Editorial

Friday, May 3, 2024
Peopleనర్సిరెడ్డి సార్ : ఆయనే ఒక బడీ గుడీ రైతుల కూడలీ : సఫల జీవితం...

నర్సిరెడ్డి సార్ : ఆయనే ఒక బడీ గుడీ రైతుల కూడలీ : సఫల జీవితం తెలుపు

ఎంచుకున్న కార్యం ఏదైనా అది సఫలం కావాలంటే, దానికొక సార్థక యోగం దక్కాలంటే ఎలాంటి దృక్పథం అవలంభించి పని చేయాలో తెలిసిన అచ్చమైన కర్మయోగి నర్సిరెడ్డి గారు. వారిదొక సఫల జీవనం. వందేమాతరం ఫౌండేషన్, కౌనిల్స్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సంస్థలు ఈ శనివారం జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న సందర్భంగా వారి జీవన వికాసం తెలుపు రచన ఒక సగౌరవ కానుక. అభినందన మాల.

కందుకూరి రమేష్ బాబు

Kandukuri Ramesh Babu

ఒక వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే వారు ఎంత ఎక్కువ అర్థమవుతారో అటువంటి చేతల వ్యక్తి నర్సిరెడ్డి గారు. వారు నిశబ్దంగా కాన వస్తారు. మౌనంగా పని చేస్తారు. వారిది అసామాన్యమైన దేశభక్తి. విశిష్టమైన కార్యదక్షత.

విద్యుత్ శాఖలో ఉద్యోగిగా, పదవీ విరమణ చేసిన వ్యక్తిగా, స్వచ్ఛంద సేవకులుగా వారిదొక స్యయం సేవ. అది కులమతాలకు అతీతం. దైనందిన జీవితంలోని అన్ని జీవన వ్యాపారాలలోనూ వారిది ప్రత్యేక శైలి. ప్రతి అడుగులో అయన ముద్ర విభిన్నం. అది సామాన్యం కూడా. తెలుసుకుంటే గొప్ప స్ఫూర్తి.

ఈ సమాజపు ఆలయానికి గుడీ- బడీ అత్యంత అవశ్యమైన పీఠాలుగా ఎంచిన అరుదైన కృషీవరులు వారు. మానవుడిని పరమాత్ముడితో లీనం చేసే గర్భ గుడి మాత్రమే కాదు, పసి పిల్లలనే దేవుళ్ళుగా ఎంచే భావిభారత తరగతి గదులూ వారికి అంతే ప్రియం. అందుకే దశాబ్దాలుగా నిధుల కొరత, అశ్రద్ధ కారణంగా వెనక పట్టు పట్టిన సర్కారు బడుల పునరుద్దరణ కావచ్చు, పల్లె పట్టుల్లో కొడగట్టి పోతున్న స్థానిక ఆలయాల పునర్వైభవం, జీర్ణమైన గుడుల పునరుద్దరణా కావొచ్చు. ఈ రెండింటా వారిది సమదృష్టి. వెనుకబడిన పాలమూరు మొదలు రాష్ట్ర రాజధాని బాగ్యనగరం దాకా విద్యా సామర్థ్యాల కోసం, ఆధ్యాత్మిక సంపద కోసం రెండింటా వారిది నిరుపమానమైన కృషి. ఒక్కమాటలో వారిదొక సఫల జీవనం. ఎడుపదులకు చేరువైన వారు ఇప్పుడు అందుకునే పురస్కారం కేవలం మన సంతృప్తి కోసమే అంటే అతిశయోక్తి కాదు.

అహం అన్నది దరిచేరనీయకుండా కులమతవర్గాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడాలేకుండా అందరినీ కలుపుకుని ఒక కూడలిగా సమాజ సేవకై అలుపెరుగక మున్ముందుకు సాగుతున్న నిండు మనిషి బట్టు నర్సిరెడ్డి గారు.

కొందరు కలుపుగోలు వ్యక్తులు ఉంటారు. మరికొద్ది మంది ఎవరినైనా కలుపుకొని పనిచేసే వ్యక్తిత్వం కలిగి ఉంటారు. అహం అన్నది దరిచేరనీయకుండా కులమతవర్గాలకు అతీతంగా చిన్నా పెద్దా తేడాలేకుండా అందరినీ కలుపుకుని ఒక కూడలిగా సమాజ సేవకై అలుపెరుగక మున్ముందుకు సాగుతున్న నిండు మనిషి బట్టు నర్సిరెడ్డి గారు. నిజానికి ఇవన్నీ ఉదాహరణ సహితంగా చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది.

ఆయన శాఖాహారి. ఆయన అహం వదిలిన స్వామి. సాధువే కానీ పరులకు బిక్షువుగా కానవస్తే తానసలు బాధ పడరు. ఎటువంటి పనైనా కావొచ్చు, లక్ష్య సాధనలో ఆటంక పరిచే వారు ఎదురైతే ‘శనిగ్రహాలు’ అనుకుని వారికి సైతం నమస్కారం చేసి, ఆనక కావాల్సిన దైవ కార్యాన్ని సఫలం చేసుకునే పరమ యోధులు తాను.

ఈ సమాజం సేవను చిట్ట చివరి అంశంగా భావిస్తున్నందన్న గ్రహింపుతో, స్వార్థపరమైన లౌకికులను ఎంతమాత్రం నిందించకుండా, సేవకు నడుంకట్టిన తనవంటి వారు భయటి ప్రభావాలకు లొంగకుండా, పరులు ‘పిచ్చివారు’ అనుకున్నా ‘బిచ్చగాల్లు’ అనుకున్నా వారిని తప్పుపట్టకుండా, చేపట్టిన పని నుంచి తప్పుకోకుండా ‘మనవంటి యాచకులకు ఓపిక ఉండాలి’ అని భోదిస్తూ, తాను ముందుకు నడుస్తూ మరి నలుగురినీ ఆత్మవిశ్వాసం వీగిపోకుండా కార్యోన్ముఖులను చేసే గొప్ప ఆచరణవాది, వివేకి నర్సిరెద్దిగారు. వారి నాయకత్వ లక్షణాలు సమున్నతం.

విద్యుత్ శాఖలో దాదాపు ఐదున్నర దశాబ్దాల క్రితం కింద ఇబ్రహీం పట్నంలో సబ్ ఓవర్సీర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన నర్సిరెడ్డి గారు ఇరవై ఏళ్ల క్రితం అసిస్టెంట్ ఇంజీ నీర్ గా పదవీ విరమణ చేసే దాక రైతాంగానికి ఎనలేని సేవలు అందించారు. వారికి అన్నివిధాలా తోడుగా నిలిచిన శ్రీమతి రామేశ్వరమ్మ గారు ఒక ముఖ్య వెన్నుదన్ను. వారి సహకారం కూడా ఈ సందర్భంగా కొనియాడాలి. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు. వారిని కూడా ప్రభుత్వం బడులలోనే చదివించారు నర్సిరెడ్డి గారు. ఒక్కమాటలో – ఎటువంటి ఆడంబరాలకు పోకుండా 77 ఏళ్ల సంతృప్తికర జీవితం నర్సిరెడ్డి గారిది.

ఇల్లు, కార్యాలయం, సమాజం – బడీ గుడీ కూడలీ ఇవన్నీ తనకు వారికి వేరువేరు అంశాలు కాదు. కాబట్టే పిల్లల పెంపకం, గృహస్తు జీవనం, విధి నిర్వహణ మొదలు సామజిక సేవ వరకూ అయన తనకు తానే ఒక మార్గదర్శి. శత్రువును సైతం మిత్రుడిగా ఎంచే స్వభావం వారిది. తన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రీమతి, పిల్లలు, శిష్యులు, స్నేహితులు, సహచర కార్యకర్తలూ, మీదు మిక్కిలి రైతుల దాకా – వారితో ప్రతి అనుభవం ఒక్కొక్కటి ఒక పాఠం.

తెలంగాణాలో కరంటు సొకర్యం వచ్చాక వివిధ కారణాలతో పలు దశాబ్దాల పాటు రైతాంగం పడ్డ పాట్లు తొలగించడంలో వీరి నిబద్దత, నిమగ్నత ఎంత గొప్పదంటే వారి కుమారుడి వివాహానికి చెప్పా పెట్టకుండా వేలాదిగా రైతులు లారీల్లో ఎడ్ల బండలపై స్వచ్చందంగా తరలి రావడం ఒక అందమైన ముచ్చట. ఇలా తాను ప్రతి ఒక్కరికీ రైతుబందే అయ్యారు. ఇలాంటి నిస్వార్థ అధికారుల వల్లే కదా మన గ్రామాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా పచ్చని పంట పొలాలతో కళకళ లాడాయి! స్వేదంతో తడిచిన రైతుల ముఖాలు వెలిగిపోయాయి.

అసందర్భం కాదు కనుక మరో ప్రస్తావన. రైతులు తమకు చేసిన సేవకు కృతజ్ఞతగా ఏమైనా ఇచ్చుకోవడం పల్లెటూర్లలో మామూలే. ప్రభుత్వ ఉద్యోగికి ‘మామూలు’ ఇవ్వడం సర్వ సాధారణమే. అది ఎరిగే అయన తన ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు. రైతులు తమ సంతోషం కోళ్ళను కోసి వండిపెట్టడాన్ని సైతం తిరస్కరించడం కోసం ఏనాడో ఆయన శాఖాహారిగా మారారు. ఈ ఉదాహరణ వారి నిస్వార్థ సేవకు, నిక్కచ్చి తనాన్ని పేర్కొనడానికే. ఇలాంటివి ఎన్నో.

వారి జీవన సఫల్య పురస్కారం సందర్భంగా తన గురించి పదుగురు చెప్పిన ఇలాంటి మాటలు ఘటనలు తల్చుకోవడం కూడా గొప్ప ప్రేరణ. ఇవన్నీ ఒక సదాశయం సఫలమైన తీరుకు ఉదాహరణలుగా చూడొచ్చు.

నర్సిరెడ్డి గారి చొరవ ఎందరినో మును ముందుకు నడిపించింది. వారి ప్రేరణ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షులు శ్రీమతి లీలా రెడ్డి గారికి ఒక రకంగా స్పూర్తినిస్తే ఎందరో యువకులకు మరో రకంగా నిలిచింది.

వారు కార్యాచారణలోని ప్రత్యేకత ఎదుటివారి దీక్షదక్షతలను గుర్తించడం, వాటిని ఇతోధికంగా అభివృద్ధి చేయడం. ఒకరు దేనికైనా పూనుకుంటే వారిని ఆ పనిలోకి దించి అదొక ఉద్యమంలా మార్చి తామే నమ్మలేనంతటి విజయాలు సొంతం చేసుకునేలా వెంట నిలవడం, అందుకు సదా ప్రేరణ అందించడం. అలాంటి కార్యశీలి కావడం వల్లే నర్సిరెడ్డి గారి చొరవ ఎందరినో మును ముందుకు నడిపించింది. వారి ప్రేరణ కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ అధ్యక్షులు శ్రీమతి లీలా రెడ్డి గారికి ఒక రకంగా స్పూర్తినిస్తే ఎందరో యువకులకు మరో రకంగా నిలిచింది. కానీ నర్సి రెడ్డి గారు మాత్రం వారి వెనకాల ఉండటం ఒక విశేషం. ముందే చెప్పినట్టు సంస్థలుగా ఎదిగించడంలో వారిదొక నిశబ్ద వ్యక్తిత్వం. వెన్నుదన్నూ. ఒక ముందరి ముందరి చూపు. అందుకు ఒక ఉదాహరణ చూడండి.

అది 2006. కల్వకుర్తి పట్టణం. మన బడిని బాగు చేసుకుంటే ఊరు బాగుపడుతుంది అంటూ ఒక 35 ఏళ్ల ఒక యువకుడు తమ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మాట్లాడుతున్నాడు. “గడిచిన జీవితం చాలు, ఇక నుంచి పూర్తికాలం సేవలో నిమగ్నమవుతాను. మీ వూర్లో బడి బాగు కోసం ఏమైనా సహాయం కావాలంటే మా ఫౌండేషన్ సహకారం కోసం నన్ను అడగండి” అని చెప్పి వేదిక దిగుతాడు. తన మాటలకూ పెద్దగా స్పందన లేదు. దాంతో తమ ఊరి నుంచి ఫౌండేషన్ కార్యక్రమాలకు ఇక మొదలు కావని, చెప్పిన ఆ మాటలు అంతటితో ముగిసాయనే అనుకున్నాడు అతను. కానీ వారంలోగా నర్సిరెడ్డి గారి నుంచి పిలుపు. “మా సొంతవూరు కొల్కుల పల్లి, మా అత్తగారి ఊరు ఇర్విన్. ఈ రెండు గ్రామాల నుంచి పని ప్రారంభిద్దామా?” అని అడగుతారాయన. ఎంత సంతోషం!

విశేషం ఏమిటంటే, నేడు నర్సిరెడ్డి గారికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న రెండు సంస్థల్లో ఒక సంస్థ వందేమాతరం కావడం ఒక అందమైన కృతజ్ఞాతాభి వందనం. అందరి తరపున శిష్యుడి ఆత్మీయ గురు దక్షణ.

ఆ తర్వాత ఆ యువకుడు ఆ చుట్టూ ముట్టు ప్రాంతాల్లో విరామం లేకుండా ఫౌండేషన్ పనిలోకి దిగాడూ అంటే, అలా దించింది నర్సిరెడ్డి  గారే. ఆ యువకుడు ఎవరో కాదు, మాధవరెడ్డి. అతడి పట్టుదల కారణంగా అప్పటికి ఏడాది ముందు వరంగల్ లో రవీందర్ గారు ప్రారంభించిన ‘వందేమాతరం’ ఫౌండేషన్ ఇక కల్వకుర్తి కేంద్రంగా కూడా పని ప్రారంబించడం మొదలైంది. అది నేడు విస్తరించి విద్యారంగంలో  ఎంత కృషి చేస్తున్నదో ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడో అందరూ ఎరిగినదే. ఇలా మాధవ రెడ్డి మాటలను ఆచరణలోకి తెప్పించి సర్కారీ బడులలో పెను మార్పుకు బీజం పడటానికి ఆ నాడు నర్సిరెడ్డి గారు సూచించిన ఆ రెండు బడులే ఆదర్శం అంటే అతిశయోక్తి కాదు. విశేషం ఏమిటంటే, నేడు నర్సిరెడ్డి గారికి జీవన సాఫల్య పురస్కారం అందిస్తున్న రెండు సంస్థల్లో ఒక సంస్థ వందేమాతరం కావడం ఒక అందమైన కృతజ్ఞాతాభి వందనం. అందరి తరపున శిష్యుడి ఆత్మీయ గురు దక్షణ.

చివరగా, వారి భాగస్వామ్య దృక్పథం, కలెక్టివ్ ఎఫర్త్స్ గురించి కూడా చెప్పాలి. నలుగురిని కలుపుకొని పోవడంలోని దార్శానికత ఎందుకో కూడా అర్థం చేసుకోవాలి.

బడుల రేపటి భవితకు పునాది ఆలయాలు. గుడులు నైతిక విలువలకు నిలయాలు. వాటి గురించి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా భరించాలి. ఐతే, మార్పుకు పూనుకునేటప్పుడు, ఓర్పు ఒక్కటే చాలదు అనేవారు తాను. ముఖ్యంగా ఎమేఎ ఆశించకుండా సేవారంగంలో నిమగ్నం అయ్యే వారి పట్ల సమాజంలో సందేహాలు ఉండటంలో తప్పులెంచ కూడదూ అనేవారు. ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయేమో అన్న సందేహాలూ, విమర్శలూ సహజం అంటారు తాను. వీటిని దాటుకుని పోవాలని గట్టిగా చెబుతుంటారు వారు.

‘యాచకుడుగా సమాజం భావించినా సరే, వేచి చూసి ఫలితంతో జవాబివ్వాలి’ అన్నది అయన సిద్ధాంతం.

ముఖ్యంగా సేవ అన్నది ప్రాధాన్యంలో లేని సమాజంలో సాధువు కూడా మోసగాడిగానో లేక భిక్షగాడుగానో కనిపించే ప్రమాదమూ ఉన్నందువల్ల నిస్వార్థంగా నిజాయితీగా ముందుకు సాగేవారు విమర్శలను పట్టించుకోవద్దని సూచిస్తారు ఆయన. ఇలాంటి సందర్భాల్లోనే వారు ‘యాచించే వాడు వేచి ఉండాలి’ అని చెబుతారు. ‘యాచకుడుగా సమాజం భావించినా సరే, వేచి చూసి ఫలితంతో జవాబివ్వాలి’ అన్నది అయన సిద్ధాంతం.

పరుషంగా అనిపిస్తుంది కానీ, “ఊరకుక్క అరవకపోతే అది కుక్క కాదు. కాబట్టి అనుకున్న లక్ష్యం కోసం మనం ముందుకే పోవాలి” అని కూడా ఆయన మంచికోసం, మార్పుకోసం నిలబడ్డ వారికి చెబుతుంటారు.

‘మనకు పిల్లలు దేవుండ్లు. ఆ దేవుళ్ళను చేరుకోవాలంటే నవగ్రహాలకు దండం పెట్టి పోవాలి. ఎవరితోనూ కొట్లాడవద్దు. ఘర్షణ కన్నా సామరస్యంగా పనిచేయడంపై దృష్టి పెట్టాలి’ అంటూ వారు ఆచరణాత్మకంగా బోధించడంలోని విజ్ఞత ఏమిటో మీరు ఈపాటికే గ్రహించి ఉంటారు.

“మన ఆదర్శం పెద్దది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అసహనానికు గురికావోడ్డు, అహంభావానికి సైతం పోకూడదని’ కూడా వారు చెబుతారు. అంతేకాదు, ‘ఒక్కరే చేయకుండా మార్పుకోసం పదుగురిని భాగస్వామ్యం చేయాలి’ అని కూడా అందుకే అంటారు. ఇలాంటి దృక్పథం కారణంగానే నర్సిరెడ్డి గారు ఎందరినో చైతన్యపరచ గలిగారు. వారికి కర్తవ్య నిర్దేశం చేయగలిగారు. ఉమ్మడి పాలమూరు ప్రాంతంలో ప్రవాస భారతీయులు అత్యధికంగా సేవా కార్యక్రమాల్లో నిమగ్నం అయ్యారంటే ఇలా ఆలోచించి మసలుకొన్న తన దీర్ఘదృష్టి ఒక ముఖ్య కారణం అనే చెప్పాలి.

మొత్తంగా, ఇవన్నీ నర్సిరెడ్డి గారి అనుభవైక్య సూత్రాలు. ఒక వ్యక్తి సంస్థగా పనిచేయడంలో పాటించిన అతి సామాన్యమైన జీవన సరళిలో భాగం అది. వారికి పురస్కారం అంటే ఎన్నో తెలుపు జీవన సాఫల్యమే.

అందరూ ఆప్యాయంగా ‘సార్’ అని పిలుచుకునే నర్సిరెడ్డి సార్ కు హృదయ పూర్వక అభినందనలతో…

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article