Editorial

Sunday, May 19, 2024
కాల‌మ్‌విశ్వశాంతికి పేలిన డైనమైట్ : ALFRED NOBEL

విశ్వశాంతికి పేలిన డైనమైట్ : ALFRED NOBEL

ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ డైనమైట్, జిలేటిన్ తయారు చేసినప్పుడు అవి మానవాళి అభివృద్ధికి దోహదం చేస్తాయని భావించారే తప్ప విధ్వంసానికి ఉపయోగిస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తరువాత తనవల్ల మానవాళికి చెడు జరుగుతోందన్న  భావన ఆయన్ను ఎంతగా కలచివేసిందీ అంటే  ఆ మనస్థాపంలోంచే నోబెల్ బహుమతుల ఆలోచన రెక్కవిప్పుకున్నది.

 ఎంత చిత్తశుద్ధితో డైనమైట్ రూపకల్పనకు కృషి చేశారో అంతే నిజాయితీతో ఆ మహా నీయులు శాంతిని కోరుకున్నారు. నేడు వారి వర్థంతి సందర్భంగా నోబెల్ జీవితకాల కృషి మననం తెలుపు ప్రత్యేకం.

రమేష్ చెప్పాల

నోబెల్‌ బహుమతి ఒక అత్యున్నత పురస్కారం, ఒక మహా స్వప్నం. మనదేశంలో పుట్టినవారు గానీ, ఈ దేశ పౌరసత్వం స్వీకరించిన వారు గానీ, ఈ దేశ వారసత్వం ఉన్నవారు గానీ నోబెల్‌ బహుమతి ప్రవేశపెట్టిన నూట పది సంవత్సరాలు దాటినప్పటి కేవలం ఎనిమిది మందిని మాత్రమే నోబెల్‌ బహుమతి వరించింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎందరో శాస్తవ్రేత్తలు నోబెల్‌ బహుమతి కోసం యాభై సంవత్సరాల పాటు ఎదురుచూసిన వారు ఉన్నారంటే దాని గౌరవం ఏపాటిదో తెలుసుకొనవచ్చు. ఏవిధంగా చూసినా ‘నోబెల్‌ బహుమతి’ వంటి విశిష్ట సత్కారం ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదనటం అతిశయోక్తి కాదు.

విజ్ఞానం అనంతమైనది. దానికీ కాలము, దేశము, జాతి వంటి అవధులు వుండవు. విజ్ఞాన ఖనులైన మహనీయులను మనం అన్ని విధాలుగా సత్కరించడం అవసరం. ఈ సత్కార్యాచరణ జరిపించాలనే సదుద్దేశంతో ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ తాను సంపాదించిన యావదాస్తితో పంతొమ్మిది వందల (1900) సంవత్సరంలో నోబెల్‌ సంస్థను స్థాపించి 1901 నుండి ప్రతి సంవత్సరం జాతి, మత, ప్రాంత వివక్ష లేకుండా మానవజాతి మేలుకోసం మహత్తరమైన కృషి చేసిన వారికి ఇవ్వడం ఆరంభించారు.

నోబెల్‌ బహుమతి ప్రదానోత్సవం ప్రతి సంవత్సరం ఆల్ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైనా డిసెంబరు 10వ తేదీ నాడు జరుగుతుంది. ఈ బహుమతి ప్రదానోత్సవం స్వీడన్‌ రాజు చేత స్టాక్‌హోమ్‌లోని సమావేశ మందిరంలో జరుగుతుంది. ప్రతి బహుమతి గ్రహీతకు ఒక యోగ్యతా పత్రం, బంగారు పతకం, బహుమతి ధనము, నిర్థారక పత్రాలనూ బహుకరిస్తారు. నోబెల్‌ బహుమతికై ఇచ్చే ధనం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. నోబెల్‌, తాను స్థాపించిన పరిశ్రమలపై వచ్చే ఆదాయాన్ని కూడా కొంత భాగం దీనికి మళ్ళించినందువల్ల ఈ మొత్తం ప్రతి సంవత్సరం మారుతూ వుంటుంది. దీని విలువ భారతీయ విలువ ప్రకారం 300 కోట్ల రూపాయలు.

ఈ భూమిపై మానవ జీవితాన్ని మెరుగుపరిచిన వారి పాండిత్యం, జ్ఞానం, విజ్ఞానానికి గౌరవార్థం డిసెంబర్ 10న నోబుల్ బహుమతి అందిస్తారు.

నోబెల్ పురస్కారం ఆరు ప్రముఖరంగాలలో విశేష కృషి చేసిన విశ్వ విజేతలకు ఇవ్వబడుతుంది.
అది భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం, వైద్యశాస్త్రము, ఆర్థిక శాస్త్రం, శాంతి రంగాలు.

ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇప్పటి వరకు ఎనిమిది మంది భారతీయులు అందుకున్నారు. వారు…రవీంద్రనాథ్‌ టాగూర్‌, సర్‌ సి.వి.రామన్‌, హర్‌గోవింద్‌ ఖొరానా, మదర్‌ థెరిస్సా (భారత పౌరసత్వం స్వీకరించినవారు), సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌, అమర్త్యసేన్‌, విద్యాధర్‌ సూరజ్‌ నయిపాల్‌, వెంకట్రామన్‌ రామకృష్ణన్‌లు.

ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మొదటి భారతీయుడు ఠాగూర్. జననములో, మృత్యువులో, ఈ లోకంలో, ఇతర లోకాలలో ఎక్కడెక్కడ నువ్వు నన్ను తిప్పినా.. నా అనంత పథచారివి నువ్వే నంటూ సున్నిత భావపరంపరతో ఆర్ద్రమైన, ప్రేమాస్పదమైన అజరామర భక్తిని చిలకరించినందుకు గాను టాగోర్‌ మన దేశం తరపున ఈ పురస్కారాని మొదటిసారి అందుకున్నారు.

విధ్వంసం నుంచి ఉదాత్తాశయం

ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, మిలిటరీ ఆయుధాల తయారీదారు, డైనమైట్ ఆవిష్కర్తా – నోబెల్. ఒక పాత ఇనుము, స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టి ఆఖరి విల్లు రాయడం విశేషం.

తన జీవితాన్ని ధార పోసి శాస్త్రవేత్తలు చేసే ఆవిష్కరణల ఫలితాలు ఎలా ఉంటాయన్నది మానవాళి వాటిని ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది. కత్తిని ఉపయోగించి డాక్టర్ ప్రాణాలు పోస్తాడు. అదే కత్తితో ఓ కిరాతకుడు ప్రాణాలు తీయవచ్చు. లోపం కత్తిలో లేదు ఉపయోగించే మనిషిలో ఉంది. అల్ఫ్రెడ్ నోబెల్ తాను తయారు చేసిన డైనమైట్ విధ్వంసానికి ఉపయోగిస్తారని ఊహించలేకపోయాడు. ఆ ఊహ వచ్చిన తక్షణం ఆయన వణికిపోయారు. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

నిజానికి అయన డైనమైట్, జిలేటిన్ తయారు చేసినప్పుడు అవి మానవాళి అభివృద్ధికి దోహదం చేస్తాయని భావించారే తప్ప విధ్వంసానికి ఉపయోగిస్తారని అస్సలు ఊహించలేదు. కానీ తరువాత తనవల్ల మానవాళికి చెడు జరుగుతోందన్న  భావన ఆయన్ను ఎంతగా కలచివేసిందీ అంటే  ఆ మనస్థాపంలోంచే నోబెల్ బహుమతుల ఆలోచన రెక్కవిప్పుకున్నది. ఎంత చిత్తశుద్ధితో డైనమైట్ రూపకల్పనకు కృషి చేశారో అంతే నిజాయితీతో ఆ మహా నీయులు శాంతిని కోరుకున్నారు.

ఆయనొక డైనమైట్…

1833 అక్టోబర్ 21న స్టాక్ హోమ్ స్వీడన్ లో అల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జన్మించాడు. అదే ఏడాది ఆయన తండ్రి ఇమ్మానుయేల్ నోబెల్ వ్యాపారంలో దివాలా తీశారు. పిల్లల్ని తల్లి వద్ద విడిచి డబ్బు సంపాదన కోసం ఫిన్లాండ్ వెళ్లిపోయారు. బలహీనంగా అనారోగ్యంగా ఉన్న అల్ఫ్రెడ్ను తల్లి అష్టకష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. అందుకే అల్ఫ్రెడ్ అమ్మకూచి అయ్యాడు. తండ్రి కనుగొన్న పేలుడు పదార్థం పట్ల రష్యా జార్ చక్రవర్తి ప్రత్యేక శ్రద్ధ చూపటంతో వీళ్ళ కుటుంబం దశ తిరిగింది. 1842 అక్టోబర్ 18న అల్ఫ్రెడ్ కుటుంబమంతా సెంట్ పీటర్ బర్గ్ రష్యా చేరుకుంది. తన కుమారులకు స్టాక్ హోoలో ఇవ్వలేని సుఖ, సంతోషాల్ని తండ్రీ ఇమ్మానియేల్ ఇక్కడ అందించారు. ప్రత్యేకంగా ట్యూటర్లను పెట్టి ఇంటి వద్దే చదివించారు. అలా అల్ఫ్రెడ్ రష్యన్,ఇంగ్లీష్,ఫ్రెంచ్, జర్మన్,భాషల్ని నేర్చుకున్నాడు. తండ్రి వద్ద ఇంజనీరింగ్ మెలకువలు తెలుసుకున్నాడు.పదహారేళ్ల వయసులో అల్ఫ్రెడ్ ఉన్నత చదువుల కోసం యూరప్ అమెరికా వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తండ్రి గనుల ప్రాజెక్టుల్లో బిజీబిజీగా ఉన్నారు. అయితే 1854లో క్రీమీ యుద్ధంలో రష్యా ఓడిపోవడంతో అల్ఫ్రెడ్ కుటుంబానికి మళ్లీ కష్టాలు వచ్చిపడ్డాయి యుద్ధానంతరం కొత్త జార్ రెండో అలెగ్జాండర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన కాంట్రాక్టు లన్నిటిని రద్దు చేశాడు. గోరుచుట్టుపై రోకటి పోటులా ఇదే సమయంలో ఇమ్మానియేల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించింది ఫలితంగా జీవితంలో రెండో సారీ దివాలా తీశాడు. అల్ఫ్రెడ్ తల్లిదండ్రులను తీసుకుని స్టాక్ హోమ్ తిరిగి వచ్చారు. తండ్రితో కలిసి కొత్త పేలుడు పదార్థాన్ని కనుగొనే ప్రక్రియలు నిమగ్నమయ్యారు. 1863లో నైట్రో గ్లిజరిన్ పేలుడు పదార్థానిగాను అల్ఫ్రెడ్ కు పేటెంట్ లభించింది. అల్ఫ్రెడ్ మదిలో మరొక ఆలోచన రూపుదిద్దుకొసాగింది…. చిన్న మొత్తం పేలుడు పదార్థం ప్రేరకంగా బారీ స్థాయి విస్పోటనం చేయాలన్నది అల్ఫ్రెడ్ యోచన. ప్రైమరీ ఛార్జ్ గా పిలిచే ఈ సూత్రమే భారీ విస్పోటన పదార్థాల తయారీకి వైజ్ఞానిక రంగంలో గొప్ప ఆవిష్కరణంగా పేర్కొనే గన్ పౌడర్కు మూలం ఈ సూత్రం. దీని ఆధారంగానే అల్ఫ్రెడ్ తన పరిశోధనలు కొనసాగించారు.

ఓ రోజు ప్రయోగశాలలో పేలుడు సంభవించి నలుగురు చనిపోయారు అందులో ఒకరు అల్ఫ్రెడ్ చిన్న తమ్ముడు. దీంతో స్టాక్ హోమ్ పట్టణంలో నైట్రో గ్లిజరిన్ తయారీపై ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా అల్ఫ్రెడ్ పరిశోధనను వీడలేదు ఆ మొండి పట్టుదలను చూసి అల్ఫ్రెడ్ కు పిచ్చి పట్టిందని కొంతమంది ప్రచారం చేశారు. మరికొంత మంది ఆయన కుటుంబాన్ని మృత్యు బెహరులు అని చిదరించుకున్నారు. ఎవరేమనుకున్నా తాను అనుకున్నదాన్ని సాధించేందుకే అల్ఫ్రెడ్ నిర్ణయించుకున్నారు.

పేలుడు పదార్థాల తయారీయే ప్రమాదాలతో కూడుకున్న వృత్తి. మానవాళికి ఉపయోగపడే ఈ వృత్తిలో దిగాక ప్రాణాల్ని లెక్క చేయకూడదు అన్నది అల్ఫ్రెడ్ సిద్ధాంతం.

పేలుడు పదార్థాల తయారీయే ప్రమాదాలతో కూడుకున్న వృత్తి. మానవాళికి ఉపయోగపడే ఈ వృత్తిలో దిగాక ప్రాణాల్ని లెక్క చేయకూడదు అన్నది అల్ఫ్రెడ్ సిద్ధాంతం. నైట్రో గ్లిజరిన్ సరఫరా చేస్తూ యూరప్ అంతట అల్ఫ్రెడ్ తన వ్యాపారాన్ని విస్తరించుకున్నారు. ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్న నైట్రో గ్లిజరిన్ ప్రమాదాలు సృష్టించేది అక్కడక్కడ పేలుళ్ళు సంభవించటం ఆయన్ను ఆందోళనలకు గురిచేసేవి. ప్రపంచవ్యాప్తంగా నైట్రో గ్లిజరిన్ నిషేధం విధించేస్తారేమోననే ఆందోళన కొత్త ఆవిష్కరణకు ప్రేరణైoది. దాంతో నైట్రో గ్లిజరిన్ ను గణ పదార్థంగా మార్చితే ప్రమాదరహితమవుతుందని భావించారు. చాక్ పీస్ పొడిని, చెక్క పొడిని, ఇటుక పొడిని,చివరకు సిమెంటును, కూడా ఉపయోగించి చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఒకరోజు జర్మనీకి పంపే నౌకలో ఉన్న కైసేల్ ఘర్ అనే పదార్థం కాలిపోయిన నైట్రో గ్లిజరిన్ ను పీల్చుకొని ఘన పదార్థంగా మారింది. తర్వాత కైసెల్ ఘర్ ను ప్రయోగశాలలో పరీక్షించి చూడగా నైట్రో గ్లిజరిన్ లాగానే పేలుడు శక్తి ఉందని రుజువైంది. దీనికో రూపాన్ని తీసుకొచ్చి పేల్చడానికి సాధనాన్ని ఉపయోగించి ‘డైనమైట్’ అని పేరు పెట్టారు. దీనికి 1867లో ఇంగ్లాండ్ తర్వాత అమెరికా పేటెంట్ మంజూరు చేశాయి. ఆ తర్వాత మరింత శక్తివంతమైన జిలెటిన్ బాల్ స్టైన్ లను రూపొందించారు. దాదాపు 355 ఆవిష్కరణలకు నోబెల్ పేటెంటు పొందారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి గనుల తవ్వకాలకు డైనమైట్ ప్రధాన వనరు అయ్యింది.

ప్రేమా… శాంతి…

ఇదిలా ఉండగా, వియన్నాలోని ఓ సేల్స్ గర్ల్ తో నోబెల్ ప్రేమలో పడ్డారు. కానీ ఆ అమ్మాయి కి హంగారి సైనికుడితో పెళ్లయింది. దాంతో ఆల్ఫ్రెడ్ నోబెల్ వివాహం చేసుకోలేదు. జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండి శాస్త్ర పరిశోధనకే జీవితాన్ని అంకితం చేశారు.

పారిస్ లో ఉన్నప్పుడు నలబై మూడేళ్ళ వయసులో అల్ఫ్రెడ్ నోబెల్ 33 ఏళ్ల బెర్తా వోన్ సుట్నర్ ను సెక్రటరీగా నియమించుకున్నారు. బెర్తా అపరంజి బొమ్మల ఉండేది. కంపెనీ వ్యవహారాలన్నీ ఆమెకు అప్పజెప్పారు. కానీ ఆమె వయసు మాత్రం వియన్నా లో ఉన్న తన ప్రేమికుడు ఆర్డర్ పై ఉండేది ఓ రోజు ఆర్డర్ నుంచి కబురు రావటంతో బెర్తా ఉన్నపళంగా వియన్నా వెళ్ళిపోయింది ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక పదేళ్ళ తర్వాత బెర్తా దంపతులు పారిస్ వచ్చారు అల్ఫ్రెడ్ నోబెల్ వారిని సాధారంగా ఆహ్వానించారు. యూరప్ లో అప్పటికే మంచి రచయితలుగా పేరొందిన బెర్తా- ఆర్డర్ లు సరే శాంతిని ప్రబోధిస్తూ ఉద్యమించాలనే యోచనలో ఉన్నారు నోబెల్ తో కూడా బెర్తా దీనిపై సుదీర్ఘ సంభాషణలు జరిపింది. ప్రపంచ శాంతి సదస్సుకు తనతో పాటు ఆల్ఫ్రెడ్ ను తీసుకెళ్ళింది. డైనమైట్ ను మనవాళి విధ్వంసానికి ఉపయోగించే అవకాశముందని అల్ ఫ్రెండును ఒప్పించేందుకు యత్నించింది. బెర్తా మాటలు అల్ఫ్రెడ్ నోబెల్ లో పశ్చాత్తాపాన్ని కలిగించాయి. తన వల్ల మానవాళికి చెడు జరుగుతోందనే భావన ఆయన్ను కలచివేసింది. ఆ మనస్థాపంలో నుంచే నోబెల్ బహుమతుల ఆలోచన రెక్కవిప్పుకుంది.

అవసాన దశలో కూడా ఆయన ఒంటరిగానే జీవించారు. మరణించేనాటికి ఇంట్లో సేవకుడు తప్ప బంధువులెవ్వరు దగ్గర్లేరు. 1896 డిసెంబర్ 10న తన పని చేసే బల్ల ముందు కూర్చొని తుది శ్వాస విడిచారు. ప్రతి ఏటా ఆయన స్మృత్యర్థం ఇదే రోజు నోబెల్ బహుమతులు ప్రధాన చేస్తుంటారు.

ఎంతో చిత్తశుద్ధితో డైనమైట్ రూపకల్పనకు కృషి చేశారో అంతే నిజాయితీతో వారు శాంతిని కోరుకున్నారు తర్వాత బెర్తాకు రాసిన లేఖలో తొలిసారిగా శాంతి ఉద్యమం గురించి తన నోబెల్ శాంతి బహుమతి గురించి ప్రస్తావించారు. దేశాల మధ్య స్నేహ భావాన్ని పెంపొందించి సైనిక ఘర్షణను రూపు మాపటమే లేదంటే తగ్గించటమో చేసి ప్రపంచ శాంతికి చేసిన వ్యక్తికి ఈ బహుమతి నివ్వాలని విల్లు రాశారు. భౌతిక, రసాయన, సాహిత్యం, వైద్య, శాస్త్రాల్లో కూడా అద్వితీయ ఆవిష్కరణలు చేసిన వారికి బహుమతులు ప్రవేశపెట్టారు. ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతిని 1969 నుంచి ఇస్తున్నారు నోబెల్ స్టిఫ్ట్ లె సెన్ అని ట్రస్టును స్థాపించి తన ఆస్తిని దీనికి రాసి చేశారు బహుమతుల బాధ్యతను స్వదేశం స్వీడన్ కు అప్ప చెప్పకుండా నార్వే పార్లమెంటుకు దాఖలు పరిచి అందర్నీ ఆశ్చర్యపరిచారు. నార్వే స్వీడన్ మధ్య అప్పుడున్న ఘర్షణలు తగ్గటానికి బహుశా ఆ విధంగా చేసి ఉండొచ్చు. నోబెల్ ఆస్తిపై వచ్చే వడ్డీని ఆరు భాగాలుగా చేసి ప్రతి ఏటా నోబెల్ బహుమతులు అందజేస్తున్నారు. అవసాన దశలో కూడా ఆయన ఒంటరిగానే జీవించారు. మరణించేనాటికి ఇంట్లో సేవకుడు తప్ప బంధువులెవ్వరు దగ్గర్లేరు. 1896 డిసెంబర్ 10న తన పని చేసే బల్ల ముందు కూర్చొని తుది శ్వాస విడిచారు. ప్రతి ఏటా ఆయన స్మృత్యర్థం ఇదే రోజు నోబెల్ బహుమతులు ప్రధాన చేస్తుంటారు.

కౌగిలింత అనుభూతి – ఈ ఏడాది పురస్కారాలు

సూర్యుడి నుంచి వచ్చే వేడిని, ఇష్టమైన వాళ్లను ఆలింగనం చేసుకున్నప్పుడు కలిగే వెచ్చదనాన్ని మన శరీరాలు ఎలా గుర్తిస్తాయో కనిపెట్టిన శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ ప్రైజ్ లభించింది. అమెరికాకు చెందిన డేవిడ్ జూలియస్, ఆర్డెమ్ పటాపూటియన్ సంయుక్తంగా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఉష్ణ గ్రాహకాలు, శరీర స్వర్శ, “కౌగిలింత అనుభూతి రహస్యాన్ని” కనిపెట్టిన ఇద్దరు శాస్త్రవేత్తలకు అత్యున్నత పురస్కారంవీరు చేసిన పరిశోధనలకు నోబెల్ బహుమతి ఇస్తున్నట్లు నోబెల్ జ్యూరీ వెల్లడించింది.
నోబెల్ బహుమతి కింద ఇద్దరు. రసాయన శాస్త్రవేత్తలు బంగారు పతకంతో పాటు 11 లక్షల అమెరికన్ డాలర్లను అందుకోనున్నారు.

దాంతోపాటు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కోసం కలం సాయంతో పోరు సాగించిన జర్నలిస్టులు మరియా రెస్సా, డిమిత్రి మురటోవ్ సంయుక్తంగా ఈ ఏడాది (2021) నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
(నోబెల్ బహుమతి -నోబెల్ శాంతి బహుమతి రెండు వేర్వేరుగా ఇస్తారు.)

విలేకరులు నిరంతర దాడులు, వేధింపులు, హత్యలు ఎదుర్కొనే దేశాల్లో వీరు వాక్ స్వాతంత్ర్యం కోసం శ్రమించారని ఎంపిక కమిటీ కొనియాడింది. ప్రజాస్వామ్యం, పాత్రికేయ స్వేచ్ఛకు ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలో “భావ వ్యక్తీకరణ హక్కు కోసం దైర్యంగా నిలబడ్డ విలేకరులు “ఆదర్శం కోసం నిలబడే జర్నలిస్టులందరి ప్రతినిధులు”గా వీరిద్దరినీ నోబెల్ కమిటీ పేర్కొంది. శాంతిని పెంపొందించడానికి ఈ స్వేచ్ఛ చాలా ముఖ్యమని తెలిపింది. మరియాది ఫిలిప్పీన్స్ కాగా దిమిత్రి స్వస్థలం రష్యా. ఈ పాత్రికేయుల నోరు నొక్కేయడానికి ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిలిప్పీన్సావాసి ఒకరు నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక కావడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది ఇప్పటివరకూ ప్రకటించిన నోబెల్ పురస్కారాల్లో చోటు దక్కించుకున్న తొలి మహిళ మరియానే కావడం విశేషం.

తెలుపు మననం

ఇలా ఈ మననీయుడి స్మృతి అనేక విధాలా అత్యున్నత మానవీయ విలువలకు ఆదర్శం, ప్రేరణ. వారు మనరించలేదనే చెప్పాలి. నోబెల్ పురస్కారాల కారణంగా వారు సదా జీవించే ఉన్నారు. వారి మననం ఒక ఉదాత్త భావన. అది విధ్వంసం నుంచి శాంతికి పయనం.

THE NOBEL PRIZE

రమేష్ చెప్పాల రచయితా సినీ దర్శకులు. మానవాళి శ్రేయస్సుకోసం కృషి చేసే మహనీయుల గాథలు వారికి ఇష్టమైన అధ్యయనం. జీవన తాత్వికతను తెలుపే సజీవ గాథల కల్పన ఇష్టమైన అభిరుచి ‘మా కనపర్తి ముషాయిరా’ వారి కథల సంపుటి. త్వరలో తీర్థయాత్రా సాహిత్యానికి చేర్పుగా మరో పుస్తకం తెస్తున్నారు.

More articles

1 COMMENT

  1. అత్యున్నతస్థాయి విశ్లేషణ చాలా బాగుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article