Editorial

Tuesday, April 23, 2024
సాహిత్యంచేనేత సాహిత్యం తెలుపు : చంద్రునికో నూలుపోగు చందం

చేనేత సాహిత్యం తెలుపు : చంద్రునికో నూలుపోగు చందం

Photograph by Kandukuri Ramesh Babu

చేనేత కులాల జీవన సాహితిపై ఒక చిత్తు ప్రతి వంటి ప్రయత్నంఇది. చంద్రుడికో నూలుపోగు వంటి ప్రస్తావన ఇది. వివిధ ప్రక్రియల్లో ఆయా రచనల కాలం, సదరు రచయితల ప్రాముఖ్యత బట్టి వరుస క్రమం మార్చి రాయవలసి ఉన్నప్పటికీ చదువరులకు సంక్షిప్త సమాచారానికి ఉపకరిస్తుందని చేనేత దినోత్సవం సందర్భంగా తెలుపు అందిస్తున్నది. ఇది సంపూర్ణం కాదని, విజ్ఞులైన పాఠకులు పంచుకునే సమాచారంతో మరోసారి సమగ్రంగా అందించవచ్చని కూడా గమనించగలరు.

కందుకూరి రమేష్ బాబు

మొదట కథ గురించి…

తెలుగు సాహిత్యంలో తొలి వృత్తి కథా రచయితగా పేరొందిన అందే నారాయణస్వామి గారు (1908-82) చేనేత జీవితాలపై ఎన్నో కథలు రాశారు. వారి రచనల్లో ‘పడుగు పేకల మధ్య బడుగులు’ అన్న కథ అత్యంత ప్రశస్తి పొందింది.  ‘వ్యత్యాసాలు’, ‘స్నేహితుడు’, ‘ఉపాసనా బలం’, ‘కారుణ్యం’, ‘చీకటి తెరలు’ పేరిట వారు కథల పుస్తకాలు తెచ్చారు.

మేడికృతి ఓబులేషు గారు, వెల్దండి శ్రీధర్ గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు కలిసి తెచ్చిన ‘పడుగు పేకలు’ కథా సంకలనంలో అందే నారాయణ స్వామీ గారు కథలు కూడా ఉన్నాయని తెలిసింది.

Photograph by Kandukuri Ramesh Babu

జి. రాములు గారి ‘అత్మఘోష’ ముఖ్యమైన కథ. గూడూరి సీతారం గారి కథలు కూడా ఉన్నవి. అలాగే, శ్రీపాద సుబ్రమణ్యశాస్తి గారి ‘పుల్లంపేట జరీ చీర’ ప్రసిద్ది చెందిన కథ. ఐతా చంద్రయ్య గారి ‘చిలకపచ్చ చీర’, కొక్కుల భాస్కర్ గారి ‘తెగిన పోగు’, ‘బొంబాయి బస్సు’ మొదలైన కథలున్నాయి.

కనపర్తి వెంకట లక్ష్మమ్మ ‘కుటీర లక్ష్మి’, చంద్రకళ ‘ప్రేమ వేదిక మీద’, తాడి నాగమ్మ ‘కథ కాదు’ వంటి కథలు చేనేత రంగం విశిష్టతను తెలిపాయి.

ఇటీవలి కాలంలో చేనేత రచయితలు తెచ్చిన కథలలో ‘నెమలికన్ను చీర’ పేరిట రాచపూటి రమేష్ గారు రచించినది కూడా ఉన్నది.

సిరిసిల్లకు చెందిన కవి, కథకులు జూకంటి జగన్నాథం గారు ఇక్కడి నేతన్నల తొలి ఆత్మహత్యల నేపథ్యంలో ‘వైపణి’ అన్న కథ 2002లో రాశారు. వారి కథల సంపుటికి కూడా ఈ పేరే పెట్టారు. అందులో సిరిసిల్ల కార్మికులు పొట్ట చేతబట్టుకుని బతక ఓయిన స్థితిగతులపై రాసిన ‘వలస’ కథ కూడా ఉన్నది.

బీ’ఎస్. రాములు గారు దాదాపు పధ్నాలుగు కథలలో పద్మశాలీల జీవితం చిత్రీకరించారు. అవి ‘నానమ్మ’, ‘వరుసలు’, ‘వారసత్వం’, ‘మలుపులు’ తదితర శీర్షికలతో ఉన్నాయి. వారు సంఘీయుల జీవితాలను స్పృశిస్తూ ‘బతుకుపోరు’, ‘జీవనయానం’, ‘చూపు’ పేర్లతో మరో మూడు నవలలు కూడా రచించారు

బుర్రకథ

నలభయ్యవ దశకంలోనే, 1944లోనే ‘చేనేత బుర్రకథ’ వచ్చింది. దాన్ని అక్కళ్ళ కోటయ్య గారు రచించారు.

నవల

లోకమలహరి గారు ‘సంఘం’ పేరిట యాభయ్యవ దశకంలోనే (1955లో) తొలి పద్మశాలీ నవల రాశారు. దాన్ని 2017లో ‘తెలంగాణ ప్రచురణల సంపాదక మండలి తిరిగి ముద్రించి అందుబాటులోకి తేవడం మంచిదైంది.

పోరంకి దక్షిణ మూర్తి గారు 1967లో ‘ముత్యాల పందిరి’ అన్న నవల రాశారు. వనం నరసింహారావు గారు ‘జరీ పూలు’ అన్న నవల 1984లో రాశారు. కాలువ మల్లయ్య గారు రాసిన ‘గువ్వల చెన్న’ 2005లో రాగా “అగ్గిపెట్టెలో ఆరు గజాల చీర’ పేరుతో మంథా భానుమతి గారు 2015లో మరో నవల రాశారు. కాగా, బి ఎస్ రాములు గారి ‘బతుకు పోరు’ అన్న నవలలో పద్మశాలీల జీవితంలో విడదీయరాని భాగమైన బీడీకార్మికుల స్థితిని కళ్ళకు కట్టారు.

కాగా, విశ్వనాథ సత్యనారాయణ గారి ‘బద్దన్న సేనాని’, ‘సముద్రపు దిబ్బ’ నవలల్లో కూడా పద్మశాలి ఇతివృత్తం ఉందని తెలిసింది. అలాగే ఉన్నవ గారి ‘మాలపల్లి’లో ‘సంగదాసు’ చేనేత కార్మికుడు.

నాటిక

మంగళగిరికి చెందిన భూపతి అనే కార్మిక రచయిత ‘జీవన వలయాలు’ అన్న నాటిక రాశారు. వారు ‘చేనేత బతుకు’ అన్న కవిత్వ సంపుటి, ‘దర్పణం’ అన్న కథల సంపుటి కూడా వెలువరించారు.

పద్య కవిత్వం

పోచంపల్లికి చెందిన కైరంకొండ నరసింహులు ‘పద్మశాలి శతకం’ తెచ్చారు. పెనుగొండ శ్రీనివాసులు గారు ‘శ్రీ భక్త మార్కండేయ శతకం’ రాశారు. అలాగే నల్లగొండ జిల్లాకు చెందిన ఏలే ఎల్లయ్య కవి గారు ‘బృగువంశం’ అన్న పద్యకావ్యం తేగా రాపోలు లక్ష్మీపతి గారు ‘పద్మశాలీ వస్త్ర ప్రశంస’ తెచ్చారు. ఆరెంపూడి నాగభూషణం గారు ‘చేనేత ఖండకావ్యం’ రాశారు.

వచన కవిత్వం

దేశవ్యాప్తంగా ఆకలి చావులు, ఆత్మహత్యల నేపథ్యంలో సజ్జా వెంకటేశ్వర్లు గారు, రుద్రజ్వాల గార్లు ‘మగ్గం ముక్కలైతుంటే…’ అన్న కవితా సంపుటిని సంయుక్తంగా తెచ్చారు. అలాగే, సజ్జా వెంకటేశ్వర్లు గారు – షరీఫ్ గార్లు కలిసి ‘చేనేత బతుకుపాట’ అన్న సంకలనమూ తెచ్చారు. విప్లవ కవి అయిన సజ్జా వెంకటేశ్వర్లు గారు 2004లో ‘సజ్జా కవిత్వం – సంకలనాలై పుష్పించండి’ అన్న స్వీయ కవితా సంపుటిని విరసం ప్రచురణగా తెచ్చారు.

Photograph by Kandukuri Ramesh Babu

శీలా సుభద్ర గారు ‘శేష వస్త్రం’ పేరిట కవితా సంపుటి తెచ్చారు. అలాగే, అనంతపురంకు చెందిన రాధేయ గారు ‘మగ్గం బతుకు’ పేరిట ఒక దీర్ఘ కవితను తెచ్చారు. దాన్ని హిందీలో తెచ్చారు. అలాగే, తర్వాత దాన్ని డా.పో.రమేష్ నారాయణ గారు ఆంగ్లంలో కూడా అనువదించి ఒకవైపు ఆంగ్లం మరోవైపు తెలుగులో తెచ్చారు. దానికి రాసిన ముందుమాట ఎంతో విలువైన సాహిత్య విషయాలు చర్చించినది.

రాధేయ వారు గత ముప్పయ్ ఏళ్లుగా ప్రతి ఏటా ఉత్తమ కవిత్వానికి తమ ఇంటిపేరుతో ఏర్పాటు చేసిన ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారాన్ని ఇస్తూ ఆధునిక తెలుగు సాహిత్య సేవలో ఎన్నదగిన కృషి చేస్తున్నారు.
సిరిసిల్ల నుంచి పత్తిపాక మోహన్ గారు ‘తెగిన పోగు’, కవితా సంపుటి, ‘కఫన్’ పేరిట నానీల పుస్తకం తెచ్చారు. రెండేళ్ళక్రితం ఇక్కడి నుంచే ఆడెపు లక్ష్మణ్ గారు ‘రాత్ ఫైల్… దివస్ ఫైల్’ పేరిట చేనేత నానీల సంపుటి తెచ్చారు. అలాగే, నల్లగొండకు చెందిన పున్న అంజయ్య తెలుగు ఆంగ్లంలో చేనేత నానీల సంకలనం తెచ్చారు. డా. బీంపల్లి శ్రీకాంత్ గారు కూడా ‘చేనేత మొగ్గలు’ తెచ్చారు.

నానీల ప్రక్రియకు ఆద్యులు, ప్రముఖ కవులు డా.ఎన్ గోపి గారు పద్మశాలియే. వారి స్ఫూర్తి అందుకుని పలువురు ఈ ప్రక్రియలో నేతన్నల ఆవేదన అవిష్కరిస్తుండటం విశేషం.

Photography by Kandukuri Ramesh Babu

కాగా, గుంటూరుకు చెందిన రవూఫ్ ‘సిరిసిల్ల దీర్ఘ కవిత’ పేరిట ఇక్కడి ఆత్మహత్యల తీవ్రమైన నేపథ్యంలో వారి సుదీర్ఘ దుఖాన్ని చిత్రిక పట్టారు. ఆ పుస్తకాన్ని సిరిసిల్లలోనూ విడుదల చేసి పద్మశాలీలకు మద్దతుగా నిలిచారు.

పోద్దుటూరుకు చెందిన సుప్రసిద్ధ శతావధాని సి.వి. సుబ్బన్న గారు ‘దుర్భిక్షము’ పేరిట ఒక కవితా సంకలనం తెచ్చినట్లు తెలిసింది. దుర్గం సుబ్భారావు గారు ‘ప్రతిభాశాలి పద్మశాలి’ పేరిట ఒక కవితా సంకలనం తెచ్చారు. టి.రాజారం గారు ‘అతడే’ అన్న దీర్ఘ కవిత తెచ్చారు. ఉండేలా మాలకొండా రెడ్డి గారు ‘కవితా పుష్పకం’ తెచ్చారు. ఐతే, ఇది కవితా ఖండికా లేదా పద్య కావ్యమా చూడాలి.
కవితా సంపుటులు కాకుండా విడివిడిగా ఎందరో బలమైన కవితలు రాశారు. అందులో అవంత్స సోమసుందర్ గారి ‘తారా ఫలితం’ ఒకటి.

పెరుగు రామకృష్ణ గారు, ప్రసాద మూర్తి గారు, ఈగ హనుమాన్ గారు, బల్ల సుందరయ్య గారు, లకుమ గారు, పులిపాటి గురుస్వామి గారు, మధుర శ్రీ గారు- ఇంకెందరో రచించిన కవితలు నేత హృదయం నుంచి విరిసిన పద్మాలే. పేరు పేరునా వాటిని మరోసారి ప్రస్తావించుకోవాలి.

కాగా, సురవరం ప్రతపరెడ్డి గారు తెచ్చిన ‘గోలుకొండ కవుల సంచిక’లో కూడా పద్మశాలి కవులున్నారు. అందులో కొండా ఎల్లయ్య దాస్ గారు రచించిన శతకాలు ప్రచురితమయ్యాయి.

Photograph by Kandukuri Ramesh Babu

పాట

సినారే గారు రచించిన ‘ఎక్కడున్నాడో కొడుకు’ అన్న పాట ప్రసిద్ధం. అలాగే, నల్ల ఉపేందర్ గారి పాటలు, గుండేటి రమేష్ గారి పాటలున్నాయి. కొక్కుల భాస్కర్ గారు కూడా పాటలు రాశారు. విరసం చేనేత పాటలను ఒక సంకలంగా తెచ్చినట్లు తెలిసింది.

వ్యాసం

పుత్సల సత్యనారాయణ గారు చరిత్రను సంక్షిప్తంగా ‘చేనేత దర్పణం’ పేరిట వ్యాసాల సంపుటి తెచ్చారు. అలాగే, దుర్గం సుబ్బారావు గారు, గోలి సీతారామయ్య గారు, డి.నరసింహారెడ్డి గారు, సురేష్ గార్లు వ్యాసాల సంపుటులు తెచ్చినట్లు తెలిసింది. హుజూరమ్మ గారు కూడా చేనేత వ్యాసాల సంపుటి తెచ్చారు.
పద్మశ్రీ గజం గోవర్ధన్ గారు 2012లో తిరుపతిలో నిర్వహించిన నాలుగో తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ‘తెలుగు నాట చేనేత’ పేరిట చక్కటి గ్రంధాన్ని తెచ్చారు.

నివేదికలు – ప్రత్యేక సంచికలు

చేనేతపై అనేక నివేదికలు వచ్చాయి. నిజామాంద్ర పద్మశాలీ కష్ట నివారణ మహాసభ చరిత్ర, సంచికలు వచ్చాయి. ఎక్కాల్ దేవి లక్ష్మణ భాగవతార్ (కోరుట్ల ) సంచికలు 60 – 75 దశకం మధ్య వచ్చాయని తెలిసింది.

చరిత్ర

ఎల్లకర నృసింహకవి రచించిన పద్మశాలి మార్కండేయ పురాణం ఉంది. అలాగే పుట్ట లక్ష్మీనారాయణ గారు ‘మార్కేండేయ చరిత్ర’, ‘శ్రీపద్మ ప్రకాశిక పుస్తకాలు’ వెలువరించారు. సంపాదకులు డా. బీంపల్లి శ్రీకాంత్.
జనగామకు చెందిన మోహన కృష్ణ ‘శ్రీ భార్గవ పద్మశాలి చరిత్ర – వైదిక సంప్రదాయము’ అన్న గ్రంధాన్ని వెలువరించారు.

Photography by Kandukuri Ramesh Babu

తడక యాదగిరి గారు సంఘ మిత్ర ప్రచురణల పేరిట తెచ్చిన పుస్తకాల్లో శ్రీ గుంటుక నరసయ్య పంతలు గారు 1937లో వెలువరించిన ‘బ్రుగ్వాదుల ప్రభావము : పద్మశాలీయుల పూర్వోత్తర చరిత్ర’ను తిరిగి ముద్రించారు. వారు కూడా ఒక పత్రిక నడిపారని, అందులో వనం నరసింహరావు గారి ‘జరీపూలు’ నవలను పునర్ముద్రించినట్లు తెలిసింది. అన్నట్టు, తడక కల్పన గారు కూడా కథలు కూడా రాశారు.
తులనాత్మక పరిశీలన

చల్లా రామారావు గారు ‘దేవాంగ పురాణము -భావనారుషి పురాణముల తులనాత్మక పరిశీలన’ పేరిట ఒక గ్రంధం తెచ్చారు.

జీవిత చరిత్ర -స్వీయ చరిత్ర

ప్రగడ కోటయ్య గారి జీవిత చరిత్ర, గుంటుక నర్సయ్య గారి జీవిత చరిత్రలు వచ్చాయి. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జీవిత చరిత్ర వచ్చింది.

శీలా వీర్రాజు గారి స్వీయ చరిత్ర వచన కవిత్వంగా వచ్చింది. అలాగే, ఎన్ గోపి గారు, అనుమాండ్ల భూమయ్య గారు, రవ్వా శ్రీహరి గార్ల స్వీయ చరిత్రలను ‘పరిణత వాణి’ పేరిట తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రచురించింది. అలాగే, బిట్ల నారాయణ గారు ‘నా అంతరంగ తరంగాలు’ పేరిట తన ఆత్మకథను వెలువరించారు. బీఎస్. రాములు గారి ‘సృష్టికర్త ఆత్మ చింతన’ కూడా ఉంది. నల్ల నర్సింలు జీవిత చరిత్ర, బండ సరోజన గారి స్వీయ చరిత్ర కూడా వచ్చింది.

పత్రిక

సిరిసిల్ల నుంచి కొక్కుల భాస్కర్ గారు ‘పద్మపీఠం’ అన్న పత్రికను తెస్తున్నారు. పోచంపల్లి నుంచి తడక యాదగిరి గారు ‘చిటికి’ అన్న పత్రికను తెస్తున్నారు. హైదరాబాద్ నుంచి సీనియర్ పాత్రికేయులు కొడం పవన్ కుమార్ గారు ‘నూలు పున్నమి’ అన్న మాస పత్రికను తెస్తున్నారు. వరంగల్ జిల్లా నుంచి ఎల్ ఎం.స్వామీ గారు ‘పద్మమిత్ర’ మాస పత్రికను నడుపుతుండగా నల్లగొండ జిల్లా నుంచి పున్న అంజయ్య గారు ‘పద్మ దర్శిణి’ మాస పత్రికను వెలువరిస్తున్నారు. గోదావరిఖని నుంచి శంకరయ్య గారు ‘పద్మ కెరటం’ పత్రికను తెస్తున్నారు. అలాగే, ‘పద్మాంజలి’ అన్న మాస పత్రిక కడప నుంచి, ‘మార్కండేయ’ అన్న మాస పత్రిక విజయవాడ నుంచి వస్తున్నది. గతంలో పెండెం రవేందర్ గారు ‘పద్మజ్యోతి’ పత్రికను తెచ్చారు. పున్న ఎల్లప్పు గారు ‘బృగుభేరి’, ‘పద్మశాలి’ పత్రికలను తెచ్చారు. అరవై నుంచి ఎనభయ్యవ దశకం వరకు ‘నేత’ అన్న పత్రిక కూడా వచ్చినట్లు తెలిసింది.

కాగా, జాతీయ చేనేత దినోత్సవం రూపకర్త వెంకన్న నేత గారు ‘నేత’ అన్న మాస పత్రికను 2004లోనే తెచ్చారు.

పత్రికలతో పాటు కొక్కుల భాస్కర్ గారు తన సంపాదకీయాల పుస్తకం కూడా ప్రచురించారు. అలాగే టంకశాల అశోక్ గారు వార్త పత్రికలో చేనేత సంక్షోభంపై రాసిన వరుస కథనాలు కూడా ముఖ్యమైనవే. అందులో ‘దుబ్బాక నోట్స్’ మీకు గుర్తుండే ఉంటుంది..

పరిశోధన

జనగామకు చెందిన కొడం కుమార్ గారు తెలుగు సాహిత్యంలో చేనేత జీవన వృత్తి చిత్రణ అన్న అంశంపై ఉస్మానియా విశ్వవిధ్యాలయంలో పిహెచ్ డి చేస్తున్నారు.

పద్మశాలి ఆశ్రిత కులాలైన కూనపులి, సాధనా శురులాపై సురేష్ బాసని గారు పరిశోధన చేశారు. అలాగే ప్రసిద్ద చిత్రకారులు ఏలే లక్ష్మణ్ గారు కూనపులి వారిపై పి హెచ్ డి చేశారు.

కాఫీ టేబుల్ బుక్

2011 లో నూపూర్ కుమార్ గారు తెలుగు రాష్ట్రాలలోని వివిధ వస్త్ర శైలులను పరిచయం చేస్తూ Threads of Hope: The Magical Waves of Andhra Pradesh పేరిట కాఫీ టేబుల్ బుక్ తెచ్చారు. దీనికి హృద్యంగా నేతకారుల ఛాయా చిత్రలేఖనం చేసింది ప్రముఖ ఫోటోగ్రాఫర్ డి. రవీందర్ రెడ్ది గారు.

చలన చిత్రం

Shyam Benagal’s Susman poster

శ్యాం బెనగల్ గారు ‘సుస్మన్’ పేరిట తీసిన హింది చిత్రం చేనేత కారులపై వచ్చిన తొలి ఫీచర్ ఫిల్మ్ కాగా, ఇటీవల తెలుగులో ‘మల్లేశం’ పేరిట రాజ్ రాచకొండ గారు తీసిన చిత్రం తాజా చిత్రం. మధ్యలో ‘కంజీవరం’ అన్న తమిళ చలన చిత్రం కూడా చేనేత కారుల ఇతివృత్తంతో వచ్చినదే.

కే.వి రెడ్డి గారి మల్లీశ్వరి చిత్రంలో నాయికా నాయకులు చేనేత కులానికి చెందిన వారే. మల్లీశ్వరి చిత్రంలో మనం చూసే పద్మశాలీ వీధికి నమూనా అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉన్న వీధే అంటారు. ఇలాంటి ఎన్నో విషయాలు అటు సాహిత్యం, చలనచిత్రం, పరిశోధన రంగాల నుంచి మరోసారి యాది చేసుకోవాల్సి ఉన్నది.

చిత్రకారులు

తెలంగాణా జన జీవితాన్ని అపూర్వంగా చిత్రించిన ఏలే లక్షణ్ గారు వృత్తి జీవితంపై కూడా చిత్రాలు వేశారు. అలాగే పొట్టబత్తిని మహేష్ గారు చేనేత కులస్థుల జీవన సంక్షోభంపై గాడమైన చిత్రాలెన్నో వేశారు. వారు కండె ప్రధానంగా చిత్రించిన బొమ్మలలో విషాదంతో పాటు ఆనందం మూర్తిభవించడం విశేషం.

Painting by Mahesh Pottabathini

పై సమచారంలోని తప్పొప్పులను సవరించుకునేందుకు, ఈ నోట్ మరింత సమగ్రంగా రాసేందుకు దయచేసి సహకరించవలసిందిగా కూడా మనవి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో పంచుకోవచ్చునని గమనించగలరు.

 

More articles

2 COMMENTS

  1. Good Article Ramesh garu… so informative and educative artical….Thank you so much….National Handloom Day greetings…🙏.🎉🎉🎊🎊🙏

  2. చేనేత వారి గురించిన రైటప్ చాలా తెలియని విషయాల్ని తెలిపింది. విభజిత ఆంధ్రప్రదేశ్ లోని చేనేతకు ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రాంతాలు వెంకటగిరి, పేటేరు, చీరాల, భట్టిప్రోలు లాంటి చోట్ల తెలుసుకోవలసిన విశేషాలుండి ఉంటాయి. గుంటూరు జిల్లా ఐలవరం లోని చేనేత వారి గురించి నక్కా విజయ రామరాజు గారు చాలా హృద్యంగా రాసింది చదివాను. పేరు గుర్తు లేదు. మంగళగిరి సమీపంలోని నిడమానూరుకి చెందిన నాస్తిక ఉద్యమాన్ని స్థాపించిన రామకృష్ణ గారు కూడా చేనేత కళాకారుల జీవితాన్ని ఆవిష్కరిస్తూ రాసిన ఒక కవితా సంపుటిని చదివాను. మొత్తానికి మంచికృషి చేసిన మీకు ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article