస్తునాను అన్నాను. హాస్యాస్పదం అనుకోకుండా నా ప్రతిపాదనలు వినండి అని కోరాను.

నేను ఆయన కృషికి లక్ష రెండు లక్షల ఆర్థిక సహాయం, కుటుంబానికి ఒక చిన్న ఇల్లు వంటి ఆలోచనలకు పరిమితం చేయరాదని, ఇవి చాలా చిన్నవి అని, అయన బతికి ఉన్నప్పుడే వారి ఇల్లు ఒక గ్యాలరీ లేదా మ్యూజియంలా నిర్వహించారని గుర్తు చేశాను.

వారు పేదరికంతో బాధ పడలేదని, అయన ఎంచుకున్న కార్య రంగం విస్త్రుతమైనది కావడం వల్ల ఆర్థిక భారంతో అయన ఇబ్బంది పడ్డారని అన్నాను. అది లక్ష్యం కారణంగా జరిగిన అంశంగా పేర్కొన్నాను.

అయన ‘తెలంగాణా సాంస్కృతిక రాయబారి’ వంటి వారు కనుక ఇక ముందు వారి కృషిని సెలబ్రేట్ చేయడానికి మన ఆలోచనల్లో పేదరికం ఉండరాదన్నాను.

అయన ‘తెలంగాణా సాంస్కృతిక రాయబారి’ వంటి వారు కనుక ఇక ముందు వారి కృషిని సెలబ్రేట్ చేయడానికి మన ఆలోచనల్లో పేదరికం ఉండరాదన్నాను. అయన మరణానంతరం అయినా వారి కృషిని తెలంగాణా అపురూపంగా స్మరించుకోవాలని, నిజానికి వారి వర్క్ ఎవరూ ఇంకా పెద్దగా చూడలేదని, తెలంగాణా గర్వించదగిన పనులకోసం ఒక నాలుగు ప్రతిపాదనలు చేశాను. వాటిని మనందరం ముఖ్యమంత్రి గారి ముందు ఉంచాలని నా విజ్ఞప్తిగా ఇప్పుడు ఇక్కడ బాహిరంగంగా మీ ముందు ఉంచుతున్నాను.

కాగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు ఈ సభ నిర్వహించగా మానవ హక్కుల వేదిక జీవన్ కుమార్ మొదలు ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టు అంబటి సురేంద్రరాజుగారి నుంచి ప్రసిద్ద దర్శకులు బి నరసింగరావు వరకూ పలువురు మాట్లాడారు. సీనియర్ ఫొటోగ్రాఫర్లు డి. రవీందర్ రెడ్డి, వీరేశ్ బాబు మొదలు అనుమల గంగాధర్ గారు దాకా… కవయిత్రి విమల గారు, యాక్టివిస్టు సజయ గారు, అరుణోదయ విమలక్క, ప్రొ.కోదండరాం గారితో సహా… ప్రొ. పిల్లలమర్రి రాములు గారు మొదలు పసునూరి రవీందర్ దాకా ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఎం ఎల్ సి ఎల్ రమణ గారు మొదలు పాత్రికేయ నాయకులు పల్లె రవి కుమార్ గారు హాజరయ్యారు. ముఖ్యంగా ఇప్పటిదాకా అండగా ఉన్న వి ప్రకాష్ గారు ఇకముందు కూడా ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి భరత్ భూషణ్ గారి విషయంలో ఏర్పాటు అయ్యే అంశాలను చూడవలసినదిగా అందరూ కోరారు.

భరత్ భూషణ్ గారి బావ…ఒక ప్రతిపాదన చేశారు. ప్రభుత్వం ఒక వేయి గజాల స్థలం ఇస్తే మనమంతా కలిసి ఒక ఇల్లు లేదా మరో భవనం నిరించి పిల్లలకు ఇద్దామని సూచించారు. ఐతే అందరూ ఆయనకు చేయవలసింది ఏమిటీ అన్న విషయంలో వారి కృషిని పెద్ద ఎత్తున పదిల పరిచే ఆలోచన చేయనందున, చాలా పరిమితి, పేదరికం తాలూకు భావనలు మనకే ఉండటం తగదని, భరత్ భూషణ్ గారిని భావి తరాలకు చిరస్మరణీయంగా ఉంచడానికి చేయవలసింది పదికోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు అని గట్టిగా సూచించాను. విస్తృత సూచనల ప్రతిపాదన చేశాను. ఇప్పటికే వారి ప్రాముఖ్యతపై నేను పలు వ్యాసాలు రాయడాన్ని గుర్తు చేశాను. చేసిన ఆ ప్రతిపాదనలు ఇక్కడ పెర్కొంటూ ఈ అంశాలను ముఖ్యమంత్రి కేసేఆర్ గారికి చేరవేయాలని నా సూచన. అలాగే మంత్రివర్యులు కెటిఆర్ ఆర్ గారికి, ఎం ఎల్ సి కల్వకుంట్ల కవిత గారికి, ప్రభుత్వ సలహాదారులు రమణా చారి గారు, సాంస్కృతిక శాఖా సంచాలకులు మామిడి హరికృష్ణ గారి దృష్టికి తీసుకొని వీటి సాధనకోసం అందరం నడుం కట్టాలని నా విజ్ఞప్తి.

ఇవి ఆ ప్రతిపాదనలు :

1. భరత్ భూషణ్ గారి మూడు కాఫీ టేబుల్ గ్రంథాలను ఒక్కొక్కటి ఇదువేల కాపీలు ప్రగతి వంటి ప్రెస్ లో అచ్చువేయడానికి కనీసం ఒక్కొక్కటి 25 లక్షలు అవుతుంది. ( ఈ ఒరవడిలో బి నరసింగ రావు గారు పని చేసి ఉన్నారు గనుక ఈ పని ఎంత ఖరీదైనదో వారికి తెలుసు అని నిన్న గుర్తు చేస్తూ ఈ సూచన చేశాను ) మూడింటికి 75 లక్షలు అవుతుంది. ఆ మూడు పుస్తకాలు తెచ్చే క్రమంలో మొత్తం భరత్ భూషణ్ గారి వర్క్ డిజిటలైజేషన్ పూర్తి చేయడం, నెగెటివ్ ల స్కానింగ్ మొదలు ప్రీ ప్రొడక్షన్, ముందుమాటలు, రైటప్ – రీసెర్చ్ – బుక్ డిజైనింగ్ తదితర ఇతర ఖర్చులన్నీ కలిపి మొత్తం ఒక కోటి రూపాయల బడ్జెట్ అవసరమవుతుంది.

కోటి రూపాయలతో తెలంగాణా పునరుజ్జీవన ప్రతీక ఐన ‘బతుకమ్మలు’ ఒక గ్రంధంగా … తెలంగాణా జీవన విధ్వంసానికి ప్రతీకగా నిలిచిన నాటి కూలిన గోడలు, మూసిన దర్వాజాల ‘తలుపులు’ రెండో గ్రంధంగా … అలాగే -తెలుగు ప్రజల జీవితంలో కుడి ఎడమలుగా ఉన్న సాంఘిక సాంస్కృతిక కళా రంగాల ప్రముఖుల రూప చిత్రాల గ్రంధం – ‘భరత్ భూషణ్ పోట్రేచర్’ మూడో గ్రంధంగా తేవాలి. ముందు ఈ మూడు గ్రంధాలూ తెచ్చి అయన కృషిని తెలంగాణ రాష్ట్రం ఘనంగా స్మరించుకోవాలి. ప్రపంచానికి చాటాలి. ఇందుకోసం కోటి రూపాయలు వెచ్చించాలి.

రెండు : అయన పేరిట విశాలమైన భరత్ భూషణ్ ఫోటోగ్రఫీ గ్యాలరీ నగరంలో ఏర్పాటు చేసి అందులో పైన పేర్కొన్న వారి వర్క్స్ తో సహా మరిన్ని వారి చిత్రాల నిరంతర ప్రదర్శన – పర్మినెంట్ గ్యాలరీ ఒకటి ఏర్పాటు చేయాలి. అలాగే అదే గ్యాలరీలో వర్తమాన ఫొటోగ్రాఫర్ల ప్రదర్శన ఎప్పుడూ ఒకటి నిర్వహించడానికి గానూ మరో గ్యాలరీ ఒకటి నిర్మించాలి. మరో హాల్ లో అయన సేకరించిన పుస్తకాలు, పెయిటింగ్ లు ఉంచాలి. వీటి నిర్వహణకు ఏర్పాటు చేసే కార్యాలయంతో సహా ఈ గ్యాలరీ అయన స్మృతిలో ఫోటోగ్రఫీకి కేంద్రంగా విలసిల్లాలి. ఏడాది పొడవునా అయన బొమ్మలూ, అదే సమయంలో ఇతరుల ప్రదర్శనలు గ్యాలరీలో నిరంతరం సాగేందుకు వీలుగా కనీసం నాలుగు కోట్ల రూపాయలు వెచ్చించడం. దాంతో స్థలం, భవన నిర్మాణం జరపాలి. ఈ గ్యలరీ ఏర్పాటైతే ఇది తెలంగాణకు ఒక పెద్ద్ద దర్వాజగా నిలవడం ఖాయం. వారి ఆత్మ కూడా శాంతిస్తుంది. తోటి ఫోటోగ్రాఫర్లకు కూడా అమిత ఆత్మవిశ్వాసం కలుగుతుంది.

మూడు : పైన పేర్కొన్న గ్రంథల ప్రచురణ, భారత్ భూషణ్ పేరిట గ్యాలరీ నిర్మాణం- నిర్వహణకోసం భరత్ భూషణ్ పేరిట ఒక ట్రస్ట్ ఏర్పాటు- దాని నిర్వహణకు గాను కుటుంబ సభ్యులతో పాటు సీనియర్ ఫోటోగ్రాఫర్లు, అలాగే సాహిత్య, కళా రంగాల ప్రముఖుతో ఒక కమిటీని నియమించాలీ. వెంటనే పనులు జరపాలి. ఈ ట్రస్టుకు గాను మొత్తం పది కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి.

దాంట్లోంచి కోటి రూపాయలు గ్రంథ రచనకు, నాలుగు కోట్లు గ్యాలరీ నిర్మాణానికి వెచ్చించి, మిగతా ఇదు కోట్లను ట్రస్టు కార్యకలాపాల శాశ్వత నిర్వహణకోసం డిపాజిట్ చేసి దాని ద్వారా వచ్చే ఇంట్రెస్ట్ తో పనులు సాగించాలి.

నాలుగు: జర్నలిస్టు హౌజింగ్ సొసైటీ పేరిట ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న భూముల అంశం ఎప్పుడు పరిష్కారం అవుతే అప్పుడు సభ్యులందరితో సహా ఇప్పటిదాకా జాగ రాని భరత్ భూషణ్ గారికి కూడా ఇల్లు లేదా ఫ్లాటు కేటాయించాలి. అది కుటుంబానికి సొంత ఆస్తిగా ఉంటుంది.

ట్రస్టులో సభ్యులుగా భారత్ భూషణ్ కుమారులో కుమార్తెనో ఒకరు ఉంటారు కనుక అదే ఒకరికి శాశ్వత ఉద్యోగం అనుకోవచ్చు.

ముఖ్యమంత్రికి తెలుపాలి

ఈ నాలుగు ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు పెట్టి వాటి సాధించాలని నిన్న నేను విజ్ఞప్తి చేశాను. చాలామంది అందుకు సానుకూలంగా స్పదించారు కూడా. ఐతే ఇది ముఖ్యమంత్రి పూనికతో అయ్యే వ్యవహారం కనుక అంతదూరం ఈ ప్రతిపాదన తీసుకు వెళ్ళడం ఎలా అన్నది సమస్య. అందుకు బహిరంగ విజ్ఞప్తితో పాటు వ్యక్తిగతంగా కలవడం అవసరం అని నా భావన. ఐతే, ఈ ప్రతిపాదనలు మీకు ఆమోదం ఐతే వీటి సాకారం కోసం పదికోట్లతో భరత్ భూషణ్ ట్రస్ట్ ఏర్పాటుకై ముఖ్యమంత్రి గారికి బహిరంగ విజ్ఞప్తి చేద్దాం. వారికి చేరేలా అన్ని విధాలా ప్రయత్నిద్దాం.

చివరగా నిన్న తక్షణం అవసరాలకోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయానికి ముందుకు వచ్చిన ఎం ఎల్ సి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ధన్యవాదాలు. వారూ.. ప్రకాష్ గారూ , జర్నలిస్టు శాసన అభ్యులు క్రాంతి కిరణ్ గారు ఈ ట్రస్ట్ ప్రతిపాదన కేసేఆర్ గారికి చేరేలా కృషి చేయాలనీ మరోసారి అభ్యర్థిస్తూ, ప్రెస్ క్లబ్ లో స్మారక సభ నిర్వహణకు పూనుకున్న మిత్రులకు మరో మారు కృతజ్ఞతలతో …

భరత్ భూషణ్ గారికి నివాళిగా పునరంకితమవుతూ.

కందుకూరి రమేష్ బాబు తెలుపు టివి ఎడిటర్, దేశంలోనే తొట్ట తొలిసారిగా మట్టిమనుషుల కోసం ఏర్పాటు చేసిన ‘సామాన్యశాస్త్రం ఫోటోగ్రఫీ గ్యాలరీ’ వ్యవస్థాపకులు. భరత్ భూషణ్ గారి పేరిట ఒక ట్రస్టు ఏర్పాటు చేయడం, వారికి అంతటి ఘన నివాళి ఎందుకో తెలుపే వారి మూడు వ్యాసాలు ఇక్కడ చదవండి.

వారే లేకపోతే? తెలుపు ఘన నివాళి
ఎవరీ భరత్ భూషణ్ : జీవితకాలం కృషి తెలుపు
World Cancer Day : భరత్ భూషణ్ ‘ఫెయిల్యూర్ స్టోరీ’

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article